యూనిట్

దర్యాప్తునకు సంబంధించి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అధికారిత పరిధి

(గత మాసం తరువాయి)

ఉదా :- ఒక వ్యవహారములో వివిధ నేరములు అగు దొంగతనము (Theft), బలాద్గ్రహణము (Extortion) కొంతమంది వ్యక్తులు కలిసి చేసినారు. ఈవిధంగా దొంగిలింపబడిన ఆస్థి ఇంకొక వ్యక్తి సహాయముచే దాచిపెట్టినారు. ఆ తరువాత మరొక వ్యక్తి సహాయముచే ఇంకొకనికి తక్కువ ధరలో అమ్మినారు. ఇక్కడ అందరి నేరస్థులను ఒకే సమర్థవంతమైన కోర్టులో విచారణ జరుపవచ్చును. ఇక్కడ ఉన్న వివిధ అపరాధములు 379, 384 R/w 34, 414 & 411 IPC వీటన్నిటినీ కలిపి అందరి నేరస్థులపై ఏయే సమర్థతగల కోర్టుయందు విచారణ జరిపించవచ్చును. సాధారణంగా ప్రతి నేరస్థుడిని అతను చేసిన నేరమునకు వ్యక్తిగతంగా వేరే విచారణ జరుపవలెనని సూత్రము కలదు. కాని సి.ఆర్‌.పి.సి.లోని సెక్షన్స్‌ 219, 220, 221 & 223 సి.ఆర్‌.పి.సి. ప్రకారం అన్ని అపరాధములను మరియు అందరినీ కలిపి ఒకే సమర్థతగల కోర్టులో విచారణ చేపట్టవచ్చును.

సెక్షన్‌ 185 సి.ఆర్‌.పి.సి.ని అనుసరించి ప్రభుత్వానికి ఒక కేసును వేరొక సెషన్స్‌ డివిజన్‌కు పంపే అధికారము ఉంది :ఏదేని ఒక కేసును లేక ప్రత్యేక కేసును ఒక జిల్లాలో విచారణ నిమిత్తం ఉండినటువంటి దానిని మరొక సెషన్స్‌ డివిజన్‌లో విచారణ నిమిత్తం పంపుటకై ఈ చాప్టరులోని నిబంధనములతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారము కలదు.

ఒకవేళ ఆ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వారు గానీ, హైకోర్టు వారు గానీ ఇదివరలో ఏమైనా ఉత్తర్వులు జారీ చేసియుండి ఉంటే దానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది

ఉదా :- గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులకు సంబంధించి వివిధ కోర్టుల్లో, పలు జిల్లాల్లో కేసులు బుక్‌ చేయడం జరిగింది. వాటి ఛార్జిషీట్‌ లను సంబంధిత కోర్టులలో వివిధ జిల్లాలలో వేయవలసి ఉంటుంది.

అందుకు బదులుగా అన్ని కేసులను ఒకే సెషన్స్‌ డివిజన్‌లో నడుచుటకై గవర్నమెంట్‌ ఉత్తర్వును జారీ చేయవచ్చును. ఇంతకు పూర్వము హైకోర్టు వారు గానీ, సుప్రీంకోర్టు వారు గానీ దీనికి విరుద్ధంగా లేదా ఏవైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి  ఉత్తర్వులు ఇవ్వకూడదు.

సెక్షన్‌ 188 సి.ఆర్‌.పి.సి. :సెక్షన్‌ 188 సిఆర్‌పిసిని అనుసరించి ఒక అపరాధమును భారతే దేశము నందలి కోర్టులో విచారణ జరుపుటకు మరియు అట్టి కేసును భారతదేశంలో దర్యాప్తు చేయటానికి గల అధికారములు భారత దేశ పౌరుడు అయి ఉండీ, అతను High Seas నందు లేదా భారతదేశము వెలుపల ఎక్కడయినా నేరము చేసినపుడు గాని, లేక భారత దేశ పౌరుడు కాకున్ననూ అతను ప్రయాణముచేయు ఓడ లేక విమానము భారత దేశము నందు రిజిష్టరు అయి ఉండినచో అటువంటి వ్యక్తి ఏదైనా అపరాధము చేసినపుడు. సదరు వ్యక్తి భారత దేశ భూభాగము నందు అపరాధము చేసి ఉంటే ఏవిధంగా ఉంటుందో అదే విధముగా పరిగణించి భారత దేశము నందు అతడు ఏ కోర్టు పరిధిలో కనపడినాడో ఆ కోర్టు నందు విచారణ చేయవచ్చును. భారతదేశము నందు సదరు వ్యక్తి కనబడు స్థలం నందు గాని లేదా అతనిపై ఏవైనా పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు అయి ఉండినచో, ఆ స్టేషన్‌ పరిధిలోని కోర్టు యందు విచారించ వచ్చని ఉన్నత స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, సదరు కోర్టుకు విచారించే అధికారం కలదు.

సెక్షన్‌ 4 ఐ.పి.సి. ని అనుసరించి భారత దేశ పౌరుడు అయి ఉండి లేదా భారతదేశంలో రిజిష్టర్‌ అయిన ఓడ లేక విమానము నందు ప్రయాణించు ఎవరయినా వ్యక్తి ఐ.పి.సి.లోని ఏదైనా అపరాధము చేసినచో ఈ ఐ.పి.సి. లోని అన్ని అపరాధములు ఆ వ్యక్తికి వర్తిస్తాయి అని చెప్పబడినది.ఈ విధంగా ఐ.పి.సి. (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) సదరు వ్యక్తికి వర్తిస్తుంది కావున సెక్షన్‌ 3 ఐ.పి.సి. ప్రకారం సదరు వ్యక్తి భారత దేశము నందు విచారణ జరిపి అతను నేరమునకు శిక్షను వేయవచ్చును. అంటే భారత దేశము నందు నేరము చేస్తే ఏవిధంగా ఉంటుందో ఆ విధంగానే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చును. దాని ప్రకారం భారత పౌరుడు భారతదేశం దాటి అవతల ఎక్కడైనా ఏదైనా చర్య లేక తప్పిదము చేసినచో అట్టిది ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం గాని లేదా భారత దేశము నందు ఏదైనా కోర్టులో విచారించవచ్చును.

అంతేకాకుండా భారత దేశము నందు రిజిష్టర్‌ అయిన ఓడ లేక విమానము అది ఎక్కడ ప్రయాణించుచున్నా, అందులోని ఎవరయినా వ్యక్తి అంటే భారత పౌరుడు కానీ లేదా వేరే దేశ పౌరుడు కానీ భారత చట్టాల ప్రకారం అతను చేసిన చర్య అపరాధము అయితే భారత దేశములో ఏదైనా కోర్టు నందు విచారించవచ్చును.

దర్యాప్తు చేసే అధికారం

ఈ సెక్షన్‌ 156 (1) సిఆర్‌పిసి ని అనుసరించి భారత దేశములోని కోర్టుకు ఏదైనా అపరాధమును పరిశీలన లేక విచారణ చేసే అధికారం ఉంటే ఆ కోర్టు పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఓ. గారికి ఆ కేసును దర్యాప్తు చేసే అధికారం ఉంటుంది. 

--ఇ. రాములు , లీగల్‌ అుడ్వయిజర్‌ టు కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, హైదరాబాద్‌.

వార్తావాహిని