యూనిట్
Flash News
మంచి కథ 'ముంగిస కథ'

'ముంగిస
కథ'
రచన : శ్రీ బలివాడ కాంతారావు- సంకలనం :
పెనుగొండ
అలాంటి పని చెయ్యదు. ఎవరోపిలిచి వేస్తే
తింటాడు. అంతే.''
''నీకు సాక్ష్యమే కావలిసి వస్తే తెస్తాను.''
వాడి పొరుగు నుంచే సాక్ష్యం తెచ్చాడు.
గడపలో నున్న కోడిపిల్లల్ని హతమార్చింది మీ బయ్యన్నేనని చెప్పగానే ఇది దొంగసాక్ష్యమని
కేకలేశాడు డాక్టరు.
''వీటి ఖరీదు పది రూపాయలు. ఇచ్చేయి.''
''అనవసరంగా నేనెందుకివ్వాలి? మా
బయ్యన్న పీకలు కొరికే వీరుడు కాడు. నేను ఒక్క దమ్మిడీ ఇవ్వనంటే ఇవ్వను.''
''సరే, పెద్దింటివాడివి. పసిమితో ఎగురు
తున్నావు. నాకు నష్టం వచ్చింది. నీకు కాదుకదా! ఈ కోళ్ళు నాకు హక్కయినవి
కావనుకుంటాను.'' అంటూ
ఆ కోడిపిల్లలను ఏట్లోకి విసిరేశాడు. ఇట్టే ఎగురుతున్న గెద్దలు అందుకున్నాయి.
వాటిిలో అవి వెంట తరుముకున్నాయి.
కోపంతో ఇంట్లోకి వచ్చిన డాక్టరుతో భార్య
అంది. ''వాడు
క్రూరుడండీ! పోనీ, కొంతలో
కొంత ఇచ్చి సముదాయించలేకపోయారా?''
డాక్టరు ఖస్సుమన్నాడు, ''వెధవ, అనవసరంగా
మన బయ్యన్న మీద నిందలేస్తే పడతామా? అదే అక్కడకు వెళ్ళుంటే ఘల్లుఘల్లుమని
శబ్ధం వినపడేది కాదా? ఆ
పెట్ట అరిచేది కాదా? వీళ్ళు
లేచేవాళ్ళ కారా?''
భైరమయ్య ఇంటికి పోయి నలుగురూ వింటూండగా, 'పోయింది
పొల్లు. మనం ఔనంటే ఆ పెద్దోడు కాదంటున్నాడు. వాడికది తిన్నన. మనకి కావలసింది
జాగ్రత్త. మిగతా కోడిపిల్లల్ని జాగ్రత్తగా చూడు. ఇంట్లో మయ్యి. మనం వీధిలో
పడుకుందాం!''
పదిరోజులు గడిచిపోయాయి. డాక్టరు దగ్గరకు
మందుకి వచ్చాడు భైరమయ్య. డాక్టరు పైసా పుచ్చుకోకుండా మందిచ్చాడు. కోడిపిల్లల ఊసే
మరిచిపోయారు.
పట్నంలో కూతుర్ని చూడ్డానికి డాక్టరు, భార్య
ఉదయమే బయలుదేరారు. ఇల్లుకు తాళాలు వేశారు. పెరటి డొక్కులో పాలన్నం గిన్నెలో పెట్టి, ''బయ్యన్నా, మధ్యాహ్నం
తినరా! పట్నం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. ఇల్లు జాగ్రత్త,'' అంటూ
అమ్మాయమ్మ చెప్పి మరీ వెళ్ళింది. బయ్యన్న
వాళ్ళ వెంట వద్దన్నా పడ్డాడు. ఇద్దరూ మర్రిచెట్టు కింద బస్సుకోసం కూర్చుంటూనే
ముంగిస అరుపులు విన్నారు. ఆత్రంగా తిరిగి చూసేసరికి ఒక ముంగిసకాదు - బయ్యన్న కాక
మరి రెండు ముంగిసలు.
ఆ రెండు ఆ చిన్న చెవులు రిక్కించి
కోపంతో అరుస్తున్నాయి. బయ్యన్న దారి కడ్డమయ్యాయి. బయ్యన్న వాటిని చేరాలని
ఆత్రపడుతున్నాడు.
''అవిగో అవే, ఆ
రెండు బయ్యన్న అమ్మాన్నాన్నా,'' అన్నాడు డాక్టరు. ఇద్దరూ వింతగా
చూస్తున్నారు. ఆ రెండు బయ్యన్న మీద ఉరకడానికి సిద్ధమౌతున్నాయి. బయ్యన్న కులం నుంచి
వెలివేసిన మనిషిలా ఉన్నాడు.
''చంపగలవండి. వాటిని తోలండి.'' అంది
భార్య. వాటిని అదిలించి,
''రారా బయ్యన్నా,'' అంటే మెల్లగా మూతి వంచుకుని అమ్మాయమ్మ
దగ్గరకు వచ్చి పాదంమీద పడుకున్నట్లు వంగిపోయాడు. ఆమె ఎత్తుకోగానే మూతి దగ్గర మూతి
పెట్టి మెల్లగా అరుస్తున్నాడు.
''మీ అమ్మానాన్నా నిన్ను రానివ్వలేదని
ఏడుస్తున్నావా? మే
ఉన్నాం కదరా.. నీ అమ్మను నేను, అరుగో మీ నాన్న... వెళ్ళు ఇంటికి-ఇంట్లో
నీవులేకపోతే శత్రుమూకలు దాడిచేసేస్తాయి. వెళ్ళు, నాయనా... వెళ్ళరా..''అమ్మాయమ్మ
ఒక ముద్దుపెట్టుకొని అంతదూరం వెనక్కు వచ్చి విడిచిపెట్టింది. రానురాను
ఘల్లుఘల్లుమనే శబ్దం దూరమైపోతూంది. ఇంతలో బస్సు వస్తూంది. డాక్టరు పిలుస్తున్నాడు.
తిరిగి రోడ్డువైపుకు పరుగెత్తింది. తిరిగివచ్చిన బయ్యన్న ఇంటి చుట్టూ అంతా సరిగ్గా
ఉన్నాయో లేవో అని ఒకసారి తిరిగి వెళ్ళి బిలంలో కూర్చున్నాడు.
పది గంటలయింది. ఇంకా పాలన్నం తినటానికి
సమయం కాలేదు. ఆ సమయం వస్తే గంటలు విన్నట్టు మరీ వెళుతుంది. ''బయ్యన్నా, రారా..'' అన్న
పిలుపు ఒకసారి బిలం నుంచి వచ్చి చూశాడు. మళ్ళీ పిలుపు. భైరమయ్య ఒడ్డులో
నిల్చున్నాడు. వీధిలో ఎవ్వరూ లేరు.
''రారా, బయ్యాన్నా...ఇదిగో చేప...రారా..రారా.''
గంటలమోత వినిపించింది. చెంగుచెంగున రాళ్ళన్నీ
ఎగబ్రాకింది. భైరమయ్య చేతిలో చేప చూశాడు. కొద్దిగా జరిగాడు భైరమయ్య. ఒక్కసారి, ''నీకోసం
చేప తెచ్చానురా బయ్యన్నా. రారా...'' అన్నాడు.
కొద్దిగా నక్కుతూ...కాస్త ముందుకు వస్తూ, మళ్ళీ
మూలదాగుంటూ...మళ్ళీ ఒకసారి చూసి...మళ్ళీ మందార చెట్టు చాటున దాగుంటూ అతని గొంతుక
విని చివరకు వాకిటలో చేపను పసికట్టేశాడు బయ్యన్న.
అందుకోడానికి ఘల్లుమని శబ్ధంచేస్తూ
ఉరికాడు. ఎదురుగా మునకాల కర్రపట్టుకుని
మీసం తిముడుతూ నిల్చున్న భైరమయ్య ఒక్కసారి కర్రెత్తి దభీమని బయ్యన్న శరీరం మీద
వేశాడు. బయ్యన్న ఒక్కసారి అరిచి, 'వద్దు! వద్దు! నేనేం పాపం ఎరగ'నన్నట్లు
ఆ మూతి ఎత్తాడు. 'నీకో
నమస్కారం. అనవసరంగా చంపకు,'
అన్నట్టు
ఆ ముందు కాళ్ళు రెండూ లేచున్నాయి. మళ్ళీ దభీమని ఇంకో దెబ్బ. బయ్యన్న కిలకిలా
తన్నుకుంటున్నాడు. మరి రెండు దెబ్బలతో మూగబోయాడు.
భైరమయ్య తోక పట్టుకుని ఎత్తాడు. నోటి
వెంబడి రక్తం కారుతూంది. ఆ చిరుపళ్ళు కనిపిస్తున్నాయి. మనుషులను చంపగలిగే
విషసర్పాలను కొరికి కొరికి ముక్కముక్కలు చెయ్యగల పళ్ళవి. పామును చూడగానే
వీరావేశంతో గెంతి దెబ్బలాడగల కాళ్ళవి. తేలేసి ఉన్నాయి. అంతచిన్న కళ్ళయినా ఎలకల
మందలను పందికొక్కుల మూకలను గడగడలా డించేవి. అలాంటి కళ్ళు మూతబడినాయి. 'బయ్యన్నా, రారా' అంటే
ఈ మానవాళి అరుపంతా సౌహార్ధం, ప్రేమతో నిండి
ఉంటుందనీ, వాళ్ళ కరుణతో తనలాంటి జంతుజాలానికి
కడుపు నింపుతారనీ ఆశతో ఆ పిలుపు వింటుండిన చెవులు శాశ్వతంగా చెముడయ్యాయి.
భైరమయ్య వీరావేశంతో ఆ తోక పట్టుకుని బలం
అంతా ఉపయోగించి పారుతున్న ఏటిలోనికి బయ్యన్న శవాన్ని విసిరేశాడు. కింద రక్తం పడిన
జాగాలో మన్నంతా ఎత్తి ఏటిలో పారేశాడు. ఏమీ తెలియనట్లు ఏటికిపోయి కాళ్ళు చేతులు
కడుక్కున్నాడు.
బయ్యన్న శవం ఏట్లో కొట్టుకుపోయింది.
కుళ్ళిపోలేదు. ఒక ఒడ్డుకు చేరింది. ఒక ఆకలిగొన్న గద్దకు ఆహారమైంది.
సాయంత్రం ప్రొద్దు గుంకకుండానే ఉదయం
పశువులను తోలుకు వెళ్ళిన పసివాడు తిరిగి వచ్చాడు. పట్నం నుంచి డాక్టరూ, అమ్మాయమ్మా
తిరిగి వచ్చారు. బయ్యన్నకు తీపి వస్తువులు ఇష్టమని, ఎండు చేపలు మరీ ఇష్టమని అమ్మాయమ్మా అవే
కొనుక్కుని వచ్చింది.
ఇంటికి రాగానే ముందు బయ్యన్న తిన్నాడో
లేదోనని పెరటిడొక్కులో చూసింది. పాలన్నం అలాగే ఉంది.
''చూడండి, మన బయ్యన్నకు ఎంత దర్జాయో! చెప్పి మరీ
వెళ్ళినా - తినలేదు.''
''నీవు దగ్గిర ఉండి తినిపిస్తేగాని తినడే!''
సంచిలోని ఒక ఎండుచేపను తీసుకుని, అమ్మాయమ్మా
ఏటి ఒడ్డుకు వచ్చింది.
''బయ్యాన్నా, రారా...నీకిష్టమైనది
తెచ్చాను రా...రారా...నాయనా...రారా...'' పిలిచింది. మళ్ళీమళ్ళీ పిలిచింది.
చీకటిపడ్డ వరకూ పెరట్లో, అంగట, ఇంట్లో
ప్రతిచోటా పిల్చింది.
''ఎక్కడ తప్పిపోయాడో, ఇంటికి
తెచ్చి దిగబెట్టకుండా మధ్యలో వదిలి వచ్చేశాను. ఆ పాడు బస్సు అంతసేపు రానిది, అప్పుడే
వచ్చేయాలా? తోవలో
ఏ కుక్క నొక్కేసిందో, ఏ
పిల్లి దట్టేసుకుందో, ఆ
రెండు ముంగిసలు వచ్చి దాని మీద పడ్డాయేమో?''
అంత చీకట్లో కూడా మొగుడితో కలిసి
మర్రిచెట్టు వరకు కేకలు వేసుకుంటూ వెళ్ళింది. పిల్చింది. తిరిగివస్తూ ఎన్నో విధాలా
పిలిచింది.
ఇంటికి వచ్చినా వంటలేదు. నోట్లో మంచినీరైనా
పొయ్యలేదు. రాత్రి అంతా జాగారం చేసింది. మధ్యన లేచివచ్చి ఏటి ఒడ్డున, ''నాయనా, బయ్యన్నా
నీకు తీపితీపి మిఠాయి తెచ్చానురా! నీ కిష్టమైన చేపలు తెచ్చానురా!
రారా..నాయనా...రారా...''అని
పిలిచింది.
తెల్లవారినా ఆ ఘల్లుఘల్లు శబ్ధం
వినబడలేదు. ఉదయమే తలకు స్నానం దేవుని గదిలో గంటసేపు కూర్చొని, 'నా
బయ్యన్నను నా కియ్య'మని
మొక్కింది. నలుగురిచేత వెతికించింది. వాడు దొరికితే పూలు పునస్కారాలు చేస్తానంది.
రెండు రాత్రిళ్ళు గడిచిపోయాయి. బయ్యన్న
జాడ తెలియలేదు. మూడో రాత్రి అటకపైన చప్పుడయింది. ఆత్రంగా లేచింది. అది
ఘల్లుఘల్లుమన్న శబ్ధం కాదు. వటుక్కు వటుక్కుమని శబ్దం వినిపిస్తూంది. లైటేసి
చూస్తే అదివరలా బాహాటంగా ఒదిలేసిన ధాన్యాన్ని ఎలకలు పచనం చేస్తున్నాయి. వాటిని
తోలాలన్న మనసైనా పుట్టలేదు.
ఇప్పటికీ చేపలు కొంటే ఇది బయ్యన్నకని
ఒకటి ఉంచుతుంది. ఒక కాగితంపై ఆ బయ్యన్న బొమ్మగీసి కత్తిరించి, మెడకు
మూడు మువ్వలు కట్టి ఆ డొక్కులో ఉంచుతుంది. గాలికి కదిలితే ఆత్రంగా వెళ్లి
చూస్తుంది. పాలు కలిపిన అన్నం ఆ డొక్కులో పెడుతుంది. ఏ పిల్లులో పాలు కలిపిన అన్నం
తింటే - అది బయ్యన్నే తిందేమోనని భ్రమపడుతుంది.
బయ్యన్న ఎక్కడో బతికి ఉన్నాడని, ఎవరో
ఇనప గొలుసుతో కట్టేశారని,
ఆ
గొలుసు పటుకు పటుకుమని నమిలి, తెంపుకుని తనను చూడటానికి ఎప్పటికైనా
వస్తుందని అమ్మాయమ్మ విశ్వాసం.
ఒకనాడు ఉదయం, పొద్దుకాస్త
మీదికి లేచింది. భైరమయ్య ఇంట్లో నుంచి కోడిపిల్లలను వదిలాడు. పెట్టతో పిల్లలు
ముందుకు కదిలి ఏడి ఒడ్డుకు వెళ్ళాయి. డాక్టరు ఇంటి ఎదర వీధి అది. చింతచెట్టు కింద
ఏటి ఒడ్డులో రాలిన గింజలను కోళ్ళ పిల్లల సమూహం ఏరుకుంటున్నాయి. బయ్యన్న బాధ
తప్పించుకున్నందుకు భైరమయ్య మురిసిపోతూ ఇంక కోళ్ళను ఆ రాత్రి నుంచి అరుగుల మీద
విడిచిపెట్టినా భయం లేదనుకున్నాడు. అంత శ్రమపడి పిల్లలు వేసిన ఆ కోడి పిల్లల
రంగులు వేపు చూసి మురిసిపోతున్నాడు. ఇందులో నిత్యం గుడ్లు పెట్టే పిల్లలు, కోళ్ళ
పందానికి పనికివచ్చే పుంజులను బాగా తయారుచెయ్యగలనని ధీమా గా అనుకున్నాడు. అలా అతను
చూస్తుండగానే తన కళ్ళనే నమ్మనట్టు ఒక ముంగిస - బయ్యన్న కంటే మరీ పెద్దది, భీకరమైంది, లేత
నలుపు రంగుది - కోడిపిల్లలపై ఉరుకుతూ ఒకదాన్ని పట్టుకుంది. భైరమయ్య పరుగెత్తి వెంట
తరి మాడు. రాళ్ళలో ఏ బిలంలోకి పోయిందో ఎంత వెదికినా దొరకలేదు. తిరిగి మెల్లమెల్లగా
అడు గులు వేసుకుంటూ కోళ్ళను యింటివైపు తోలుకుని పెళ్ళాంతో కోళ్ళను ముయ్యమని
చెప్పాడు.
భైరమయ్య మంచం ఎక్కాడు. తన కర్రతో
కొడుతుండగా, నేరం
ఎరుగని అమాయకమైన బయ్యన్న ఎత్తిన మూతి, జోడించిన చేతులు అదో మానవుడుగా, 'నాదేం
తప్పులేదు. నన్ను చంపకు...చంపకు...'అని, నిండా ప్రాణంపై ఆశతో గగ్గోలు
పెట్టుతున్నట్లు తోచి, ఆ
దృశ్యాన్ని మనస్సు నుంచి చెరుపుకోలేక నడుం జార్చేసుకున్నాడు.