యూనిట్
Flash News
నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ విభాగం
పదార్థాలు, ఉత్పత్తులు, నిర్మాణాలు
లేదా భాగాలు వైఫల్యం చెందటం లేదా సరిగా పనిచేయకపోవటం వల్ల వ్యక్తులకు గాని లేదా ఆస్తులకు
గాని నష్టం వాటిల్లినప్పుడు అట్టి సంఘటనా స్థలాన్ని దర్యాప్తు చేసి కారణాలు
కనుగొనే ప్రక్రియే 'ఫోరెన్సిక్ ఇంజనీరింగ్'. ఈ
విభాగంలోని నిపుణులు వాహనాలు లేదా యంత్రాల నిర్వహణలో జరిగే ప్రమాదాలు లేదా
సంఘటనలలో వైఫల్యాలను, కారణాలను
గుర్తించి ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి దర్యాప్తునకు కోర్టుకు
సహాయ పడతారు. ఈ క్రింది కేసులలో దర్యాప్తు అధికారికి వీరు సహకరిస్తారు.
1. వాహన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన
ప్రమాదాలు, ఫ్యాక్టరీలలో
జరిగే ప్రమాదాలు మొదలైన వాటిలో సంఘటనలను పునర్నిర్మాణం చేయటంలో.
2. వంతెనలు, భవనాలు, ఆనకట్టలు
వంటి నిర్మాణాలు కూలిపోయినప్పుడు వీటి నిర్మాణానికి ఉపయోగించిన ముడి పదార్థాల
నాణ్యతను, సంఘటనా
స్థలంలో సేకరించిన శకలాల పరీక్షల ద్వారా వైఫల్యాలను నిర్ధారించడంలో.
3. యంత్ర లోహపు భాగాలు, ఉత్పత్తులు మొదలైన వాటిలో వైఫల్యానికి గల కారణాలు తెలుసుకోవడంలో ఈ
విభాగపు నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించి భౌతిక సాక్ష్యాధారాల సేకరణలో
దర్యాప్తు అధికారికి సహకరించటమే కాక సంఘటనను పునర్నిర్మాణం చేయటం, వైఫల్యానికి గల కారణాలను గుర్తిస్తారు. ఈ సంఘటనలలో
వీరు ఇంజనీరు నియమాలను, మూల
సూత్రాలను, విధానాలను, పరిశోధనా పద్ధతులను ఉపయోగించి నిర్మాణాలలో లేదా
యంత్రాలలోని లోపాలను గుర్తించటం, అందులో
ఉపయోగించిన ముడి సరుకు నాణ్యతను, శక్తిని
పరీక్షించి తమ విలువైన నివేదికలను ఇచ్చి, సహకరిస్తారు.
వైఫల్య విశ్లేషణ ప్రక్రియలో ఈ నిపుణులు మూడింటిని
పరిగణనలోకి తీసుకొని పరీక్షిస్తారు. అవి.
1. ఉత్పత్తుల లేదా ముడి సరుకుల వైఫల్యం
2. విధాన వైఫల్యం
3. రూప రచన వైఫల్యం
ఉదాహరణకు ఒక బిల్డింగు లేదా వంతెన కూలిన ప్రమాదంలో
వాటిని నిర్మించడానికి ఉపయోగించిన సిమెంటు/ కంకర/ ఇసుకల నిష్పత్తి మరియు నాణ్యత
మరియు అందులో ఉపయోగించిన ఇనుప చువ్వలు, స్టీల్ రాడ్లు, బోల్టులు, నట్లు కారణమైతే దానిని ఉత్పత్తుల లేదా ముడి సరుకుల
వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా, వాడిన మెటీరియల్ వల్ల వైఫల్యమా? లేకా అధికభారం వల్లా? తుప్పుపట్టినందువలనా? పెళుసుతనం వల్లనా? లేక
మరే ఇతర కారణాల వల్లనా? అని
నిర్ధారణ చేసి ఈ విధంగా వైఫల్యం చెందిన మెటీరియల్ లక్షణాలను బట్టి ఎక్కడ? ఎలా? మొదలైంది అని తెలుసుకున్న తర్వాత అలా కావడానికి కట్టుబడి విధానంలో
ఏమైనా వైఫల్యాలున్నాయో! చూసి వీటితో పాటు డిజైన్లో లోపాల వల్ల వైఫల్యం చెందేందుకు
అవకాశాలున్నాయా? అన్న
విషయాలు తెలుసుకుంటారు. అంతేకాక నాసిరకం మెటీరియల్ ఏమైనా ఉపయోగించారా? వెల్డింగుల్లో లోపాలవల్ల వైఫల్యం చెందిందా? వంటి వివిధ కారణాలను కూడా అధ్యయనం చేస్తారు.
వాహన ప్రమాదాలు:
వాహనాలు గుద్దుకోవటం, లేదా పాదచారిని, జంతువును, స్తంభాన్ని, చెట్టును లేదా భవనాన్ని ఢీకొనిన సందర్భాలలో ఈ
విభాగపు నిపుణులు కారణాలను విశ్లేషిస్తారు. ముఖ్యంగా వేగాన్ని, రహదారిలోని లోపాలు లేదా స్పీడ్ బ్రేకర్లు, వాతావరణ పరిస్థితులు, డ్రైవర్ ఏవైనా మత్తు ప్రభావానికి లోనై ఉన్నాడా? ఇంజన్లో లోపాలేవైనా ఉన్నాయా? ప్రమాదంలోని ప్రయాణికులకు అయిన గాయాలు మొదలైనవి
అధ్యయనం చేసి వాస్తవాలను గుర్తిస్తారు.
ఉదాహరణకు 2013లో అక్టోబర్ 30న జరిగిన మహబూబ్నగర్ వోల్వో బస్సు అగ్నిప్రమాదంలో 45 మంది
మరణించిన సంఘటనలో ఈ బస్సు డ్రైవర్ ఒక కారును ఓవర్ టేకింగ్ చేస్తూ కల్వర్టు
దిమ్మను ఢీకొని ఘర్షణవల్ల డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకొని అగ్నిప్రమాదం
సంభవించినట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. అంతేకాక రోడ్డు నిర్మాణ లోపం, నిబంధనలకు విరుద్ధంగా సీట్లు పెంచటం, బస్సులో ఓవర్ లోడ్ లగేజి, వోల్వో బస్సు తయారీలో లోపం టైర్లకు సమీపంలోనే ఇంధన
ట్యాంకు ఉండటం, ప్రమాదానికి
కారణాలుగా చెప్పటమేకాక, ప్రమాదంలో
గుర్తుపట్టలేని విధంగా ఉన్న శవాలను డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియతో
గుర్తించి వారి బంధువులకు అప్పగించారు.
రైలు ప్రమాదాలు:
ఏవైనా రైలు ప్రమాదాలు జరిగినప్పుడు అంటే తగులబడి
పోవటం, పట్టాలు
తప్పడం వంటి కేసుల్లో ఫోరెన్సిక్ బృందాలను పిలవటం పరిపాటే. వీరు ఈ ప్రమాదం
జరగడానికి విద్రోహచర్యా? లేక
వైఫల్యమా? అయితే
ఎందువల్ల? అన్న
కోణాల్లో పరిశోదిస్తారు. ఉదాహరణకు 21 డిసెంబర్ 2002లో హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్
రైలు కర్నూలు వద్ద పట్టాలు తప్పిన ఘటనలో 20 మంది మరణించగా, 80 మంది గాయపడ్డారు. ఇది విద్రోహ చర్య కాదు, యాదృచ్ఛికమేనని తెలిపారు. మేము ఈ ఘటనను కూలంకషంగా
పరిశీలించినప్పుడు ఒక పట్టాను నిందితులు
ఉద్దేశపూర్వకంగా రెండు విడతలలో కోసిపెట్టారు అని
తెలిసింది. ఆ పట్టాపై ఈ తెగిన బాగం పక్కన మరో నాలుగు తెగిన మార్కులు కనుగొనడం
జరిగింది. ఈ పరిసరాలను జోన్ మెథడ్లో వెతకగా సంఘటనా
స్థలానికి చేరువలో హక్సాబ్లేడ్లు దొరికాయి. కోసివేయబడ్డ పట్టాల క్రింద రాళ్ళపై
ఇనుప రజను పొడి త్రుప్పుపట్టినది కొంత, త్రుప్పులేనిది కొంత దొరికింది. దీనిని బట్టి ఈ ఘటన ఇది పట్టాని
తెగకోయటం వల్ల అది వైఫల్యం చెంది దుర్ఘటన జరిగేదానికి కారణమైనదని శాస్త్రీయంగా
నిరూపించబడినది. ఈ విధంగా ఇది విద్రోహ చర్యే యాదృచ్ఛికము కాదు అని
నిర్ధారించబడినది.
ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదాలు:
2009 సెప్టెంబర్ 2వ తారీఖున బెల్ 430 హెలికాప్టర్
ప్రమాదంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డిగారు
మరణించిన కేసును దర్యాప్తు అధికారి క్రెయిం నంబర్ 132-2009 అండర్ సెక్షన్, 174 సిఆర్పిసి (డెత్ డ్యూ టూ చోపర్ క్రాష్)
ఆత్మకూరు పోలీస్స్టేషన్, కర్నూలు
జిల్లా తేది: 03.09.2009గా రిజిష్టరు చేశారు. ఈ కేసును సి.ఐ.డి. అధికారులు ఫోరెన్సిక్ నిపుణుల
సేవలను ఉపయోగించుకొని దర్యాప్తు కొనసాగించారు. ఈ కేసులో ముఖ్యమంత్రితోపాటు
ప్రయాణిస్తున్న ఆయన సెక్రటరీ సుబ్రమణ్యంగారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీగారు, పైలెట్లు భాటియా మరియు ఎం.ఎస్. రెడ్డిగార్లు కూడా ప్రాణాలు
కోల్పోయారు. ఈ బెల్ 430 హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి చిత్తూరుకు
బయలుదేరి మార్గమధ్యంలో క్యుమిలో నింబస్ మేఘాల కారణంగా రేడియో కాంటాక్టు అందక
నల్లమల ఫారెస్టు నందు రోళ్ళపెంట వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో కారణాలు
కనుగొనటానికి మరియు వైఫల్యాలు గుర్తించటానికి నిపుణులు ఎన్నో సాంకేతిక ఆధారాలు, నేరస్థలంలో వివిధ భౌతిక సాక్ష్యాధారాలు, రసాయనిక విశ్లేషణకు శకలాలపై స్వాబ్లు సేకరించటం
జరిగింది. ప్రమాదం స్థలంలోని శకలాల అధ్యయనం ద్వారా, రసాయనిక పరీక్షలు ద్వారా వాస్తవాలను నిర్ధారించటం
జరిగింది. ఈ ప్రమాదంలో ఒక పెద్ద చెట్టు మొదలు వరకు విరిగిపోయి హెలికాప్టర్తోపాటు 200 అడుగుల
దూరం వరకు ఈడ్చుకొని పోబడింది.
దీనిని బట్టి ఈ వాహనం అధిక వేగంతో ఉన్నట్టు
నిరూపితమయినది. హెలికాప్టర్ ఫ్యాను రెక్కలు పరిశీలించినప్పుడు వాటికి అంటుకొని
ఉన్న ఆకులు, ఇతర
పదార్థాలు, రెక్కలు
ముక్కలయిన విధానం, చెట్లపై
రెక్కలు కొట్టుకున్న గుర్తులు, ఈ
రెక్కలు ఫెయిలవలేదు పనిచేస్తున్నాయని తెలిసింది. హెలికాప్టర్ శకలాలు 25 నుంచి 200 అడుగుల
అసమాన దూరాలలో విస్తరించి పడిపోయిన విధానం హెలికాప్టర్ గాలిలో పేలిపోలేదని
తెలిపింది. ఇంజను ఇతర భాగాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు వాటిపై రాకెట్
లాంచర్లు, తుపాకులు
వంటి వాటినుపయోగించి కూల్చలేదని రూఢీ అయినది. హెలికాప్టర్ చుట్టూ మండిన గుర్తులను
సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది క్రిందకు పడిన తర్వాత ఘర్షణకు లోనై ఇంధనం
అంటుకున్నట్లు అర్థం అయింది. అంతేకాక ఈ హెలికాప్టర్ పడేటప్పుడు ప్రవేశించిన
చెట్లపై ఆకులకు ఎటువంటి కాలిన గుర్తులు లేవు కావున ఇది గాలిలో కాలలేదని నిర్ధారణ
అయినది. ఇంజన్ కాక్పిట్లో ఉన్న
హెలికాప్టర్ క్లాక్ 9:29 గం.ని.,43 సెకన్ల వద్ద ఆగిపోయి ఉంది. అంటే ప్రమాదం ఆ టైములో
జరిగిందని అర్థమయింది. మృతులకు ఉన్న గాయాలు, నలిగిపోయిన హెలికాప్టర్ భాగాలు పరిశీలించినప్పుడు లోపలివైపు
ప్రేలుడు వంటివి జరగలేదని హెలికాప్టర్ వేగంగా వచ్చి చెట్టు మధ్య నుంచి నేలను గుద్దుకొని
ఆగి పోయిందని తెలిసింది.
అంతేకాక ఈ శకలాలను, రసాయన శ్యాబ్లను, సంఘటనా
స్థలంలో దొరికిన ఫ్లైట్ రికార్డర్ను తదుపరి పరీక్షలకై దర్యాప్తు అధికారికి
ఇవ్వటం జరిగింది. ఈ విధంగా నిపుణులు ప్రమాదకారణాలను విశ్లేషించి ప్రమాదం
యాదృచ్ఛికమని తేల్చడమైనది.
భౌతిక సాక్ష్యాల సేకరణ మరియు రవాణా:
1. భవనాలు, బ్రిడ్జిలు, వంతెనల
ప్రమాదాల్లో వాటి కట్టుబడికి ఉపయోగించిన సిమెంటు, కాంక్రిటు, ఇనుప
చువ్వలు మొదలగువాటిని శిథిలాలను అక్కడక్కడా సేకరించాలి.
2. వాహనప్రమాదాల్లో ప్రమాదానికి కారణభూతమైన భాగాలను
సేకరించి పంపాలి.
3. సాక్ష్యాలు సేకరించే ముందు వాటిని ఎక్కడనుంచి
సేకరించారో? దానికి
సంబంధించిన ఫోటోలు తీసి నిపుణులకు పంపాలి.
ఈ భౌతిక సాక్ష్యాధారాలకు రసాయనికి పరీక్షలు, యాంత్రిక పరీక్షలు, భౌతిక పరీక్షలు, వివిధ
శాస్త్రీయ పరికరాలతో పరీక్షలు నిర్వహించి ప్రమాదానికి లేదా వైఫల్యానికి అవి కారణమా? కాదా? అని నిపుణులు నిర్ధారించి తమ నివేదికలను ఇస్తారు. ఇతర కారణాలను కూడా
వివరిస్తారు.