యూనిట్
Flash News
విగ్రహాలు

విగ్రహాలు
- ప్రతాప రవిశంకర్
సంకలనం:
పెనుగొండ
ఎదురుచూసిన
ముహూర్తం రానే వచ్చింది. తెల్లవారితే విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందనగా ఆ రాత్రికే
జరగవలసిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు సుబ్బయ్య విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు.
ఐదువేల
జనాభాకి మించి వుండని ఆ ఊళ్ళో నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డుకు మధ్యగా ఎత్తుగా, వెడల్పుగా కట్టిన దిమ్మెమీద సుబ్బయ్య విగ్రహం
పాతేయబడి వుంది. ఆవిష్కరణకి ముందు సుబ్బయ్య మొహాన్ని ఎవ్వరూ చూడకూడదు కాబట్టి
పాడెమీద శవానికి గుడ్డకపట్పి బిగించి కట్టినట్టు సుబ్బయ్య విగ్రహాన్ని కూడా
తెల్లటి గుడ్డతో కప్పేశారు. ఊళ్ళో ముఖ్యమైన రోడ్లనిండా రంగురంగుల కాయితాల దండలు
వేలాడదీశారు. సుబ్బయ్య విగ్రహం పక్కనే ఎత్తయిన స్టేజ్ ఏర్పాటు చేశారు.
తెల్లారి
ఉదయం పదకొండు గంటలకు సుబ్బయ్య విగ్రహాన్ని చేపల పరిశ్రమశాఖ మంత్రి ధర్మలింగం
ఆవిష్కరిస్తాడు. ఈ విషయాన్ని రెండు రోజులు ముందుగానే పేపర్ల ద్వారా
అశేషప్రజానీకానికి తెలియజేశారు. ఇతర వాహనాల్లో కొంతమంది చుట్టుపక్కల చాలా వూళ్లకు
వెళ్లి సుబ్బయ్య విగ్రహ ఆవిష్కరణకి వేలాదిమంది తరలి రావలసిందిగా విజ్ఞప్తి చేసి
వచ్చారు.
ముందుగా
సుబ్బయ్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేత ఆవిష్కరణ చేయించాలని అనుకున్నారు. ఐతే
కొంతమంది యువ కార్యకర్తలు ఇందుకు ఒప్పుకోలేదు.
''సి.యం. మన కులపోడు కాదు. మన కులపోడి చేత ఆవిష్కరణ చేయిస్తేనే సుబ్బయ్య
విగ్రహానికి ఆత్మశాంతి'' అన్నారు
మొండిగా.
''అయితే మన కులపోళ్ళలో మంత్రులెవ్వరున్నారో మీరే చెప్పండి'' అన్నారు ఆవిష్కరణ కమిటీలోని ఒకరిద్దరు ముసలి
సభ్యులు.
''చేపల మంత్రి
ధర్మలింగం మన కులపోడేగా!'' అన్నారు
వాళ్ళు.
''మరింకేం? పదండి పోయి మాట్లాడదాం!'' అన్నారంతా.
ఒకరోజు అంతా కట్టగట్టుకుని
మంత్రి ధర్మలింగంను కలుసుకుని విషయం చెప్పారు. ఆయన కూడా తెగ సంతోషపడిపోయి ఆనందంతో ''మన కులపోడి విగ్రహాన్ని నేనే
ఆవిష్కరిస్తాను. మీరంతా ధైర్యంగా వుండండి'' అంటూ
ఎందుకో వాళ్ళకి ధైర్యం చెప్పాడు.
సుబ్బయ్య విగ్రహాన్ని
ఆవిష్కరించటానికి ధర్మలింగం ఒప్పుకున్నందుకు వాళ్ళంతా ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.
''అవునూ...
ఇంతకీ ఈ సుబ్బయ్యెవ్వడు? వీడి
విగ్రహాన్ని ఎందుకు చేయించారు? గాంధీ, నెహ్రూలకంటే వీడు గొప్పవాడా యేమిటి?'' అనుమానంగా అడిగాడు ధర్మలింగం.
వాళ్ళంతా ఒకరి మొహాలొకరు
చూసుకుని చివరకు ధర్మలింగంను అమాయకంగా చూశారు.
''చెప్పండి...ఇప్పటికీ
గాంధీ, నెహ్రూల విగ్రహాలు లేని
ఊర్లు చాలా వున్నాయి. మరి ఈ సుబ్బయ్యయెవ్వడో నాకు తెలియాలి గదా! రేపు మీ వూళ్ళో
వేదికెక్కి మైకులో నేనేం చెప్పేది ఈ సుబ్బయ్యెవడో తెలీకుండా, అందుకే దాచకుండా నాతో అంతా చెప్పేయ్యండి'' అన్నాడు ధర్మలింగం సుబ్బయ్య గురించి
తెలుసుకోవాలనే ఇంట్రస్ట్తో.
''నిజమే
మంత్రిగారికి మన సుబ్బయ్య గురించి తెలియాలి. లేకపోతే రేపు మనూళ్ళో ఉపన్యాసం ఇవ్వటం
కుదర్దు'' అన్నాడొకాయన
మందలింపుగా...
అప్పుడు సుబ్బయ్య
విగ్రహావిష్కరణ కమిటీలోని ఒక ముసలి సభ్యుడు యువకుడిలా గొంతు సవరించుకుని ''మంత్రి గారూ... మీ క్కొంచెం
వివరంగా చెప్పాలి'' అంటూ
అందరికేసీ ఒకసారి చూసి మళ్ళీ గొంతు సరిచేసుకున్నాడు.
''నిజానికి మా
వూళ్ళో కూడా ఒక్క గాంధీ విగ్రహమే వుంది. దానిక్కూడా ఒక కాలు విరిగిపోయి తొడలోనించి
ఇనపకడ్డీ బయటకు వచ్చింది. మా అందరికీ బాధ కలిగి ఆ గాంధీ విగ్రహానికి మరమ్మత్తులు
చేయించాలనుకున్నాం. అయితే సరిగ్గా అప్పుడే నగరం నించి మా కంటే ఎక్కువ
చదువుకున్నవాడు వచ్చి ఈ గాంధీ విగ్రహానికి మరమ్మత్తులు చేయించేకంటే మన కులపోడిదే
కొత్త విగ్రహం చేయిద్దామన్నాడు. మన కులపోళ్ళలో అంత గొప్పవాడు ఎవరున్నారనిఅడిగాం.
వాడే మన సుబ్బయ్య పేరు చెప్పాడు.''
''ఇంతకీ
సుబ్బయ్య ఏం ఘనకార్యం చేశాడట?'' ఆత్రుతను
అణచుకోలేక అడిగాడు ధర్మలింగం.
''స్వాతంత్య్ర
ఉద్యమంలో పనిచేశాడు.''
''ఏదయినా
సత్యాగ్రహానికి గాంధీగారితో పాటు నాయకత్వం వహించాడా?''
''అదేంకాదు.
అంతకంటే గొప్పపనే చేశాడుట. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనే నాయకులందరికీ సుబ్బయ్య
వంటలు చేసి పెట్టాడుట. వాళ్లలో పౌరుషం రగిలించటానికి ఉప్పూ కారం ఎక్కువగా వేసి
వంటలు చేశాడుట. దాంతో మన ఉద్యమకారులందరికీ పౌరుషం పెరిగిపోయి తెల్లదొరలకు
వ్యతిరేకంగా పోరాటం జరిపారుట. చివరకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ నాయకుల్లో
చాలా మంది సుబ్బయ్య వంటల కారణంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని స్టేజిమీద
పొగిడి సుబ్బయ్యకు ఏదో బిరుదును ఇచ్చి ఘనంగా సన్మానించారట కూడా.''
''చాలు...ఇప్పుడు
నాకు అంతా అర్థమయింది. ఇప్పటిదాకా మన కులపోళ్ళలో నేనే గొప్పవాడిననీ, మంత్రిని అయ్యాయని అనుకుంటున్నాను. నాకంటే
గొప్పవాడు మన కులపోళ్ళలో ఇంకోడు కూడా వున్నాడని రేపు స్టేజీ గుద్ది మరీ చెబుతాను.
ఇహ వెళ్ళిరండి. ఆవిష్కరణకి ముందు రోజు రాత్రికి జిల్లా హెడ్ క్వార్టర్స్కి
వస్తాను. కలుసుకోండి'' అన్నాడు
ధర్మలింగం, ఆనందబాష్పాలు తుడుచూకుంటూ.
ఆవిష్కరణ కమిటీ సభ్యులు
ఇంటిదారి పట్టారు.
అడ్డు తెరలు తొలగాయి.
సుబ్బయ్య విగ్రహాన్ని ధర్మలింగం ఆవిష్కరించాడు. చప్పట్లు మోగాయి. ముసుగు తొలిగి
గ్రహణం విడిచిన సూర్యుడిలా ప్రజలకు దర్శనమిచ్చాడు సుబ్బయ్య. చుట్టుపక్కల గ్రామాల
నుంచి వచ్చిన మనుషులు సుబ్బయ్య విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే సుబ్బయ్య
కుడిచేతిలో గరిటె వుంది. ఎడమచేతిని పైకెత్తి ఆకాశంలోకి చూపిస్తున్నాడు.
''ఆశ్చర్యంగా
వుంది కదూ... సుబ్బయ్య ఎందుకు ఎడమచేత్తో పైకి చూపిస్తున్నాడు?'' అనడిగాడు ఒకాయన పక్కనున్నాయనతో.
''కాకులు మీద
వాలకుండా పైన షెల్టర్ కూడా కట్టించమంటున్నాడేమో!'' అన్నాడాయన.
''అదేంకాదు...
పైన స్వర్గం వుంది. నా చేతి వంట తిన్నవాళ్ళంతా ఇప్పుడు అదే స్వర్గంలో వున్నారని
చెబుతున్నాడు'' అన్నాడో
కాలేజి కుర్రాడు.
అప్పటికే పరోక్ష స్వాతంత్య్ర
పోరాట యోధుడు అనే పేరుతో సుబ్బయ్య చరిత్రను సంక్షిప్తంగా కరపత్రాల రూపంలో అక్కడకు
వచ్చిన వాళ్ళందరికీ సుబ్బయ్య అభిమానులు పంచిపెట్టారు.
ఆవిష్కరణ అనంతరం చేపల
పరిశ్రమ మంత్రి ధర్మలింగం '' నా నియోజకవర్గంలోని వారు కాకున్నా నాకు
ప్రియమైన ప్రజలారా'' అంటూ
తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.
జనమంతా సంతోషంతో చప్పట్లు
కొట్టారు.
''చూశారా.. తన
నియోజకవర్గంలో లేని ప్రజలన్నా ధర్మలింగంగారికి ఎంతో గౌరవం. అందుకే ఆయనకు పిల్చి
మంత్రి పదవిచ్చారు.'' అని
పక్కనున్నాయనతో చెప్పాడు ధర్మలింగం కులానికి చెందిన ఒకాయన.
''నిజంగా ఈ
వూరి పేరును సువర్ణాక్షరాలతో రాయించాలి చరిత్ర పేజీల్లో. ఎందుకంటే సుబ్బయ్యలాంటి
నాయకుడు ఒకడున్నాడని దేశానికి ముందుగా తెలియజేసిన కీర్తి ఈ వూరికే దక్కుతుంది.
సుబ్బయ్య చరిత్రను మీరు ఈపాటికే చదివి వుంటారు. ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా
మేలుకుని మరుగున పడిపోయిన సుబ్బయ్య చరిత్రను పాఠ్య పుస్తకాల్లో రాయించాలి.
సుబ్బయ్య చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించాలి. సుబ్బయ్య విగ్రహాలను
వూరికి రెండుకి తక్కువ లేకుండా ఆవిష్కరించాలి. సుబ్బయ్య పేరుతో పేదలకు అన్నదానం
చేయించాలి. ఇంకా ఎన్నో చేయించాలనీ ఎన్ని చేయించినా సుబ్బయ్య రుణం తీరదని నేను మీ
అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను'' అంటూ
తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు ధర్మలింగం.
చివరికు ఆ వూర్నించి
వెళ్ళిపోతూ ధర్మలింగం ఆ సెంటర్లోనే ఒక మూలగా కాలు విరిగిపోయిన గాంధీ విగ్రహాన్ని
చూసి ''మా సుబ్బయ్య విగ్రహాన్ని చూసి
గాంధీగారు అసూయపడుతున్నారు'' అని
నవ్వుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు.
ధర్మలింగం ఉపన్యాసం
ముగిసేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. అప్పటికప్పుడే ధర్మలింగం సుబ్బయ్య
విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండ వేసిన విషయాన్ని ఇప్పుడే అందిన వార్తగా రేడియోలో
చెప్పారు.
ఆ రోజునే సుబ్బయ్యలాంటి
మహాత్ముడి పుట్టినరోజును సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి అర్జీ
పెట్టుకున్నారు సుబ్బయ్య ఆవిష్కరణ కమిటీ సభ్యులు. కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కూడా
ఆ అర్జీని సానుభూతితో పరిశీలించి సుబ్బయ్య జయంతిని సెలవుదినంగా ప్రకటించింది.
సుబ్బయ్య విగ్రహావిష్కరణ
జరిగిన తర్వాత ఆ వూళ్ళో గొప్ప కలవరం మొదలయ్యింది. ఆ రోజు రాత్రే ఏ కులానికి ఆ కులం
వాళ్ళు కలిసి అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. యాభైయేళ్లపైన వందేళ్ళలోపల
కుల చరిత్రను తిరగదోడారు. తమ కులంలో బాగా గొప్పవాడయిన మనిషి కోసం వెతికారు. ఆ
తర్వాత ఇతర వూళ్ళకు వెళ్ళి తమకు కావలసిన భోగట్టాను తమ కులం వాళ్ళ దగ్గర
సేకరించారు. వాళ్ళంతా స్వతంత్ర పోరాటాన్నే స్ఫూర్తిగా తీసుకుని విగ్రహ
ప్రతిష్టకోసం తమ నాయకుడిని ఎంపిక చేసుకున్నారు.
కొద్ది రోజుల్లోనే పనులన్నీ
చకచకా పూర్తయినాయి. ఊరిమొత్తం మీద ఇరవై విగ్రహాలకు ఆర్డర్లు వెళ్ళాయి. విగ్రహాలు
తయారు చేసేవాళ్ళు కుటుంబాలతో సహా ఆ ఊరికి తరలివచ్చారు.
కుల నాయకుల విగ్రహాల తయారీ
మొదలయింది.
ముందుగా వినాయకం విగ్రహం
పూర్తయింది. ఆ కులం వాళ్ళంతా కలిసి ఆ విగ్రహం ఆవిష్కరణకు వాళ్ళ కులం ఎమ్మెల్యేను
ఆహ్వానించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆ ఎమ్మెల్యే ఆశ్చర్యంగా చూశాడు ఆ వినాయక
విగ్రహాన్ని. ఎందుకంటే అందులో వినాయక విగ్రహం కాలు పైకెత్తి తన్నటానికి
మీదకొస్తున్నట్లుగా వుంది.
''ఇదేమిటి?'' అన్నాడాయన కులనాయకుడితో.
''వినాయకం
స్వాతంత్య్ర ఉద్యమ నాయకులతో కలిసి ఫుట్బాల్ ఆడేవాడట. అందుకే విగ్రహాన్ని కూడా
అట్లాగే చేయించాం'' అని
చెప్పాడా నాయకుడు గర్వంగా.
ఆవిష్కరణ తర్వాత కొన్ని
రోజులకే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే కోరిక మీద ప్రభుత్వం వినాయకం పుట్టిన రోజును
కూడా సెలవు దినంగా ప్రకటించింది.
వరుసగా అన్ని కులాల నాయకుల
విగ్రహాలకీ ఆయా కుల రాజకీయ నాయకుల చేత ఆవిష్కరణలు చేయించారు. ఎవరిపట్లా చిన్న చూపు
చూడకుండా, ఏ కులాన్నీ తక్కువగా భావించకుండా వారి కోరిక
ననుసరించి ఆయా కుల నాయకుల పుట్టిన రోజులన్నింటినీ సెలవు దినాలుగా ప్రకటించింది
ప్రభుత్వం.
చేపల మంత్రి ధర్మలింగం
సలహాతో ఆ వూళ్ళోనే మరో రోడ్డులో మరో సుబ్బయ్య విగ్రహం వెలిసింది. ఆ తర్వాత అన్ని
రకాల కుల నాయకుల విగ్రహాలు మరికొన్ని అన్ని వీధుల్లోనూ వెలిశాయి.
చివరకు ఆ వూళ్లో రోడ్లన్నీ
కుల నాయకుల విగ్రహాలతో నిండిపోయాయి. ఊళ్ళో సైకిలు వెళ్ళే దారి తప్ప మరో వాహనం వెళ్ళే
అవకాశం లేకుండా పోయింది. అయినా వాళ్ళెవరూ అందుకు బాధపడలేదు. రెండెడ్ల బళ్ళనీ, ట్రాక్టర్లనీ ఊరి బయటనే వదిలేశారు.
ఇంతలోనే ఎన్నికలొచ్చాయి.
తను ఎప్పుడూ పోటీచేసే
నియోజకవర్గానికి సీటు దొరకని ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రాంతంలో పోటీ చేయటానికి
వచ్చాడు. ఆయన ఒకరోజు కొన్ని కార్లలో కొంతమంది జనాన్ని తీసుకుని ఆ వూరికి వచ్చాడు.
ఊరి బయట రోడ్డు మొదట్లోనే
అడ్డంగా ఒక విగ్రహం ఎదురయింది.
''ఇంకో
రోడ్డునించి పోనీ'' అన్నాడాయన
డ్రయివర్తో.
ఇంకో రోడ్డు మొదట్లో కూడా
రెండు చేతులూ పైకెత్తిన ఓ బానపొట్టాయన విగ్రహం కారుకు అడ్డుగా నిలబడి వుంది.
చివరకు వాళ్ళు వూరు చుట్టూ
ప్రదక్షిణ చేసినా కార్లో వూళ్ళోకి వెళ్ళి ఓట్లడగలేకపోయారు.
ఇంతలో వాళ్ళకు ఓ విగ్రహం
పక్కనించి చుట్ట కాల్చుకుంటూ వస్తున్న ఒకాయన కనిపించాడు.
''ఊళ్ళోకి
వెళ్ళేదారిలేదా. ఈ విగ్రహాలేమిటి రోడ్లనిండా?'' అనడిగాడాయన.
''ఇద్దరు
మనుషులు కలిసి నడవడమే కష్టంగా వుంది మా వూరి రోడ్డుమీద. ఈ విగ్రహాలన్నీ మా వూళ్ళో
వున్న రకరకాల కులపోళ్ళ నాయకులవి. మీరు ఊళ్ళో మనుషులతో మాట్లాడాలంటే కార్లుదిగి
ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తూ రండి'' అన్నాడాయన
పొగ వదిలిపెట్టి.
''నేను
ఓడిపోయినా ఇష్టమే. ఈ కులపిచ్చోళ్ళ మధ్యకు నేను వెళ్ళను'' అని ఆయన కార్లు వెనక్కు మళ్లించుకుని
వెళ్ళిపోయాడు.
ఆ వూళ్ళో వాళ్ళంతా
దగ్గిరపడిన ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఏ కులం ఓట్లని ఆ కులం వాడికే వేస్తామని
కుల నాయకుల విగ్రహాల ముందు ప్రతిజ్ఞలు చేశారు.
అయితే వాళ్ళ కోరిక తీరకముందే
ఎన్నికలు ఇంకో నాలుగు రోజులున్నాయనగా పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ జిల్లాలో
సగభాగమంతా జల ప్రళయమయింది. సముద్రానికి దగ్గరగా వున్న కారణంగా ఉప్పెన వచ్చి
విగ్రహాలున్న ఆ వూరు మొత్తం కొట్టుకుపోయింది. ఒక్క కులంవాడూ ఆ వూళ్ళో మిగల్లేదు.
ఊరంతా కొట్టుకుపోయినా తమని పాతేసిన కులాల ప్రతినిధులుగా ఆ కుల నాయకుల విగ్రహాలు
మాత్రం కాళ్ళూ చేతులూ చూపించుకుంటూ చెక్కు చెదరకుండా నిలబడి ఉన్నాయి.
రచయిత గురించి:
ప్రతాప రవిశంకర్
''ఎత్తుగడ
పాఠకుడిని తన వెంటన పరిగెత్తేలా చేస్తే, అనుకోని
ముగింపు మనస్సుమీద చెరగని ముద్ర వేస్తుంది. ఈ రెంటికీ తోడు ఆయన శైలి. పెద్దపెద్ద
మాటలు వుండవు. అనవసరపు వర్ణనలు వుండవు. మనం మాట్లాడుకునే మామూలు మాటల్లోనే - అరటి
పండును తేనెలో ముంచుకు తిన్నంత హాయిగా - కథను నడిపించేస్తాడు.'' ప్రతాప రవిశంకర్ కథన శక్తిని గురించి మరో కథా
రచయిత పి.ఎస్.నారాయణ రాసిన ఈ మాటలు అతని కథలు చదవిన తర్వాత నిజమనిస్తాయి. 1971లో ప్రగతి వారపత్రికలో
కథానిక ప్రచురణ ద్వారా సాహిత్యరంగంలో అడుగిడిన రవిశంకర్ ఇప్పటికి వెయ్యికి పైగా
కథలు రాశారు. అంతరంగం, మిస్టర్
ఎక్స్, కథ మొదలయ్యింది కథా సంపుటాలు వెలువరించారు.
ఇంకా ఇరవైకి పైగా నవలలు, నవలికలు
రచించారు. ఎం.ఏ. వరకూ చదివి సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగ విరమణ
చేసిన రవిశంకర్ 10 డిసెంబర్ 1055న గుంటూరు
జిల్లా పెదనందిపాడు మండలం, పుసులూరు
గ్రామంలో జన్మించారు. సమాజంలో రోజు రోజుకూ పెరుగుతున్న కులతత్వాన్ని నిరసిస్తూ కలం
దువ్విన వ్యంగ్య కథానిక యిది.