యూనిట్

కొడుకు

గోదావరి ఒడ్డున పుష్కరాల రేవులో ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారు జనం.

మనిషి మాట పక్క మనిషి విన్పించనంతగా మైక్స్‌లో భక్తి ప్రవచనాలు, భజన గీతాలు హోరెత్తిపోతున్నాయి. సంధ్యవేళ కావస్తోంది. ఆకాశం మబ్బులు కమ్ముకుని ఏ వేళనైనా వర్షించడానికి సిద్ధంగా ఉంది.

శాంతి కళ్లు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షిస్తూనే ఉన్నాయి. కొంతసేపు ఓదార్చి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించిన పోలీసులు ఇక తమ వల్ల కాదని మిన్నకుండిపోయారు.

పిచ్చి పట్టినవాడిలా జనసమూహంలో తిరుగుతున్న రమేష్‌ బట్టలు చెమటతో తడిసి ముద్ధయ్యాయి. రేగిన జుట్టు, ఎర్రబడ్డ కళ్లు వాడిన మొహంతో ఏ క్షణంలోనైనా బద్దలు కానున్న భాండంలా ఉన్నాడతను, మధ్య మధ్యలో శాంతి ఉన్న టెంటువైపు వచ్చి, అమెనోసారి చూసి, మళ్లీ జనంలో కలిసిపోతున్నాడు. మధ్యాహ్నం వరకూ శాంతి కూడా అలాగే తిరుగులాడింది. మనసులోని ఆందోళన, ఉదయం నుంచి జనం మధ్య తిరుగుతున్న వాలంటీర్లు చూసి వెంటనే చేతుల మీద మోసుకొచ్చి ఆ టెంటులో పడుకోబెట్టి ఉండకపోతే ఆమె ప్రాణాలెప్పుడో గాలిలో కలిసిపోయేవే.

మెలకువ వచ్చినప్పుడల్లా 'చిన్నా... చిన్నూ..' అని కలవరిస్తోంది.

నాలుగేళ్ళ చిన్నూని తీసుకుని రమేష్‌, శాంతి విజయవాడ నుండి ఒక రోజు సెలవు మీద గోదావరి పుష్కరాలకొచ్చారు. శాంతికి పెద్దగా ఇష్టం లేకపోయినా, తను పుట్టి పెరిగిన రాజమండ్రి పుష్కరాలకి వెళ్లి తీరాలని రమేష్‌ పట్టుపట్టడంతో కాదనలేక వచ్చింది.

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శాంతికి ఆఫీసులో సెలవు దొరకడం కష్టం. రమేష్‌ విద్యుత్‌ శాఖలో జూనియర్‌ ఇంజనీరు. ముందుగా స్నానాలు కానిచ్చి, ఆ తర్వాత నెల ముందెప్పుడో బుక్‌ చేసుకున్న హోటల్‌ రూమ్‌కెళ్ళాలని రమేష్‌ ఆలోచన. ముందు రూమ్‌కెళ్లి రావాలంటే రద్దీ ఇంకా పెరిగిపోయి స్నానం ఆలస్యమై సాయంకాలం లోపల అన్నీ చూడలేమని అతనికన్పించింది. తెల్లవారు ఝామున గోదారి స్టేషన్లో రైలు దిగేరు. పుష్కరుడి విగ్రహం ముందు నుంచి నాలుగడుగులు డౌన్‌లోకి నడిస్తే పుష్కరాల రేవు. చిమ్మ చీకట్లో సూర్యోదయమైనట్టు విద్యుద్దీపాల కాంతితో వెలిగిపోతోంది రేవు. అటు రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి, ఇటు కొత్త రైలు బ్రిడ్జి నియాన్‌ లైట్ల వరసల్తో, పరవళ్లు తొక్కుతున్న గోదావరి కంఠాన్నలంకరించిన వజ్రాల హారాల్లా మెరిసిపోతున్నాయి. ఓ క్షణం పరవశంతో నిలబడి పరికించాలనుకున్న రమేష్‌ జనం తోపిడికి ఎలా వచ్చి పడ్డాడో బారికేడ్ల మధ్య క్యూలోకి వచ్చిపడ్డాడు. భుజం మీద నిద్రపోతున్న చిన్నూతో శాంతి అతన్ని అందుకోలేక వెనకబడిపోయింది. మొదట కొంత కంగారుపడినా వెనకెక్కడో శాంతి కన్పించాక అతని మనసు కుదుటపడింది. మొదట కొంత కంగారుపడినా వెనకెక్కడో శాంతి కన్పించాక అతని మనసు కుదుటపడింది. శాంతి గాభరాతో దిక్కులు చూడ్డం గమనించి గుర్తుకోసం చేతిలో ఉన్న సూట్‌కేసుని ఎత్తిపట్టుకున్నాడు రమేష్‌. కొంత ఆగి ఆమెతో కలిసి వెళ్లాలనుకున్నా వీలు కావడం లేదు. అలా నెట్టుకొస్తున్నారు జనం. ఎలాగో నీటి ఒడ్డుకి చేరుకుని ఒకళ్లని ఒకళ్లు చూసుకున్నాక స్థిమితపడ్డారు. ముందుగా చిన్నూని నిద్రలేపి మెట్టుపైన నిలబెట్టి వాడి ఒంటిమీద బట్టలు విప్పే టైం లేక అలాగే వాడి తల మీద రెండు చెంబులు నీళ్ళు గుమ్మరించింది శాంతి.

అప్పటికీ నిద్రలో జోగుతున్న వాణ్ణి చూసి ''ఇంత గందరగోళంలో కూడా నిద్ర వదలటంలేదు. కుంభకర్ణుడి వారసుడిలా చూడండి వీడు'' అంటూ ముద్దాడింది. కాఫీ రంగు టీషర్టు నిక్కర్లలో తెల్లగా బొద్దుగా మెరిసిపోతున్నాడు చిన్నూ. ఉంగరాల జుట్టు తడిసి నుదుటికి అంటుకుపోయిమరింత అందంగా కన్పిస్తున్నాడు వాడు.

చిన్నూని అందరూ తండ్రి పోలిక అంటారు. రమేష్‌ వాణ్ణోసారి మురిపెంగా చూసుకున్నాడు.

అవతల పురోహితుడు తొందర పెడుతున్నాడు.

చేతిలోని సూట్‌కేస్‌ని మెట్టుమీద పెట్టి చిన్నూని దానిమీద కూర్చోబెట్టేడు. తడిబట్టల్లో వణుకుతున్న వాణ్ణి చూస్తే జాలేసింది. ''ఒక్క నిముషం నాన్నా, ఇప్పుడే స్నానం చేసొచ్చి నీకు పొడి బట్టలు వేస్తానేం, దీనిమీదే కూర్చో, ఎక్కడికీ కదలొద్దు. ఈ సూట్‌కేస్‌లో మన కొత్తబట్టలున్నాయి కదా, లేచేవంటే దొంగాళ్లెత్తుకుపోతారు'' అని భయపెట్టేడు.

చిన్నూ కూర్చున్న మెట్టుకి ఒక మెట్టు కింద నించి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంకొక్క మెట్టి దిగి రమేష్‌, శాంతి స్నానానికుపక్రమించేరు. మధ్యమధ్యలో వెనక్కి తిరిగి చిన్నూని చూస్తూనే ఉన్నారు.

స్నానం ముగించి వెనక్కి తిరిగేసరికి చిన్నూ కన్పించలేదు. గుండె గతుక్కుమంది ఇద్దరికీ. సూట్‌కేసు అక్కడే ఉంది. చిన్నూ లేచి ఎటో    వెళ్లుంటాడు. ఎంతో దూరం వెళ్ళే అవకాశం లేదు. కాళ్ళ కింద నిప్పులున్నట్టు పరుగెత్తేరిద్దరూ.

మొదట ధీమాగా అన్పించినా పది నిమిషాలు గడిచేసరికి తెలిసొచ్చింది ఆ జన ప్రవాహంలో చిన్నూని వెతకడం ఎంత కష్టమో! గొంతు పోయేలా 'చిన్నూ.. చిన్నూ..'అని పిలుస్తూ వెతికిన చోటే వెతుకుతున్నారు.

''ముందు పోలీసులకి చెప్పండి'' అంటున్నారెవరో.

''బాబూ, మీ సూటుకేసు'' అని చేతికందించారు పంతులుగారు. సంభావన ఇవ్వాలని తోచి జేబులు వెతుక్కుంటున్న రమేష్‌ని ముక్కు మీద వేలేసుకుని వారించాడాయన. ''ముందు మీ బిడ్డని వెతుక్కోండి నాయనా! నేనూ బిడ్డా పాపల్తో ఉన్నవాడినే. సూట్‌కేసు అక్కడే ఉంది కాబట్టి దొంగల పని కాదిది. ఆ గోదావరి మాత మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ బాబు మీకు తప్పకుండా దొరుకుతాడు'' తొందర పెడుతున్న మరో జంట వెంట నడిచాడాయన.

ఆ జన ప్రవాహాన్ని ఈదుకుంటూ శాంతి చెయ్యి పట్టుకుని పోలీసు టెంట్‌ వైపు నడుస్తున్నాడన్న మాటే గాని రమేష్‌ కళ్ళు నలుదిక్కులా పరికిస్తున్నాయి.

రిపోర్టు ఇచ్చి, సూట్‌కేసు వాళ్ళ దగ్గర పడేసి చేరోవైపూ పరుగెత్తేరు మళ్ళీ.

పగలంతా కాసిన ఎండ, సాయంత్రం బాధగా ఉంది. శాంతి పైకి ఏడుస్తోంది. తను ఏడ్వలేకపోతున్నాడు. అంతే తేడా.

మాటలైనా సరిగారాని మూడేళ్ల చిన్నూ ఎక్కడున్నాడు? ఎవరు తీసుకెళ్ళిపోయారు?

సాయంకాలం ఊరంతా ఒకసారి ఆటోలో తిరిగొచ్చాడు. ఎక్కడికక్కడ ఊరంతా వినపడేలా ఏర్పాటు చేసిన మైక్స్‌లో తప్పిపోయిన పిల్లల గురించీ, పెద్ద వాళ్ల గురించీ మాటిమాటికీ ఎనౌన్స్‌ చేస్తున్నారు. చిన్నూ గురించి పదే పదే చెప్తున్నారు.

గోదావరి గట్టుమీద నడుస్తున్న రమేష్‌ దృష్టి హఠాత్తుగా నదీ ప్రవాహం మీదికి మళ్లింది. గుండె ఒక్కక్షణం ఆగినట్లైంది. పరవళ్లు తొక్కుతున్న నది మాతృదేవతలా కాక మృత్యు పిశాచిలా కన్పించింది.

అవును, చిన్నూ నీటి ప్రవాహానికి ఒక్క మెట్టే పైనున్నాడు. తమ దగ్గరికి రావాలని ఆ ఒక్క మెట్టూ దిగి ఉంటాడు. చిన్నూ నీటిలోకి దిగిన దృశ్యం కళ్లముందు బొమ్మ కట్టింది. ఆ ఊహే భయంకరంగా అన్పించి వణికిపోయేడు.

కళ్ళ ఎదుట మార్కండేయేశ్వరాలయ శిఖరం కన్పించింది. ఏం చేస్తున్నాడో స్పృహ లేనివాడిలా అక్కడే మట్టిలో సాష్టాంగపడ్డాడు. అతని గుండెచప్పుడు భూమిని తాకి ప్రతిధ్వనిస్తోంది. ఒకళ్ళిద్దరు చూసుకోకుండా అతని మీద అడుగులేసి పడబోయి నిలదొక్కుకున్నారు.

''మృత్యుంజయా, ప్రభూ, మార్కండేయేశ్వరా'' పెదవులు కదలని ఆక్రోశం అతని హృదయంలోంచి వెలువడుతోంది. చుట్టూ పడవలు, రక్షణ కోసం కట్టిన రెయిలింగు, పట్టపగల్లాంటి వెల్తురులో అంత మంది జనంలో ఏ ఒక్కరూ చూసి ఉండరా చిన్నూ నీళ్లల్లో దిగి ఉంటే - పరి పరివిధాల పోతున్న ఆలోచనల్ని చిక్కబట్టుకుంటూ 'కాదు కాదు... అలా జరిగి ఉండదు. అలా జరగకూడదు' అనుకున్నాడు.

మనసుకేదో ఆలంబన కావాలన్పించి లేచి అడుగులు ముందుకేశాడు. మార్కండేయేశ్వరాలయంలోకి ప్రవహిస్తున్న జన సమూహాన్ని చూస్తూ ఆలయం ఎదుట గోదారి గట్టున ఉన్న పిట్టగోడమీద కూర్చున్నాడు.

ఒక్కసారిగా తుళ్లిపడ్డట్టు అతని స్మృతి పథంలో గతం మెదిలింది.

ఇప్పుడిది తన జీవితంలో చూస్తున్న మూడో పుష్కరం. మొదటి పుష్కరం నాటికి తనకి అయిదారేళ్ళ వయసుంటుంది. ఈ రేవులో స్నానం చేస్తున్న తల్లిదండ్రుల్ని వదిలేసి చెప్పకుండా మెట్లెక్కి ఆలయం వైపుగా వచ్చిన తన తప్పిపోయాడు. కాస్సేపు భయపడినా, తెలిసిన ఊరు పైగా ఇల్లు దగ్గరే కాబట్టి నడుచుకుంటూ ఇంటికెళ్లిపోయి వీధరుగు మీద పడుకుని నిద్రపోయాడు. అక్కడంతా తన కోసం వెతికి వెతికి జీవచ్ఛవాల్లా ఇంటికొచ్చి తనని చూసి ఒక్క ఉదుటున కౌగలించుకుని భోరుమని ఏడ్చేసారు తల్లి, తండ్రీ!

ఆ రోజు వాళ్లిద్దరూ తన కోసం ఎంత వేగిపోయారో నాన్న పదే పదే చెప్తూ ఉండేవారు. నాన్న చెప్పినప్పుడల్లా తను నవ్వుతూ ఎంజాయ్‌ చేసేవాడు. ఈ అనుభవం ఇంత భయంకరమైనదని తనకిప్పుడే తెలిసింది.

అలా ప్రాణాలన్నీ తనమీదే పెట్టుకుని పెంచిన తల్లిదండ్రుల్ని పట్టించుకోవాల్సినంతగా పట్టించుకున్నాడా?

తల్లి తను ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడడం చూడకుండానే కన్నుమూసింది.

వృద్ధాప్యంలో ఉన్న తండ్రి తనని పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసిన తండ్రి, రిటైరైన తర్వాత సంపాదించిందంతా తనకే ధారపోసిన తండ్రి, తననెంతో నమ్మిన తండ్రిని తను ఏం చేశాడు? శాంతికీ ఆయనకీ పడేది కాదు. శాంతి వచ్చిన కొత్తలో బాగానే ఉండేవారు. చిన్నూ పుట్టేక ఏమైందో తెలీదు, శాంతి ఆయన్ని ద్వేషించడం మొదలైంది. 

ఆయన అక్కర్లేని విషయాలన్నిట్లో ఇన్‌వాల్వ్‌ అవుతాడనీ, చిన్న సాయం కూడా చెయ్యడని, ఉద్యోగానికి వెళ్లొచ్చి చంటి పిల్లాణ్ణి చూసుకోవడమే కష్టంగా ఉంటే వేళాపాళా లేకుండా కాఫీలు టిఫిన్లు అడుగుతాడని, వద్దని చెప్తున్నా వినకుండా చిన్నూకి ఎంగిలి  అంటేలా ముద్దులు, ఎంగిలి ముద్దలు పెడతాడని రకరకాల కంప్లైంట్స్‌ చేసేది శాంతి.

శాంతి మీద ఆయనా అలాగే ఏవేవో చెప్పుకొచ్చేవాడు. ఇంటికి రావాలంటే భయం వేసేది తనకి.

ఏడాది క్రితం ఓ రోజు తను ఇంటికొచ్చేసరికి ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతోంది. గొంతు పెంచి శాంతి పెద్దగా అరుస్తోంది.

''నా మనవడు నా ఇష్టం'' అని నాన్న అంతకన్నా గట్టిగా అరుస్తున్నాడు.

''ఈ ముసలాడు ఇంట్లో ఉంటే నేనుండను. మా పుట్టింటికి వెళ్లిపోతాను'' అంది శాంతి.

తను ఎప్పట్లాగే సర్దుకుపొమ్మని, శాంతం వహించమని బ్రతిమలాడేడు. శాంతి వినలేదు. బట్టలు సర్దుకుని చిన్నూని చంకనేసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమైంది. 

కొంచెమైనా కరగకుండా ముసలాయన బిగుసుకుని కూర్చున్నాడు టీవీ ముందు. ఇంట్లో ఇంత రభస జరుగుతూంటే నిమ్మకి నీరెత్తినట్టు హైపిచ్‌లో సౌండ్‌ పెట్టుకుని టీవీ చూస్తున్నాడు.

తనకీ కోపం పొంగుకొచ్చింది తండ్రి మీద.

ఆయన మీద అరవాలనుకుని తనని తనే అతి ప్రయత్నం మీద అదుపులో పెట్టుకున్నాడు.

ఇంట్లోని ఈ గందరగోళం తనని ఎంతగా డిస్టర్బ్‌ చేస్తోందో ఈయనెందుకు అర్థం చేసుకోడు? ఈ మధ్య ఆఫీసులో కూడా వర్కు మీద తను సరిగా కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యలేకపోతున్నాడు.

శాంతిని ఎలాగో బ్రతిమలాడి ఆపి, రెండు రోజులు అదే పనిగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.

ఆ మధ్య ఎప్పుడో పేపర్లో యధాలాపంగా చదివిన హైదరాబాద్‌లోని ఓల్డేజ్‌ హోమ్‌ గురించి ఎంక్వైరీ చేశాడు. మర్నాడు స్వయంగా బయల్దేరి వెళ్లేడు.

సిటీ నుంచి దూరంగా అవుట్‌ స్కర్ట్స్‌లో ఉందా హోమ్‌. ఇళ్ల మధ్య నుంచి విసిరేసినట్టు ఉంది. ఒక పెద్ద హాలు, రెండు బెట్‌రూమ్స్‌ ఉన్న ఇల్లది.

బైట గోడలకి రంగులు వేసి, నాలుగు పూల కుండీల్లో గేటు లోపల చిన్న గార్డెన్‌ లుక్‌ వచ్చేలా చేశారు. ఆఫీసు రూం మాత్రం రిచ్‌గా వుంది. రివాల్వింగ్‌ చైయిరు, గ్లాస్‌ టేబులు, సోపా సెట్టు, ఓ మూల బల్ల మీద ఆర్టిఫిషియల్‌ పూలకుండీ, గోడకి పెద్దసైజు ప్రేమ్స్‌ కట్టించి పెట్టిన ఎవరో ఫారినర్స్‌ ఫోటోలు. బైట లుక్‌ చూసి చాలా బావుందనుకున్నాడు, లోపలికెళ్తే డైనింగ్‌ హాల్లో, బాత్‌రూమ్స్‌లో గచ్చు పెచ్చులూడిపోయి దాన్లో ఉన్న వృద్ధులలాగే దీనంగా ఉంది. లోపల గదులకి సున్నం వేసి ఎన్నాళ్లయిందో!

మొత్తం అంతా కలిసి పదిహేను మంది వరకూ ఉన్నారు. హాల్లో దగ్గర దగ్గరగా పన్నెండు మంచాలు వేసి వున్నాయి. తల దగ్గరున్న అలమార్లలో వాళ్ల బట్టల సంచులున్నాయి. రూమ్స్‌లో నాలుగేసి మంచాలు, ఒకో టీవీ

ఉన్నాయి. అందరికీ కలిపి కామన్‌ బాత్‌రూమ్స్‌ రెండున్నాయి.

వాళ్లకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో, ఎంత బాగా చూసుకుంటున్నారో గుక్కతిప్పుకోకుండా ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడేడు దాన్ని నడుపుతున్న మేనేజరు.

వృద్ధుల కోసం సేవా దృక్పథంతో నడుపుతున్నామని ఎనౌన్స్‌ చేసిన మేనేజరు తన ఉద్యోగ వివరాలు, తన తండ్రి పెన్షన్‌ వివరాలు తెసుకున్నాక పైన గది కట్టించడానికి లక్షరూపాయలు డొనేషన్‌ అడిగేడు. నెలకి ఐదువేలు బోర్డింగ్‌ ఛార్జెస్‌ కట్టాలన్నాడు.

తను అంత డొనేట్‌ చెయ్యలేనని బేరం ఆడి ఇరవైవేలు ముందు ఇచ్చేటట్టు, నెల నెలా తన తండ్రికి వచ్చే పెన్షను రెండు వేల ఐదు వందలు వాళ్లకే ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి వచ్చాడు. ఆలస్యమైతే తనలో ఏంమార్పు వస్తుందోనని శాంతి భయపడినట్టుంది. తను వచ్చిన మర్నాడే టికెట్స్‌ రిజర్వ్‌ చేయించి తెచ్చింది.

ఆ రోజు సాయంకాలం ప్రయాణమనగా తండ్రికి చెప్పేడు ప్రయాణం ఉందని. సంగతి ఇదీ అని చెప్పే ధైర్యం చాలలేదు తనకి. ఫ్రెండు పెళ్లని అబద్ధమాడేడు.

''నీ ఫ్రెండు పెళ్లికి నేనెందుకురా ఈ మోకాళ్ల నొప్పుల్తో? నే రాకపోతే ఆ పెళ్ళేం ఆగిపోదుగానీ నువ్వెళ్లిరా'' అన్నాడాయన. ''ఇప్పుడంత దూరం నేను రాలేను, అయినా నిన్నేగా వెళ్లొచ్చేవు, మళ్లీ ఇంతలో ఈ ప్రయాణం ఏంటి'' అన్నాడు విసుగ్గా, తనలో నిస్సహాయత కోపంగా మారి ఒక్క అరుపు అరిచేడు ''నాన్నా'' అని.

ఎన్నడూ తన ఎదుట గట్టిగా మాట్లాడని కొడుకు అలా కసిరేసరికి ముందు నిర్ఘాంతపోయి, తర్వాత మౌనంగా ప్రయాణమయ్యేడాయన. ఎయిర్‌బేగ్‌లో బట్టలన్నీ సర్ది బయల్దేరేవేళకి బైటికి తెచ్చిన కొడుకుని భయంగా చూస్తూ ఉండి పోయాడాయన.

ప్రయాణంలో అంతా తండ్రి చూపుల్ని తప్పించుకుంటూ తిరిగేడు రమేష్‌.

తండ్రిని హోమ్‌లో వదిలేసి వచ్చే ముందు రెండు మాటలు చెప్పడం తన ధర్మం అనుకున్నాడు. ''నాన్నా, ఆ ఇంట్లో నీ కోడల్తో గొడవల మధ్య మనశ్శాంతి లేకుండా అలా ఉండేకంటే ఇక్కడ ఎంతో బావుంటుంది. మీకు ఎలాంటి లోటు రానీకుండా అన్ని ఏర్పాట్లు చేసేను. డబ్బేమైనా అవసరం అయితే ఫోన్‌ చేస్తూ ఉండండి'' అన్నాడు ఓ అయిదొందలు చేతిలోపెట్టి.

పెన్షను రాగానే కొడుక్కి తెచ్చి ఇచ్చేసే అలవాటు ఎప్పట్నుంచో తండ్రికి. ఆయన షాక్‌ నుంచి తేరుకోలేదో, కొడుకు మీద అలకో తెలీదు ఎటో చూసకుంటూ మౌనంగా ఉండిపోయేడు.

ఓ వారం తర్వాత ఫోన్‌ చేసేడు - ''బాబూ రమేష్‌! ఇకపై నేనెప్పుడూ కోడల్తో గొడవ పడను. ప్రామిస్‌ చేస్తున్నాను. నిన్నూ చిన్నూని చూడకుండా ఉండలేక పోతున్నాన్రా. నన్ను తీసుకెళ్ళిపో, నన్నొక్కణ్ణీ వీళ్ళు బైటికి పంపడం లేదు'' ఫోన్లో ఆయన గొంతు దు:ఖంతో కణికిందని రమేష్‌కి ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఆ రోజు ఆయన్ని వదిలేసి వచ్చేటప్పుడు తను సరిగా చూడలేదు కానీ తండ్రి కన్నీళ్ళు నీటి చెలమలై ఉండి ఉంటాయని ఇప్పుడన్పిస్తోంది.

ఎన్నిసార్లు చిన్నూ తనని గుండెలపై తన్నలేదు? అలాగని చిన్నూని వదులుకోగలడా? నాన్న ఇప్పుడు, ఈ వృద్ధాప్యంలో చిన్నూలాంటి వాడేకదా!

ఇప్పటి వరకూ 'చిన్నూ.. చిన్నూ' అని ఆక్రోశించిన రమేష్‌ హృదయం ఇప్పుడు ''నాన్నా.. నాన్నా'' అని కూడా ఆక్రోశిస్తోంది. చీకట్లు అలుముకుంటున్న ఆ సంధ్య వేళ ఒక్కసారిగా లైట్లన్నీ వెలిగాయి. ఆలయంలో హారతిస్తునట్టున్నారు, గంటను ఎవరో ఎడతెరిపి లేకుండా మోగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే మైక్‌లో ఎనౌన్స్‌మెంటు వస్తోంది ''హలో హలో మిస్టర్‌ రమేష్‌, ఎక్కడున్నా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కి వెంటనే రండి, తప్పిపోయిన మీ చిన్నూ దొరికేడు. హలో... హలో...''

ఆకాంక్షలు ఎన్నో, అలజడులెన్నెన్నో, సంఘర్షణను ఉసిగొల్పే సంఘటనలెన్నో, చలనాలెన్నో, జీవితాన్ని దర్శించడమే కాదు, మార్పును దృశ్యీకరించేది కథ అని భావించే కె. వరలక్ష్మి 24 అక్టోబర్‌ 1948 తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు.

ఈ చిన్న కథానికలో మానవీయ విలువలు, కుటుంబ సంబందాలను చిత్రీకరించారు. గోదావరి పుష్కరాలలో పోలీసు వ్యవస్థ అందించిన సేవలను కూడా గుర్తు చేశారు. పాఠకులలో ఆలోచనలను రేకెత్తించే వరలక్ష్మిగారివి వివిధ పత్రికల్లో 140 పైగా కథలు, 4 నవలికలు, కవితలు, వ్యాసాలు ప్రచురితమైనాయి. నాటికలు ప్రసారం అయ్యాయి. 'జీవరాగం', 'మట్టి - బంగారం', 'అతడు - నేను', 'క్షతగాత్ర', కథాసంపుటాలు, 'ఆమె' కవితా సంపుటి వచ్చాయి. చాలా కథలు, కవితలు వివిధ సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. వీరు తమ కథలకు ప్రతిష్ఠాత్మకమైన సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం, చాసో స్ఫూర్తి, విమలా శాంతి, సహృదయ, హసన్‌ ఫాతిమా, రంజనీ, అజో - విభో (అమెరికా), ఆటా, తానా, రంగవల్లి, పులికంటి, ఆర్‌ఎస్‌ కృష్ణమూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి మొదలైన పురస్కారాలు అందుకున్నారు.

- కె. వరలక్ష్మి

జగ్గంపేట (పోస్ట్‌, మండలం), తూర్పుగోదావరి జిల్లా

వార్తావాహిని