యూనిట్
Flash News
పిచ్చి దంపతులు

ఇంత మాత్రానికెందుకు
ప్రారంభించాలన్నాడు.
వెంకయ్యకా ఒక్కమాట శూలం
పోటులాగా గుచ్చుకొన్నది. ఆ రాత్రి నిద్రపట్టలేదు. పొలాన్ని అమ్మాలనుకున్నాడు.
రుద్రమ్మను పల్కరించాడు. ఆమె బదులాడలేదు. వెంటనే పొలాన్ని అమ్ముతున్నానని నలుగురితో
చెప్పాడు. ముందు పోటీలు పడ్డారు కొనడానికి. కానీ యీ మారు ఎటు దిరిగీ అమ్మక తప్పదని
నలుగురూ కూడబలుక్కున్నారు. చివరికి పొరుగూరి వారికి అమ్మేద్దామనుకున్నాడు. ఈ విషయం
తెలిసి ఊళ్ళోవాళ్లే ఒకరికి తెలియక మరొకరు పోటీలు పడ్డారు. అదృష్టం కొద్దీ మరో
మూడువేలు అధికంగానే వచ్చింది. పద్దెనిమిదివేలు చేతిలో పెట్టుకొన్నాడు. ఇకనేం పని
ప్రారంభమైంది. ఇనుము ధర ఆకసంలో నృత్యం చేస్తున్నది. సిమెంటు ధర కూడా విపరీతంగా
పలుకుతున్నది. కావలసినవి కొన్నాడు. ఆశ్చరమేమంటే పై మిద్దె కప్పు దగ్గరకు వచ్చేలోగా
డబ్బు చాలకపోయింది. ఇక పని ఆగిపోవలసిందేనా? ఆ
మధ్యాహ్నం కూలీలకు అన్నానికే తగరారైపోయింది. సాయంకాలం కూలీలకు రేపిస్తానంటూ
పంపివేశాడు.
ఆ రాత్రి మళ్ళీ ఆలోచనలో
పడ్డాడు. ఉదయం కూలీలు వస్తారు. వారికి డబ్బులివ్వాలి. లోకం తన్ను యింకా
పరీక్షిస్తూనే వున్నది. తానీ పరీక్షలో నెగ్గవలసి వున్నది.
''రుద్రీ'' పలకరించాడు.
''ఏమండీ'' సమాధానం.
''ఏం చెయ్యాలో
తోచడం లేదు''
''పడుకొని
నిద్రించండి ఉదయం చెబుతాను''
''ఏముంది
చెప్పడానికి''
''మామిడిపిందెల
దండ వుందిగా? పోయిందిగా
సమస్తం. ఇది మాత్రం ఎవరిని ఉద్దరించడానికి. పనిపూర్తిచేస్తే చాలు. అంతవరకూ నాకూ
నిద్రపట్టదు''
'ఆ...నిజంగా యిస్తావూ?''
''ఎందుకివ్వనండి? అది మీ సొమ్మేగదా, మీ సొమ్ము మీ కివ్వడంలో ఆశ్చర్యం లేదుగా.''
''నీకు
పిచ్చా. అది నా సొమ్ము మాత్రం ఎలా అవుతుంది? దానిని
ఖర్చు పెట్టకుండా నా వద్దనే వుంచుకుంటాననుకో. నేను చచ్చినపుడది నాతో వస్తుందా? పైగా నేను ఛస్తే ఏమౌతానో నాకే తెలియదు. అయితే
చావడం మాత్రం సత్యమని తెలుసు. ఆ సొమ్ము నాదని చెప్పడానికి నాకు హక్కున్నా
యోగ్యతలేదు. ఆధారమున్నా అవకాశం లేదు. ఇంతకూ మనల్ని పిచ్చివాళ్ళనుకుంటున్నారు
కొందరు. పడుకో'' అన్నాడు వెంకయ్య. ఉదయం
బస్తీకి వెళ్ళి మామిడిపిందెల పేరును అమ్మివేశాడు. పదేను వందలు వచ్చాయి. పని
అభ్యంతరం లేకుండా సాగిపోయింది. వెల్ల వేయించాడు గూడా. ప్రారంభోత్సవం జరిగిపోయింది.
పిల్లలు నవ్వు ముఖాలతో బడిలో ప్రవేశించారు. వారు తాతయ్యతో ఫోటోలు తీయించుకున్నారు.
ఆ రాత్రి ఆనందంతో
నిద్రపట్టలేదు వెంకయ్యకు. రుద్రమ్మకు కూడా మాట్లాడుతూనే వుండిపోయింది.
కట్టలేని చెరువు, చెట్టులేని చేమ యెంతో కాంపౌండులేని కట్టడం కూడా
అంతే. ప్రాకారం లేని భవనానికి అందంలేకుంటే మానెగానీ భద్రత కూడా వుండదు. అది
కంచెలేని చేనులాగా పగిలిపోతుంది. బడికి కట్టడం వుంటే చాలదుగా? నాలుగు పూలమొక్కలుండాలి. అప్పుడే అందంతోపాటు
విశాలత్వాన్ని కూడా ఇవ్వగల్గుతుంది.
ఓనాడు సాయంకాలం వెంకయ్య
బడివైపు వస్తుంటే బడి చుట్టూ పశువులు గెంతుతున్నాయి. పిల్లలు తరుముతున్నారు. ఆ
పక్కనే చిన్న గుడిసెలో గంపెడు సంసారం కాపురమున్నది. తానూ ఒక పెద్ద పెంకుటింటిలో కాపురమున్నాడు.
ఉన్నవి రెండే ప్రాణాలు. ఎక్కడుంటేనేమనిపించింది. కానీ యింటిని అమ్మడమా? రైతు పొలాన్ని అమ్ముకోగలడు. రైతాంగన కూడా
అందుకు అతి కష్టంగా ఓర్చుకుంటుంది. కానీ ''ఇల్లు
లేనమ్మ ఈనం చెడె మగడు లేనమ్మ మానంచెడె'' అనే
లోకోక్తి పల్లెల్లోనే పుట్టింది. గనుక ఇంటిని అమ్మడానికెలాంటి పరిస్థితుల్లోనూ ఆమె
ఒప్పుకోదు.
అంతే జరిగింది గూడా.
త్యాగానికి కూడా ఒక పరిమితి ఉండాలిగా. పొలం పోయినా కూలో నాలో చేసి గూడు
చేరుకోవచ్చు. ఆ గూడు కూడా లేకుంటే కూడా దొరికి మాత్రం ఏం లాభం?
రుద్రమ్మ ఒప్పుకోదని
తెలిసినా వెంకయ్య అడిగేశాడు. రుద్రమ్మ నిరాకరించింది. కానీ నాలుగైదు రోజులుగా
వెంకయ్య పడుతున్న ఆవేదనను చూచి అంగీకరించింది. ఐదువేల రూపాయలకు ఇంటిజాగా ధర
చెప్పాడు. నాలుగు వేలకు బేరం కుదిరింది. వెంకయ్య డబ్బు లెత్తుకొని పని
ప్రారంభించాడు. కావలసింది డబ్బులేగా, పైకం
చేతిలో వుంటే జరుగని పనంటూ ఏదైనా వుందా?
ఈ దఫాలో మాత్రం గ్రామంలో
చాలామందికి మనస్సు మారింది. కానీ ఆ మార్పు ఇల్లును అమ్మక ముందైతే ఎంత బావుండేది? వెంకయ్య తాను పట్టిన పనిని పూర్తి
చేయాలనుకున్నాడు. పూర్తి ఐపోయింది గూడా. పని ముగిసిన నాటి రాత్రి పండువెన్నెలలో
ఒక్కసారి భవనాన్ని చూచాడు.
ఆ రాత్రి రుద్రమ్మతో
చెప్పాడు. ఇక మన జీవితంలో సాధించగల్గిందేమీ లేదన్నాడు. ఉదర పోషణం కోసం బెంగ
పడవలసిన అవసరం కూడా లేదు. రాతిలో వున్న కప్పకు కూడా ఆహారం దొరుకుతున్నప్పుడు
నేలమీద యిందరి ప్రజల మధ్య మనం బ్రతుకలేక పోతామా అంటూ దైర్యం చెప్పాడు.
ఆ మరునాడు సాయంకాలం రుద్రమ్మ
బడివైపు వెళ్ళినది. రేడియోలో పాట విన్పిస్తున్నది.
''తండ్రి
ముఖానికి గాంగేయుడు తన
పెళ్ళి మానుకోలేదా?
కర్ణుడు కవచం బీలేదా?
శిబిమై కండల నీలేదా?''
పిల్లలు హాయిగా
బంతులాడుకుంటున్నారు. ఆమెను చూచి ప్రధానోపాధ్యాయుడు దగ్గరికి వచ్చి లోపలికి
పిలుచుకొని వెళ్ళాడు. ప్రతిగదీ చూపించాడు. హాలులో వెంకయ్య చిత్రం నిలువెత్తున
వ్రేలాడ గట్టబడింది. ఎంత బావున్నదా బొమ్మ.
''దేవుడుంటే, స్వర్గం వున్నది నిజమైతే మీ దంపతులక్కడ శాశ్వత
స్థానంలో వుంటారమ్మా?'' అన్నాడు
ఒక పంతులు.
''ఆ
స్వర్గానికంటే ఈ బడిలో వుండడమే ఎంతో బావున్నది'' అన్నది రుద్రమ్మ నవ్వుతూ.
అవును పాపం! కానీ బడిని
చూచుకొంటూ వుండిపోతే జీవనం ఎలా జరుగుతుందో ఆమెకు తెలియదుగా!
వెంకయ్య కూలిచేయడం అంటే ఎంత
ఆశ్చర్యమో రుద్రమ్మకు తెలుసు. రుద్రమ్మ పొలంపని చేయడం క్రొత్తగాకపోయినా
కూలిచేయడమంటే ఎంత సంకటమైన సంగతో వెంకయ్యకు తెలుసు.
అమాయకులు, నిజంగా పిచ్చి మనుష్యులు. ఒకరి కష్టాలకొకరు
నొచ్చుకుంటారు గానీ స్వీయ కష్టాల గురించి ఆలోచించరు.
నలుగురిలోనూ బాగా బ్రతికిన
కాపురం గనుక కూలీ చేయడం కొంచెం లోకువగా కనిపించవచ్చు సంఘంలో ఐనా వెంకయ్య అందుకు
జంకడం లేదు. పొలం పనులు లేని సమయంలో గూడా ఏ కాలువలు త్రవ్వడమో, రోడ్డు పనులో దొరికితే చాలు వెడుతుంటాడు.
త్యాగానికీ ఒక పరిమితి వుంది
అనే వాదం వెంకయ్య విషయంలో ఓడిపోయిందని చెప్పాలి. అన్ని విధాలా తగిన యిల్లాలు
రుద్రమ్మ. బహుశా వాల్మీకి గానం చేసిన సీతమ్మ త్యాగం గూడా ఈమెతో సరితూగకపోవచ్చు.
ఆమెరాణి గనుక వనవాసం చేసిన ఘట్టాన్ని తలంచుకొని జాలిపడుతుంది మానవ హృదయం. అలాంటి
సీత సహితం శ్రీరామునిపై తిరుగబడిన సంఘటనలు లేకపోలేదు. లక్ష్మణునిపై గయ్యాళిలాగు
విరుచుకొని పడిన రోజులు లేకపోలేదు. పైగా ఆమె ఎక్కడా కూలీ చేయలేదుగా, రుద్రమ్మ విషయం అలా కాదు. ఆమె రోడ్డు కూలీలతో
చెట్ల క్రింద కాపురం చేయడం నేర్చుకొన్నది. మగనితో పాటు వృద్ధాప్యంలో కాలే యెండలలో
గులకలు మోయడం అలవరచుకొన్నది. జానెడు పొట్టకోసం ఆమె యింత కష్టపడవలసిన అవసరం లేదు.
ఉన్న యిద్దరు కుమార్తెల్లో ఏ ఒక్కరైనా ఆమెను పూలలో పెట్టి పూజిస్తూ పోషించుకోగలరు.
కానీ ఒక విధంగా వారికి చెందవలసిన ఆస్తిని దానం చేసి పైగా వారికి భారంగా వెళ్ళి
కూచోరాదని ఆమె నిర్ణయం. వెంకయ్య ఆలోచన గూడా అంతే.
ఆశ్చర్యమేమంటే ఆ సంపాదనలో
గూడా దానధర్మాలు యదాతథంగా జరిగి పోతున్నాయి. కూలీల బాగోగులను చూడడంలో
దంపతులిద్దరికీ యెంతో శ్రద్ధ. వెంకయ్య పెద్దరికం వారికెంతో బాగా నచ్చింది. ఇందుకు
ప్రధాన కారణం లేకపోలేదు. రోడ్డు కూలీలకు పెద్దగా వుండేవాడెప్పుడూ పనిచేయడు.
మేస్త్రీతో బాతాఖానీ చేస్తూ కూచుంటాడు. ఇందుకు ఫలితంగా ఒకటిన్నర రెట్లు అదనంగా
కూలీ తీసుకుంటాడు. వెంకయ్య అలా కాదు. అందరితోపాటు నడుం వంచి పనిచేస్తాడు. అందరికీ
యిచ్చి చివర కూలీ తీసుకొంటాడు. అందుకే అతణ్ణి అందరూ అమితంగా ప్రేమిస్తారు.
ఇంతకూ వెంకయ్య అమాయకుడు.
నిజంగానే పిచ్చివాడు. ఈ ఇరవయ్యో శతాబ్దంలో యీలాంటి వ్యక్తి కాగడాలు పెట్టుకొని
గాలించినా ఈ దేశంలో కనిపించరని చాలామంది అనుభవజ్ఞులే అనగలరు. అంటున్నారు గూడా. ఇందులో
గూడా ఆశ్చర్యం లేదు. బడికని గుడికని లక్షల రూపాయలు ప్రోగుచేసి అందులో సగం మ్రింగిన
రాబందులున్నారు మనలోనే. అక్కడికి నయం. అసలు మొత్తాన్ని జీర్ణించుకొన్న
మహానుభావులున్నారుగా!
అలాంటి హేమాహేమీలున్న ఈ
సంఘంలో రుద్రమ్మ, వెంకయ్యలు
తమ విలువైన ఆస్తిని త్యాగం చేసి చివరికీ యింటిని గూడా అమ్ముకొని కూలీ చేసుకొని
బ్రతుతున్నారంటే లోకం నమ్ముతుందా?
అవును లోకం నమ్మదు. కానీ
వెంకయ్య బడిలో చదువుకుంటున్న పిల్లలు నమ్ముతారు. అక్కడ పాఠాలు చెబుతున్న
ఉపాధ్యాయులు నమ్ముతారు. అతని త్యాగానికి అబ్బురపడి కావ్య కన్యలను కృతులిచ్చి
భక్తితో అంజలి ఘటించిన మహాకవులు నమ్ముతారు. ఆ కృతులు చదివిన పాఠకులు నమ్ముతారు.
అంత చాలుగా!
ఒక సమయంలో లోకం నమ్మినా వారాస్తి పాస్తులను
అమ్మి, దానం చేశారని రుజువు కనబడినా వారు పిచ్చి
దంపతులంటుంది నిజమే. వారు పిచ్చి దంపతులే, వారి
అలాంటి పిచ్చి అందరికీ వుంటే సంఘం యిలాగా పుచ్చిపోతుందా? సంస్కృతి యీ విధంగా చచ్చిపోతుందా లోకంలో!
సంకలనం: పెనుగొండ
- కె. సభా
కె. సభా (కనక సభాపతి పిళ్లై)
సమస్టి శ్రేయస్సుకన్నా
వ్యష్టి శ్రేయస్సే ముఖ్యమనుకుంటున్న కాలమిది. అయితే తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం
చేసి సమాజం కోసం బతికిన ఆదర్శ దంపతుల జీవితాన్ని అపురూపంగా చిత్రించిన కథానిక ఇది.
మనకు సమాజం పట్ల వున్న బాధ్యతను గుర్తు చేస్తున్న మహనీయులు. ఈ కథానిక రచయిత సభా
రైతాంగ హక్కుల పోరాటం లక్ష్యంగా రచనా వ్యాసంగం చేసిన జాతీయవాది. సంస్కరణ భావాలుగల
వ్యక్తి. అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ రచనలు చేసిన రచయిత. వాహిని, దైవదత్తం, పాంచజన్యం
(ఆంగ్లం)లకు పత్రికలకు సంపాదకత్వం వహించారు.
1953లో
చిత్తూరు జిల్లా కళాపరిషత్తు కార్యదర్శిగా పనిచేశారు. 1960లో చిత్తూరులో 'శారద పీఠం' సాహితీ సంస్థను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్
సాహిత్య అకాడెమి సభ్యుడుగా (1970), చిత్తూరు
జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం డైరక్టరుగా పనిచేశారు. రమణ, నిర్మల, జాబిల్లి, విశ్వామిత్ర, సవ్యసాచి, కిసాన్ కలం పేర్లతో కూడా విరివిగా రచనలు
చేశారు. జాన పద విజ్ఞానాన్ని సేకరించి ప్రచురించారు.
రచనలు: బంగారు, పాతాళగంగ, నీటిదీపాలు
(కథా సంపుటాలు), పూర్ణాహుతి, సూర్యం
- చంద్రం, బిక్షుకి, దేవాంతకుడు, మొగలి (నవలలు), విశ్వరూప
దర్శనం, వేదభూమి (కావ్యాలు), కడగండ్లు, పల్లెసీమ
(నాటికలు), రైతురాజ్యం (బుర్రకథ), వినోదిని, రైతుగానం
(గేయాలు), దయానిధి (రమణమహర్షి జీవిత చరిత్ర) మొదలైనవి.
జననం: 1-7-1923 (కొండ్రాజు కాల్వ, చిత్తూరు జిల్లా)
మరణం: 4-11-1980