యూనిట్

గ్యారా కద్దూ బారా కోత్వాల్‌

('గ్యారా' అనగా పదకొండు. 'కద్దూ' అనగా సొరకాయి లేక అనపకాయ. 'బారా కోత్వాల్‌' అనగా గ్రామంలోని పన్నిద్దరు(12) ఆయాగాండ్లు. మొగలాయి జమానాలో, 'కర్ర యెవనిదో బర్రె వానిది', అనే బాపతుగా పనులన్నీ సాగుతూ వుండేను. ఒక అమాయకుడైన కాపు తుదకు లక్షాధిపతి ఎట్లైనాడో యీ కథ నిరూపించుతుంది.)

ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్ళినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేేరం చేస్తూ వున్నారు. అంతలో మాలీపటేల్‌ వేంచేసినాడు. ''ఒరేయ్‌! ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? మంచిమాటతో ఒక కాయ ఇచ్చిపో'' అంటూ తానే ఒక పెద్దకాయ లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుగుకుంటూ వున్నాడు. అంతలోనే గోరుచుట్టూ రోకటి పోటన్నట్లుగా పోలీసుపటేలు హాజరైనాడు. ''పట్టుకొని రారా వాన్ని! ముసాఫిర్ల లెక్కలో వాని పేరు రాయా ల్సింది వుంది'', అని గర్జించాడు. తలారి వచ్చి తనపాలి వకకాయి, పటేెలపాలిటి వకకాయి లాగుకొని పోయినాడు. కొంతసేపటికి పెద్దతలారి వచ్చినాడు.''ఏయ్‌, మొన్న నీవంటివాడే వచ్చిం డెను.పొద్దుమునిగినప్పుడు కూరగాయలమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ళ యింట్లో కన్నం వేసిండు  పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్‌'' అంటూ తానున్నూ ఒక కాయ చేతబట్టుకున్నాడు. ''అయ్యా! మా రాజా! నేను దొంగను కాను. దొరను కాను. పొరుగు వాన్ని, ఎల్లప్పటికిన్ని వచ్చిపోయేవాన్ని. ఇప్పటికే మూడు కాయలు ఎగిరిపోయినవి.మళ్ళీ నీవెక్కడ నుండి ఊడిపడితివి?'' అని కాపువాడు మొరపెట్టు కొన్నాడు. అదే కాయతో వాడి నెత్తిన పొడిచి కాయ చక్కాపట్టుకు పోయినాడు పెద్దతలారి.అదే విధంగా, పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల, మొదలైన 11 మంది ఆయగాండ్లు   ఒకరి వెంట ఒకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు.  కాపువాడు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయినట్టి కర్ణమయ్య  అప్పడే ఆతనికి ప్రత్యక్షమైనాడు.''ఏమిరా ఏడుస్తు న్నావు'' అని అన్నాడు. 'న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైన ఈ వూరిలో ఉన్నాడురా నారాయణ' అని అనుకోని కాపువాడు తన 11 సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి. ''అయ్యా కరణమయ్యా, నీవే  నారాయణమూర్తివి. నన్నేట్లనై గడ్డకేయండి అని గొంగడి ఆయన కాళ్ళమీద వేసి కాళ్ళు పట్టుకున్నాడు. కర్ణం ఒక్క తన్ను ఝాడించి కంబడి చంకనబెట్టుకొని ఇట్లన్నాడు. 'అరే లుచ్ఛా! అందరికీ వంతు సొరకాయ యిచ్చి నావంతు తప్పించినావా? నేను తలరి వాని కంటే పనికి రానివాడ్నా?వడ్లోనికంటే వృద్ధుడినా?  ఓనమాలు రాని మాలిపటేలు నీకు ఎక్కువైనవాడా? తే! నావంతు సొరకాయ.అదిచ్చి ఈ గొంగడి తీసుకుపో '' అని గుడ్లెర్ర చేసుకొని కంబళి తన చంకనపెట్టుకొని  ఇంటికి పోయినాడు.

              కాపువాడు ఎగాదిగా చూచినాడు ''నీవూ ఇంతేనా? ఈ వూరంతా ఇంతే? ఏదేశం యిది? పాడుదేశం. ఇంక నావంటి దిక్కులేనివారు బతికేదేట్లా?'' అని  గొణుగుతూ పట్వారి వెంట కొంతదూరం  ప్రాధేయపడుతూ వెళ్లినాడు. ''ఒరేయ్‌ ఓ అడుగు ముందుకువేస్తే నీ తలకాయ పగుల తంతా (జాగ్రత్త) ఖబడ్దార్‌!''అన్నాడుపట్వారి. కాపువాడు దిక్కుతోచక నిల్చిపోయినాడు.చిన్న పిల్లవానివలే ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు చూసి 'పో నాయన పో! పొద్దున్నే  ఎవరి మొఖం చూసినావో ఏమో. యీ  వూళ్ళో అందరూ ఇట్లాంటి మారాజులే, ఇంకోమారు రావద్దు''. అని బుద్దిచెప్పినారు. కాపువాడు దీర్ఘాలోచన చేస్తూ ఇంటి దారిపట్టినాడు. ''ధూ, పుట్టిన పటేలులాగా పట్వారి అయి పుట్టాలె. లేకుంటే తలారిగా అయనా పుట్టాలే.ఈ  బతుకు బతికినావకటే చచ్చినాఒకటే.. కాయలుపోతే పోయే కాని గొంగడి కూడా పోయింది.అందరికంటే ఆ కర్ణమోడు మరీ చెడ్డవాడు.అందు కోసరమే కాటికి పోయినా కర్ణపీడ తప్పదన్నారు పెద్దలు..దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా..? అయితే బీదోడ్ని, ఏమిచే యగలను? ఆ తలారీకి చారెడు చేనన్నాలేదు. నాకు చేనుంది. పెండ్లామైనా వంకి వుంది. ఒకె ద్దుంది. తలారికంటే తక్కువనా నేను? దేవునికైనా దెబ్బే గురువు. నేనున్నా ఏదో మొండి తొండి చేస్తా !'' ఇట్లా ఆలోచన పరంపరంలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. ఇంకా దీర్ఘాలోచనలోనే ఉన్నాడు. తటాలున మెరుపు మెరిసినట్లై వాని తలలో ఒక ఆలోచన తళుక్కుమంది.ఊల్లోకి పోయినాడు. పెండ్లా వద్దకు వెళ్ళి ''ఒసేయ్‌ నీ వంకె ఒకసారి ఇయ్యేమంటే! నీకేం ఫర్వాలేదుతే, ఉగాది నాటిక ఒకినూరువంకీలు చేస్తా. నాపేరు వెంక అనూ.'' అనీ వంకీనీ లాగుకొన్నాడు. దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10మైళ్ల దూరంలో ఉండే పట్నం చేరుకొని షేర్వాణీలు, లాగులు, మోజాలు, పగిడీ, నడుపట్టిబిల్లలు మొదలైన పరికరాలును సిద్దము చేసు కొన్నాడు.నలుగురు అరబ్బు జవాన్లను జతచేసు కొన్నాడు. వారికి బిల్లలను తగిలించారు. తాను బాబా వేషం వేసుకున్నాడు. ఒక బగ్గీని కిరాయికి మాట్లాడుకున్నాడు.

 రెండామడల దూరంలో ఒక పెద్ద బస్తీ   ఉండింది.అది నాలుగు బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారిపేట! అధికారులు, మంత్రి, నవాబుకూడా ఆ మార్గంగా షికారుకు పోయే స్థలం.ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావిగట్టున ఒక మర్రి మానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను రావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊరులోని ఆడవారు నీటికి వస్తే ఆ జవానులు 'ఖబర్దార్‌ కడవకొక పైసా యిచ్చి తీసుకోండి'' అని బెదిరించినారు.

పటేలు, పట్వారీలు వచ్చినారు.''ఒరేయ్‌! మాకు సర్కారు హుకుం అయింది. ఇదిగో ఫర్మాన్‌'', అని  ఉర్దూముద్రలతో నుండే ఫర్మాను చూపించి నాడు కాపు.ఉండవచ్చునని గ్రామాధికారులూరుకున్నారు.  దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట మొదట దినం 20 రూపాయల వరకు వసూలైంది. క్రమేణ ఆదాయం ఎక్కువైంది.'' మర్రిమాన్‌ పరగణా సుంకం'' చుట్టూ రెండా మడవరకు ప్రసిద్ధి అయిపోయింది.ఇట్లా వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినవి.ఒకనాడు  సుబేదారి దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు. అతని నౌకరు నీటికి పోతే ''పైసాలావ్‌'' అన్నారు. జవానులు వారు ఉత్తకడవలతో వాపసుపోయి ''సర్కార్‌! నల్గురు అరబ్బీ జవానులు  పైసా యియ్యంది నీళ్ళు తీసుకోనివ్వరు. అరే సుబేదారి సర్కారు వారికిరా! అంటే బంజియాలతో పొడిచే దానికే పైబడవస్తారు సర్కార్‌!'' అని విన్నవిం చుకొన్నారు. అక్కడనే సేవలో ఉన్నట్టి పటేలు పట్వారీలిట్లన్నారు, ''హుజూర్‌! పదేండ్లనుండి యీ మర్రిమాను పరగణా సుంకం సక్రమంగా  వసూలౌతుంది. అందుకు సర్కారు ఫర్మాను వుంది''. ''ఉంటే ఉండవచ్చును'' అనుకొని సుబేదారి కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొన్నాడు.

ఒకనాడు దీవాను బహద్దుర్‌ గారు అక్కడ డేరా వేయించినాడు. అతనికిన్నీ ఇదే గతి పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది. ఒక మెట్టు కూడా దిగనియ్యరు. దీవానుగారు అంతా వినుకొని ఇట్లనుకొన్నారు.

 ''మీ హుజుర్‌ గారు ఫర్మానిచ్చి నారేమో. లేకుంటే నా వద్దకూడా వసూలు చేసే గుండెవుందా వీనికి! దీవాను కూడా సుంకం చెల్లించు కొన్నాడు. కాపువాన్ని పట్టే పగ్గాలు లేవు. సుబేదారేమిటీ, దీవాను బహద్దూరు కూడా కిక్కురు మనకుండా సుంకం చెల్లించుకొని పోయివుంటే, 'అబ్బా, ఏందబ్బా బారా వీనిది', అని జనులు చాటున అనుకునేవారు.ఇట్లా వుండగా నవాబుగారు షికారు పోతూపోతూ పొద్దు పోయిందని రాత్రికి ఆఊరులోనే ఠికానా వేసినారు. ఇప్పటికి కాపువానికికెవ్వరున్ను కంటి కాగేటట్లు కనబడ లేదు. 'పైసా ఆడపెట్టి బావిలోకి దిగూ,' అన్నాడునవాబు నౌకరును. నవాబుకు షికాయితు అయింది. నవాబు గారు తమలోనే  అనుకున్నారు. 'మా దివాన్జీ మా ఖజానా భర్తీ చేసే  దానికి ఈ హుకుం ఇచ్చినా డేమో. పట్నం పోయిన తర్వాత విచారించుతాను .ఇప్పుడు మాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధున్నై ఉండాల్సిందే'', అని ఆలోచించుకొని తానున్నూ నీటిసుంకం చెల్లించుకొన్నాడు.

ఈ పాటికి మర్రిమాను పరిగణాలో రెండ తస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల  సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ దూరం అప్పులిచ్చినాడు. నవాబుగారు తమ నగరానికి వేంచేెసిన తర్వాత దీవాన్జీని పిలిచి ''దివాన్‌సాబ్‌, మీరెందుకు నీటికి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయం కాదా?'' అని విచారించినాడు. అందుకు దివానుగారిట్లు మనవి చేసుకొన్నారు. ''బందగానే అలీ, హుజూర్‌ ! నేనున్నూ మీతో అలా గుంజారిష్‌ (మనవి) చేసుకోవాలె అని వుంటిని. నేను కూడా సుంకం  చెల్లించుకున్నాను. హుజూర్‌ గారు ఫర్మానె ముబారక్‌ జారీ చేసి వుంటారని నేనున్నూ అనుకున్నాను''. ''అరే నీవూ హుంకుం ఇయ్యలేదు. నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏళ్ళ నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాన్ని గిరఫ్తారీ (అరెస్టు) చేయించి తక్షణం పట్టి తెప్పించు'' అని నవాబుగారు ఉరిమినారు.

కాపువాడు ఇట్టి ఫర్మాను కొరకై 10 ఏళ్ళనుండి నిరీక్షించుతూనే వున్నాడు.1000 అప్రషీలు  బంగారు తట్టలో పోసుకొని జరీ పనిచేసిన మఖ్మల్‌  బట్టపైన మూసుకొని కాపువాడు హుజురువారికి నజరానా సమర్పించుకొన్నాడు. నజరానా చూచే వరకు నవాబుగారు చల్లబడ్డాడు. 'క్యారే, నీకీ యెవ్వర్‌ నీటి సుంకం హుకుం ఇచ్చినార్‌?' అన్నారు నవాబ్‌ గారు. 'హుజూర్‌,' 'గ్యారా కద్దూ బారా కోత్వాల్‌' హుకుం ఎట్లా ఏర్పడిందో, 'మర్రిమాన్‌ - పరిగణ సుంకం' కూడ అట్లా ఏర్పాటైంది.'' అన్నాడు కాపు. 'ఏమంటున్నావురా?'నీవనేదేమిన్నీ అర్థం కాలేదు. సరిగ్గా చెప్పు.'' ''నా తప్పంతా మాఫ్‌ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను''. ''సరేలే! చెప్పు చూస్తా''.

కాపువాడు తన కథంతా వర్ణించి చెప్పు కున్నాడు. హుజూరువారు అదే పనిగా నవ్వుతూ సాంతం విని, 'అరే ! నీవు చాలా హుష్యారు మనిషి. నీ తప్పంతా మాఫ్‌! ఇక ముందు నీవు మా దేవిడీ వద్ద రాత్రి గంటలు కొడ్తూ వుండుము. అదే నీకు శిక్ష .'' అని సెలవిచ్చానారు. కాపువానికి కొన్నాళ్ల వరకు తిక్కరేగినట్లుండింది.ఏమిన్నీ ఆదాయం లేదు. అధికారములేదు. అడిగే వారులేరు. రాత్రంతా నిద్రకాయవలెను. ఒకనాడు నిద్ర మబ్బులో రాత్రి 11గంటలు కొట్టేది మరిచి పోయేనాడు. 12గం.లకు లేచి కొట్టినాడు. ఈ చిన్న పొరపాటుకు  దేవిడీ అంతా తలకిందులైంది.

హుజురువారు 8గంటల నుండి గంట కొకసారి ఒక బేగంగారి గదికి పొయ్యేవారు. 11 గంటలు కొట్టేలేదు. 11 గంటల బేగం వద్దకు హుజుర్‌ పోలేదు.మర్నాడు 11గంటల బేగం గారు కాపును పిలిపించి, ''నెలకు 50 రూ.లు ఇస్తాను.మరిచిపోకుండా కొడ్తుండు.'' అన్నది. 'చిత్తం చిత్తంహుజూర్‌' అని కాపువాడు  తత్తరపాటుతో అన్నాడు. ఈ గంటలలో ఏమో రహస్యముందిరా'', అని కాపువానికి స్ఫురించింది. ఒకనాడు 12గంటలు తప్పించినాడు. ఏ గంట తప్పితే ఆ మరునాడు ఆ బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటుచేసుకొన్నది.ఈ విధంగా 400 రూపాయల జీతం ఏర్పాటైంది కాపువానికి. కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికి సంగతి తెలిసింది. 'వీడు చలాకీవాడు', అని మెచ్చుకొని, వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికి ఇనాముగా ఇచ్చి పంపినాడు.చూచినారా సొరకాయ మహిమ! సొరకాయ నరుకుట అంటే ఇంట్లాంటి కథలు చెప్పేదానికే అంటారు. 

రచన :  - సురవరం ప్రతాపరెడ్డి

సంకలనం : పెనుగొండ

 తెలంగాణ వైతాళికులు : సురవరం  ప్రతాప రెడ్డి

  తెలంగాణ సమాజంలోని దౌర్జన్యాలను, దుర్మార్గాలను ఎత్తి చూపుతూ కథలు రాసిన రచయిత.ప్రతాపరెడ్డి పాత్ర స్వభావాన్ని చిత్రించటంలో ఎంతో ప్రతిభ కనబరిచారు. వీరి కథానికలోని పాత్రలన్నీ సజీవమూర్తులే.

సురవరం ప్రతాపరెడ్డిగారి ఈ కథానికలో నాటకీయత చతురత అంతేగాక తెలంగాణ జీవద్భాష తోణికిసలాడుతాయి.వీరి కధాసంపుటి 'ప్రతాపరెడ్డి కథలు'. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషావేత్త అయిన సురవరం-తెలంగాణ వైతాళికుల్లో, ప్రముఖలు గోల్కొండ పత్రిక సంపాదకులు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షులు, హైదరాబాద్‌లో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాలలోను సంబంధం పెట్టుకున్న నిస్వార్థ ప్రజాసేవాపరాయణులు. 'ఆంధ్ర సారస్వత పరిషత్తు', 'విజ్ఞాన వర్తినీ పరిషత్తు' వంటి సంస్థలకు వ్యవస్థాప సభ్యులు.

 తెలుగువారికి వీరందించిన అపురూప గ్రంథం 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'. ఈ పుస్తకానికి 'కేంద్ర సాహిత్య అకాడమి', అవార్డు లభించింది. వీరి పై ఎల్లారి శివారెడ్డి రచించిన  'సురవరము ప్రతాపరెడ్డి జీవితము - సాహిత్యం'కు 1972లో 'ఆం.ప్ర.సాహిత్య అకాడమి బహుమతి' లభించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా బోరవెల్ల గ్రామంలో 28.5.1896న జన్మించిన మహనీయుడు 25.8.1953న మృతిచెందారు.

వార్తావాహిని