యూనిట్

మా గోఖలే

మా గోఖలే

చెన్నపట్నంలో 'లా' చదువుతున్న గోపాలం ఆ ఏడు 'ఎపెల్‌' పరీక్షకు కూచుని, వేసంగి సెలవలకు స్వగ్రామం మాధవపల్లికి బయలుదేరి. మర్నాడు పది బారల పొద్దెక్కేసరికి ఆ చిన్నస్టేషను గుండూరు చేరుకున్నాడు. గుండూరు స్టేషన్నుండి మాధవపల్లికి దాదాపు ఆరు మైళ్ళుంటుంది.

స్టేషన్లో దిగంగానే తనవూరు రాముడి గుర్రబ్బండి కోసం గాలించాడు గోపాలం. ఎక్కడా రాముడి బండిజాడ లేదు. ఇంకే వూరిబళ్ళయినా వుండొచ్చని ఆశతో చూసిన గోపాలానికి పుట్టింటికొస్తున్న ఓ ఆసామి ఆడకూతురుకోసం వచ్చిన ఒక్క రెండెడ్ల గూడుబండిమటుకే కనుపించింది.

దూర ప్రయాణం చేసి స్వగ్రామానికొస్తున్న వుత్సాహమూ, ఉదయపువేళ మాగాణీ ప్రాంతపు శోభను చూసి పొందిన ఆనందమూ గోపాలం హృదయంలోంచి జారిపోవటం మొదలుపెట్టినై.

స్టేషన్లో దిగిన ప్రయాణీకులు పూర్వం మాదిరిగానే రంగు రంగుల ట్రంకు పెట్టెలూ, మూటలూ నెత్తికెత్తుకుని డొంక వెంబడి చుట్టుపక్కల పెల్లెటూళ్ళకు కులాసాగా నడిచిపోతుంటం చూసి నిట్టూర్చాడు గోపాలం.

'ఏవూరు?''

తుళ్ళిపడి వెనక్కు తిరిగి చూశాడు గోపాలం. మెడమీద చేతి కర్రకు రెండు చేతులూ వేళ్ళాడేసుకుని మెళ్ళో వెండికంటెతో ఓ నల్ల పిల్లవాడు గోపాలాన్ని పరీక్షగా నిలబడి చూస్తున్నాడు.

'నువు మాదవపల్లి అనుమంతయ్యగా రబ్బాయివికదూ?' మళ్ళీ అడిగాడా నల్లపిల్లవాడు.

'అవును నీకెట్టా తెల్సూ?' అనడిగాడు గోపాలం నల్లపిల్లవాణ్ణి వింతగా చూస్తూ.

'నాకు తెల్సు ఎనక నువు మీ అయ్యా, అమ్మతో రాముడి గుర్రబ్బండిలో వచ్చి తెనాలి పోయిరాటం సానాసార్లు సూశా. ఇప్పుడు చూటు బూటు మీదుంటే సప్పున గురుతుపట్టలా నిన్ను' అన్నాడు నల్లపిల్లవాడు.

'మంచివాడివే. మా వూరి రాముడి గుర్రబ్బండి ఎందుకు రాలేదో నీకు తెలుసా? వాడీ పాసింజరు టైముకు ఎప్పుడూ ఇక్కడుండేవాడే? అనడిగాడు గోపాలం.

'రాముడు గుర్రబ్బండి అమ్ముకుని ఒంటెద్దుబండి కొన్నాడుగా మీ వూర్నించి ఇటుగా తెనాలికి బస్సుపడింది నీకు తెల్చా? అన్నాడు నల్లపిల్లవాడు.

'నాకు తెలియదు. ఏదీ బస్సూ? అనడిగాడు గోపాలం, బస్సులు దేశం నాలుగుమూలలకూ ఎగబాకుతున్నయ్యనుకుంటూ.

'అబ్బే, అది వుత్త సన్నాసి బస్సు. యాడన్నా కూసేపు ఆగిందంటే మల్లీ మడుసులు తోత్తేగాని కదల్దు! ఇంతకు ముంగలే ఆ బస్సులో కూకున్న మడుసులు దాన్ని తెనాలేపు తోసుకెల్లారు. మరి తిరిగి ఎప్పుడొచ్చుద్దో? అదుగో, అదుగో రాముడి బండొత్తున్నది' అంటూ రోడ్డువేపుకు వేలుపెట్టి చూపించాడు నల్లపిల్లవాడు.

తెనాలి వెళ్ళే పెద్దరోడ్డునుంచి స్టేషనుకు వచ్చే చిన్నరోడ్డుకు మళ్ళించి, బండినీ, ఎద్దునూ పగ్గాల్తో లాక్కొస్తున్న రాముణ్ణి చూశాడు గోపాలం.

రాముడి ఒంటెద్దు బండిని చూసి గోపాలం నీళ్ళు కారిపోయినా, తనకు గుండూరు స్టేషన్నుంచి విముక్తి కలుగుతున్నందుకు సంతోషం తెచ్చుకున్నాడు.

బండిలో వచ్చిన తన వూరు కోమటి కోటమ్మ, కోటమ్మ మనుమరాలు అక్కమ్మను చూడగానే కోటమ్మ దుకాణం చప్పున జ్ఞాపకానికొచ్చింది గోపాలానికి.

కోటమ్మ ఓ కన్నుకాయకాచి ఇంకోకన్ను మసగ్గా కనిపిస్తుంది. వెనక తను ఓ చెల్లని అర్ధ రూపాయీ, ఇంకో సత్తుపావలా కోటమ్మ కొట్లో మార్చుకోటమే కాకుండా తను అడిగిన గడియారం సిగిరెట్లకు కోటమ్మ పక్కకు తిరిగి గోనెసంచులు వెతుకుతుంటే చల్లగా తను అందినంతవరకు గల్లాపెట్టెలో చిల్లర డబ్బుల్ని జేబులో వేసుకోటం గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు గోపాలం.

'నాయనా నువు మనుమంతయ్యగారబ్బాయి గోపాలానివి కదూ? బాగున్నావా? చెన్నాపట్టంలో పీడరీ చదువుతున్నావంటగా? పోనీలే. మనవరాల్ని అత్తారింటికి తీసుకెల్తున్నా' అని గోపాలాన్ని పలకరించి, మనుమరాలు పెట్టేబేడతో ప్లాట్‌ఫారంమీద కెళ్ళింది కోటమ్మ.

'ఏం అబ్బాయిగారూ? బాగుండారా? నాన్న మూడు దినాల కిందటే చెప్పాడు తమరొస్తుండారని. ఎల్దాం బండెక్కండి' అంటూ బండిలో గోనెపట్టా దులిపేసి, గోపాలం సామాన్లు బండిలో సర్ది, ఎద్దు పగ్గాలు పట్టుకుని ప్రయాణానికి సిద్ధమైనాడు రాముడు.

గోపాలం విసిరేసిన ఆణాబిళ్ళను గుప్పెట్లో కరుచుకుని, కూత కూసుకుంటూ స్టేషన్లోకి పరుగెత్తి మాయమైనాడు నల్లపిల్లవాడు.

ఊరు దాటినాక బండెక్కి కూచుని, రాముణ్ణి బండెక్కవేమనడిగాడు గోపాలం.

'నేను బండెక్కితే ఎద్దు చెప్పినమాట వినదు. కాస్త ముందుకొచ్చి కూకోండి' అంటూ ఎద్దునదిలిస్తూ బండిపక్కనే నడిచాడు రాముడు.

'నిన్ను ఈ ఒంటెద్దుబండి పట్టుకుందేరా, రాముడూ? గుర్రబ్బండి అమ్మేశావుట దేనికీ?' అనడిగాడు గోపాలం, రోడ్డు గతుకులకు బండిలో అటిటువూగుతూ.

'గుర్రం చస్తే బండినమ్మేశా' అన్నాడు రాముడు.

'నిక్షేపమంటి గుర్రమే! ఏం ఎందుకు చచ్చిందీ? ముసల్దయిందా?' అనడిగాడు గోపాలం, రోడ్డు పక్కనే వస్తున్న తంగేడు చెట్లను చూస్తూ.

'అప్పుడే ముసల్దా? అది బతికుంటే ఇంకా పది పదిహేనేళ్ళు బతికేది ఎండుగడ్డీ, కుడితినీళ్ళూ పోస్తే ఏ గుర్రమున్నా బతుకుద్దా? అన్నాడు రాముడు.

'నీ గుర్రం ఏం తినేదేం?' గుర్రాలు ఏం తింటయ్యో  గోపాలం బుద్ధికి చప్పున పెగిలిరాలేదు.

'అన్ని గుర్రాలల్లే నా గుర్రమూ పచ్చిగడ్డీ, వులవగుగ్గిళ్ళూ తినేది. మనూర్నుంచి తెనాలికోటి, గుంటూరు కోటి రెండు బస్సు లేశారు. మీకు తెల్సా? అప్పట్నుంచి బండి బాడిగలు పడిపోయినై. నాకాడ డబ్బు పెగలక ఎండుగడ్డి వెయ్యటం మొదలు పెట్టేసరికి సరీగ్గా తినక మాడిచచ్చింది గుర్రం' అన్నాడు రాముడు. ఎద్దుతోక మెలిపెట్టి 'పదవేందే నిదరమొగందానా' అని అదిలిస్తూ.

రాముడితో సానుభూతిగా ఏమన్నా అందామనిపించి, ఏంతోచక, రాముణ్ణి, తోకనెప్పితో ఎగుర్తూ మొరాయిస్తున్న ఎద్దునీ వోసారిచూచి, రోడ్డుపక్కకు దృష్టి మళ్ళించాడు గోపాలం.

నల్లగావున్న మాగాణి చేలల్లో రైతుకూలీలు గడ్డవిరుస్తున్నారు. వాళ్ళ నల్లటి దేహాలు చెమటకు ఎండలో నిగనిగ మెరుస్తున్నయ్‌. చేలల్లో అక్కడక్కడ ఆసాములు తాటాకు పందిళ్ళువేసి చేల బలంకోసం పశువుల్ని కట్టేశారు. కొంచెం వెనకాల చెట్ల మధ్యగా చిన్న పల్లెటూరు సున్నపుగోడలూ, గడ్డివాములూ, ఓ చిన్న గుడిగోపురం కనుపిస్తన్నయ్‌.. ఎద్దు ఒళ్ళూ, రాముడి బనీనూ, చెమటకు తడిసినై. రాముడూ, ఎద్దూ ఒకరి ప్రక్కన ఒకరు లయ ప్రకారం నడుస్తున్నారు.

'అబ్బ! ఎండ చిటచిట్లాడిస్తున్నది ఎండలో ఆ విధంగా ఎందుకు నడుస్తావు బండెక్కితోలరాదూ?' మళ్ళీ అడిగాడు గోపాలం రాముణ్ణి.

'కొత్తెద్దు కదండీ? ఇంకా దానికి బెదురుపోలేదు. వున్నట్టుందీ ఒంటెద్దు బండిలో. గతుకు గతుక్కూ తలపగల్తుంటం అట్టా వుంచు, మరి నీ సంగతేమిట్రా రాముడూ? ఈ తాబేలు నడకతో నీ వృత్తికేమంత లాభంగా వుంటుందీ? గుర్రబ్బండి వున్నప్పుడు నీకింత కష్టం వుండేది కాదనుకుంటా. నువు తొందరగా ఈ ఒంటెద్దు బండిని ఒదిలించుకుని ఇంకోపని చూసుకోటం మంచిది' అన్నాడు గోపాలం.

'నా పెళ్ళామూ ఇదేమాటంటుంది. అయినా ఇన్నేళ్ళు బండి పనికి అలవాటుపడి యిప్పుడు తెలవని కొత్తపనిని చేయడం నావల్లనవుతుందా? వుత్తది కాని గుర్రబ్బండి  తోల్తున్నప్పుడు నిజానికింత ఇబ్బందుండేదికాదు. ఇప్పుడీ బస్సులు పడినాక గుర్రం బతకటం కూడా వుత్తదండగ. రోజులు చాలకపోతే మనుషులు వరన్నం బదులు జొన్నకూడో, నాగజెముడు గుబ్బలో తిన్నా తింటారుగాని గుర్రం పచ్చిగెడ్డి మానేసి ఎండుగడ్డి తినమంటే తింటుందా? అందుకే అది చచ్చింది' మణికట్టుతో మొహంమీద చమట పక్కకు నెట్టుకుంటూ మళ్ళీ అన్నాడు రాముడు. 'మొత్తం పన్నెండేళ్ళు బండి లాగిందాగుర్రం పన్నేండేళ్ళు రోజూ దానికి మాలీసు చేశాను కన్నతల్లిగ్గూడా అంతచాకిరీ చేసుండను'.

'ఏమిటో! మొహాన రాసిపెట్టినట్టే జరుగుతుంటాయ్‌ కొన్ని అన్నాడు గోపాలం రాముణ్ణి జాలిగా చూస్తూ.

'ఉత్తది. యాడన్నా పచ్చగెడ్డి, ఎండుగెడ్డి సంగతి మొహాన రాసుంటదా?

ఉత్తది. నా పెళ్ళాం గూడా ఇదేమాటంటుంది. పిచ్చిసచ్చింది. సెప్పినా దానికి తెలవదు. అసలు దానికి మతెప్పుడో పోయింది' అన్నాడు రాముడు. బండిని రోడ్డు పక్కలకు లాగుతున్న ఎద్దును రెండు పీకి దారినపెడ్తూ.

'అన్నట్టు మరచిపొయ్యాను. వెనక నీపెళ్ళాం పోయిందని.' అని సహంలో ఆపాడు గోపాలం. సందేహిస్తూ.

'ఎవరు - నా మొదటి పెళ్ళామా? అదెప్పుడో చచ్చిపోయిందిగా? ఇది రెండో పెళ్ళాంలెండి' అన్నాడు రాముడు.

ఈ వేసంగిలో తనకొస్తున్న పెళ్ళి సంబంధాల్లో ఏదో ఒకటి ఖాయం కావచ్చని యీ మధ్య నాన్న చూచాయగా రాసాడు తనకు. అంటే దాదాపు ఏదో సంబంధం యీపాటికి ఖాయం గూడా చేసి వుంటాడు నాన్న. పుర్రెలో ఏదన్నా తొలుస్తుంటే దాన్ని ఓ దారికి తీసుకురావటం నాన్నకు అలవాటే. తను ఇంటికి వెళ్ళేటప్పటికి పెళ్ళి సామాన్లు సగం పైగానన్నా నాన్న ఇంట్లో చేర్చివుంటాడనుకున్నాడు గోపాలం.

'నువే నయంరా, రాముడూ, సునాయసంగా అప్పుడే రెండో పెళ్ళికూడా చేసేసుకున్నావు?' అన్నాడు గోపాలం. ఇంకా మాధవపల్లి ఏంతదూరం వుందోనని తొంగిచూస్తూ.  'నిజంగా యీ పెళ్ళి అనుకోకుండానే జరిగింది లెండి. నిచ్చేపమంటిది కాస్తా నా జీవానపడి ఏడ్చింది' అన్నాడు రాముడు.

'నిక్షేపమంటిదైతే ఇంకా ఏం? దాన్ని పువ్వును చూసినట్లు చూసుకో' అన్నాడు గోపాలం నవ్వుతూ.

మనూరెళ్ళినాక మీకన్నీ తెలుస్తయ్‌ ఈ పెళ్లిని గురించి మనూళ్ళో నన్ను సానామంది సానామాటలన్నారు. ఆయన్నీ మీరేం ఇనిపిచ్చుకోబాకండి, అబ్బాయిగారూ. అన్నాడు రాముడు, గోపాలం వేపు ఓసారి తిరిగిచూస్తూ.

'పుణ్యానికి నువు పెళ్లిచేసుకుంటే వూళ్ళోవారు ఆడిపోసుకోటం దేనికీ? ఏం అంత విశేషం వుందా నీ పెళ్ళిలో?' సరదాగా అన్నాడు గోపాలం.

'నా పెళ్ళప్పటికే దానికి కడుపైంది.'

'ఎవరికీ?'

'అదేలెండి - నా పెళ్ళానికి. అదే నేను ముంగల మీతో చెప్పింది.

వూరెళ్ళినాక యివన్నీ మీకు తెలుస్తయ్యని' అన్నాడు రాముడు.

'చచ్చా. అదేమిట్రా రాముడూ?'

'అదంతేలెండి, అబ్బాయిగారూ. దాన్ని పిచ్చిదాన్ని చేసి ఎవడో ఎదవ దానికి కడుపుజేశాడు. ఇంక దానికి పెళ్ళి ఎట్టవుద్దీ? అది మంచిపిల్లని వూళ్ళో అందరికి తెలుసు. పెళ్ళిసంగతి దేముడికెరుక. అసలు ఆడ జరుగూతున్నది ఎట్టా తలెత్తుకు తిరుగుతుంది నలుగుర్లో? సిగ్గుతో పగలంతా ఆళ్ళ గుడిసెలోనే కూకునేది ఏడుస్తా.'

'చాలా అన్యాయం' అన్నాడు గోపాలం, రాముణ్ణి చూస్తూ.

'అన్నాయమని మెల్లిగా అంటారేం? ఓ రోజు వాళ్ళ గుడిసెకు దాని అయ్యతో పనుండి నేనిట్టబోతే నన్ను జూసి బావురుమంది. నాకు తల తిరిగిపోయింది. నిజం చెప్పద్దూ? దాని అయ్యా అమ్మోళ్ళకు దాన్ని సంపాలో, దాచిపెట్టుకోవాలో తెలవలేదు. అదే మాటన్నాడు దాని అయ్య, కర్రోటి తీసుకుని, ఈ జాతరంతా దేనికి దానికిష్టమైతే నేనే పెళ్ళి చేసుకుంటానన్నా, ఇగనంతే అమాంతంగా వచ్చి నన్ను వాటేసుకుంది' అన్నాడు రాముడు.

'ఆపాట పెళ్ళి చేసుకున్నావన్నమాట?'

'ఆ! అందులో ఇంక చచ్చేంలేదు. పెళ్ళికి వచ్చినోరు వచ్చారు రానోర్ని గురించి నేనంతగా పట్టించుకోలేదు. అసలు తమాశ ఎక్కడుందంటే దాని కసలు నేనే కడుపుచేశానని వూళ్ళో పుకారు పుట్టించారు.' అన్నాడు రాముడు పెద్దగా నవ్వుతూ.

 

రాముణ్ణి కొత్తమనిషిగా దిమ్మరబోయి చూశాడు గోపాలం.

'నువు చాలా ధైర్యస్తుడివి నువు చేసినపని ఇంకోకడివల్లకాదు. ఆ త్రాష్టుడెవడో నరికెయ్యకబోయినా వాణ్ణి?' అన్నాడు గోపాలం.

'ఇంతకీ వాడెవడో తెలియదుగా?' అన్నాడు రాముడు.

'అదేమిటి? నీ పెళ్ళాం చెప్పలా మరీ?' అడిగాడు గోపాలం.

'రెండు మూడుసార్లు అడుగుతే చెప్పలా. తనకు ఇంతపనైనాక వాడెవడువుతేమట్టు కేమంది. ఆ జాతరంతా మళ్ళీ దేనికంటుంది, బలేమొండి' అన్నాడు రాముడు.

దారిలో అడ్డుతగిలే ట్రంకు రోడ్డుమీద అడ్డంగా వచ్చిన బస్సును తప్పించుకుని మాధవపల్లి రోడ్డుకు బండిని మళ్ళించాడు రాముడు. గోపాలం ఆత్రంగా 'ఒరేయ్‌ రాముడూ, అదిగో అక్కడ మా పొలాల దగ్గిర పొడుగ్గా నుంచుంది' మా నాన్నల్లే వుంది, సరీగ్గా చూడు? అంటూ బండి దిగాడు గోపాలం.

గోపాలం కొంచెం స్థిమితంగా వుంటంచూసి, తాము దాదాపు ఖాయం చేసిన పెళ్ళిసంబంధాన్ని గురించిన వివరాలు చెప్పారు అమ్మాన్నానలు. పడుచువాడి కుండాల్సిన వుద్రేకాలన్నీ వున్న గోపాలానికి అందమైన పెళ్ళాం కావాలనే కోరిక తప్ప తన పెళ్లికి కాలపరిమితులు అడ్డం పెట్టాలనే ఆలోచన లేదు. తనకు కాబొయ్యే పెళ్ళాన్ని గురించీ, ఆమెతో తనకు కలగబొయ్యే సంపర్కం గురించీ వింతవింత వూహలు చేసుకుంటూ డాబామీద పచార్లుచేస్తున్న గోపాలం తమ దొడ్డో బావిలోనుంచి మంచినీళ్ళు తోడుకువెళ్తున్న మంగనుచూచి వుద్రేకంతో ఆపాధమస్తకం కంపించి పొయ్యాడు. తను పట్నం నుంచి వచ్చినట్టు మంగకు తెలిసుంటుంది. తను డాబామీద తిరుగూంటం కూడా చూసుంటుంది. అందుకే మంచినీళ్ళ మిషతో దొడ్డో బావిదగ్గరకొచ్చింది. అయినా మంగ తనను చూడనట్టు తల ఒంచుకుపోవటం గోపాలానికంత రుచించలేదు.

గబగబ కిందికి దిగిపోయి, నాన్న వూళ్ళోకి పనిమీద పోవటం, అమ్మ పొరుగింటివార్తో ఏదో లోకాభిరామాయణం సాగిస్తుంటం తెలుసుకుని, ఓతుండుగుడ్డ భుజాన వేసుకుని నీళ్ళగదిలో స్నానం చేయటానికొచ్చాడు గోపాలం. నీళ్ళగది పక్కనే దొడ్డోవుంది బావి. నీళ్ళగదిలోకి తనువచ్చిన ద్వారాన్ని బంధించి దొడ్డివేపుకున్న ద్వారం దగ్గర కొచ్చి నుంచున్నాడు గోపాలం వేడిశ్వాసలొదుల్తూ.

తీర్చినట్టు కనుముక్కు తీరూ, జారుముడీ, ఎర్రచీరె మోకాళ్ళపైగా దోపుకుని బావిదగ్గర నుంచుని కడవకు చేంతాడు వుచ్చు బిగిస్తున్నది మంగ.

మంగ తనను చూసింది. బిగుసుకుపోతున్న తను మంగనుచూసి వికారంగా నవ్వాడు.

'మాట' అన్నాడు తను తడబడ్తూ అస్పష్టంగా.

నాగుమల్లె చువ్వలాగా అట్టాగే కదలకుండా నుంచుంది మంగ.

'ఇక్కడ ఎవరూలేరు. ఒక్కమాట.' అన్నాడు తను.

బొమ్మల్లే ద్వారం దగ్గరికి మెల్లిగా వచ్చి నుంచింది మంగ. మెరుస్తున్న మంగ కళ్లు చూశాడు గోపాలం.

ఆ కళ్ళలోంచి వదుల్తున్నది నిప్పుకణాలో, కామకణాలో పోల్చుకోలేదు గోపాలం.

'లోపలికి రా..' అన్నాడు గోపాలం.

'నాకు పెళ్ళయింది, నీకు తెల్సా?' అంది మంగ, గోపాలాన్ని సూటిగా చూస్తూ.

'ఏం? పెళ్ళిచేసుకోటం తప్పా?' అన్నాడు గోపాలం.

'నువు చేసినపనికి నన్నెవరూ పెళ్ళిసేసుకోనన్నారు' అంది మంగ కన్నార్పకుండా...

'పరవాలేదులే- ఒక్కసారి లోపలికిరా'- అంటూ ఒంగి ఎర్రచీరపట్టుకుని లాగాడు గోపాలం. మంగలోంచి బస్సున బుసరావటం వినిపించుకోకుండా.

ద్వారం కింద పగిల్న నాపరాతి ముక్క మీదకు చప్పున వెళ్ళిన మంగ చెయ్యి చక్రాకారంగా తిరిగి గోపాలం నెత్తిమీదకు విసురుగా వెళ్ళిపడింది. 

చిన్న కేకపెడ్తూ తలను రెండుచేతుల్తో పట్టుకుని అట్లాగే కిందికి జారిన గోపాలం కళ్ళల్లో ఎర్రతీగెల్లో ఎర్రచీరతో మంగా, మంగవెనక బండిరాముడూ తీగెలల్లే కదుల్తూ కనుపించారు.

(ఈ కథ 'అభ్యుదయ' 1956 జనవరి సంచికలో ప్రచురితం, మా గోఖలే కథలు - విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌నుండి పునర్ముద్రితం)

మా గోఖలే- సామాన్యులుగా కనబడే మనుషులలో వుండే అసామాన్య సంస్కారాన్ని చిత్రించిన అపురూపమైన కథ. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామంలో జన్మించిన మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే కథారచయిత, చిత్రకారులు. గుంటూరు ప్రాంత శ్రామిక జనజీవితాన్ని అక్కడి భాషలో అపురూపంగా చిత్రించిన కథా రచయిత. 'వీరి' మా గోఖలే కథలు' ప్రసిద్ధమైనవి. పాతాళభైరవి, మాయా బజారులతో యాభై చలన చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు. ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి, విశాలాంధ్ర, చందమాలలో చిత్ర రచన చేశారు. కష్టజీవుల కథా రచయిత, జీవద్భాషాశిల్పిగా గుర్తింపు, గౌరవం పొందిన మా గోఖలే శతజయంతి సందర్భంలో ఈ కథ.

సంకలనం: పెనుగొండ

వార్తావాహిని