యూనిట్

వరద

అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరాన్ని చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు తూర్పు వైకుంఠపురం కొండ. దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు. పటమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది, అద్గదీ అమరావతి!

ఒకనాడు గుర్రాలు, రథాలూ తిరుగుతూండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవ్వాళ కుక్కలూ, గాడిదలూ, మేత దండగని ఊరుమీద తోలేసిన సాంబయ్యగారి ముసలి ఎద్దూ నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాలు రాసులూ ముత్యాల మూటలూ బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవ్వాళ పొట్టు బస్తాలు లాగుడు బండిమీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు వూడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ల ముందు వాళ్లు పూడ్చుకుని కళ్ళాపు జల్లుకొని కసుమంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే, ఇంకోపక్క కోళ్ళు, కోడిపిల్లలు  ముక్కుల్తో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళనిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద, ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం విన్పిస్తే, ఇవాళ 'నా కొడకా! నా ముక్కకి అడ్డొచ్చావు గదరా!' అంటూ పేకాట జోరుగా సాగుతోంది.

బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్నివేలమంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసినచోట - దిబ్బలు, వొట్టి దిబ్బలు కన్పిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బలమీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డిరోళ్ళ పోరగాళ్లు కన్పిస్తున్నారు.

కృష్ణకి నీళ్ళకెల్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టీ జారిపోతే 'కంగారెందుకులే' అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్ళు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగివస్తే ఆ ముత్యాలపట్టీ అక్కడే భద్రంగా ఉండగా కాలికి పట్టీలు లేవు. అయినా గునగున వెళ్ళిపోయిందట. ఇవ్వాళ కృష్ణకి నీళ్ళకెల్తున్న చాలా మంది  ఆడపిల్లలకి కాలి పట్టీలు లేవు. అయినా గునగున నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి, గుండెల్లో ఎంత దిగులున్నా.

 

అప్పటికీ ఇప్పటికీ, సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమి తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన, సూరీడు రాతివేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపు కొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్యనుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరునుంచి వస్తున్నట్లుంటుంది. తుళ్ళి తుళ్లి పారుతోంది. మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది.

ఇంకా తెల్లారలేదు. దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు. ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసక వెల్తుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్ళు వచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోటాలు, మట్టిగోడలు విరిగిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది.

పల్లపీధి మూడొంతులు మునిగిపోయింది!

మిట్టి మీదికి నీళ్ళెక్కుతున్నాయి!

కొట్టాల్లో పశువులు కట్టు గొయ్యల్తోసహా కృష్ణలో కలిసిపోయాయి!

రేపు పడవలు గల్లంతు!

లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి.

తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కన్పించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడ్తున్న అలలు. ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ళ ప్పులు, క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప, ఓ దుంగ మీద వూర కుక్కొకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తనూ గిరగిర తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుకుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క.

అంతలో ప్రవాహం మధ్య మంచి ఓ మనిషి కేక 'దేవుడోయ్‌! రచ్చించండో' అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. నిస్సహాయంగా ఆ భీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు వొడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం.

ఇళ్ళ ముందు నీళ్ళు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట ఆడుకుంటున్నారు. పడవలు చేసిపెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడమీద బొగ్గు గీతలు గీసి క్షణ క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు.

'పల్లపీథిలో అర్థరాత్రేళ సంగయ్యింట్లో పనిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్య! అప్పటికి గోడలిరిగె. నీళ్ళు తోసుకొచ్చె! పెళ్లాం పిల్లలూ పానాల్తో బయటకొచ్చారంట!'

'మిట్టమీది ఎంకటసామి మేకల మందంతా కొట్టుక పోతుంటే ఏం చెయ్యలేక సూస్తానుంచున్నాట్టయ్య!'

'సాలె పేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందట!'

'లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు, పాలేళ్ళు ఏవయినారో!'

ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని, పసుపు, కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడ్తున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కలకోసం ఎగబడ్తున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. పదిగంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. వూళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మాలక్ష్మమ్మ వారి చెట్టుదగ్గర కొచ్చారు.

'ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దాం?' అని తలపట్లు పట్టుకున్నారు.

'చేసేదేముందయ్య? ముందీ జనానికి తిండీ తిప్పలూ చూడండి' అన్నారెవరో.

అంతే! పదిమంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపొయ్యి తవ్వేశారు. ఇంకో పదిమంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి బియ్యం వసూలు చేశారు. కోటలో వంటసామగ్రి తెచ్చారు. పప్పూ, ఉప్పూ, నెయ్యి, వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి  'ఇహ కూరలే ఆలస్యం' అన్నారు. అవధాన్లగారి భార్య, కోమతి సూరమ్మ తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచక కూరలు తరిగేశారు. పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు అన్నం తయారయిపోయాయి.

సెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించకుని తనూ ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకోపక్క గొల్లరాముడున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డనలయిపోయాయి. శాస్త్రిగారు అవుపోసన పట్టి, నెయ్యికోసం చెయ్యి జాస్తే వడ్డించడానికి వచ్చిన నేతి జాడీ చెంగున వెనక్కు వెళ్లింది. వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టంలేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు 'ఒరే సంగా' అని పెద్దగా కేకపెట్తే, భయం భయంగా వచ్చిన సంగణ్ణి చూసి 'ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది. నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యికాకపోదురా... వెయ్యరా' అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. 'నమ: పార్వతీ పతయే' అన్న కేకలు దేవాలయ శిఖరాల్నంటాయి.

వరదొచ్చి మనుషులు మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే!  నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేటప్పటికీ మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది.

('అమరావతి కథలు' సంపుటి నుంచి..)

సంకలనం: పెనుగొండ

- సత్యం శంకరమంచి

సత్యం శంకరమంచి

'అమరావతి కథలు తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండజ్యోతి. పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివితీరని అమృతకలశం. అక్షయమైన అక్షయపాత్ర. శిల్ప సౌందర్యానికి పరమావధి. ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగరేయగల పతాకం.' శంకరమంచి సత్యం రాసిన అమరావతి కథల గురించి ఈ మంచిమాటలు అన్నది ముళ్ళపూడి వెంకటరమణ.

అమరావతి తీర ప్రాంత జీవితం, ఆ జీవితాన్ని గురించి అవగాహనను విస్తృతపరిచే 'అమరావతి కథలు' ద్వారా  ప్రసిద్ధి చెందిన సత్యం తాను జన్మించిన అమరావతి రుణం ఈ కథలు రాసి మనకందించడం ద్వారా తీర్చుకున్నారు. మార్చి 3, 1937న జన్మించిన వీరు ఏలూరు సర్‌ సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌.ఎల్‌.బి. చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమరావతి కథలకు 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ అందుకున్నారు. శ్యామ్‌ బెనగల్‌ దర్శకత్వంలో అమరావతి కథలు కొన్ని దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.

అమరావతి కథలు, కార్తీక దీపాలు (కథా సంపుటాలు), రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారి కలువపూలు (నవలలు), హరహర మహాదేవ (నాటకం), ఇంతే సంగతులు, తథ్యము సుమతీ, ఎందరో మహానుభావులు (శీర్షికలు) వీరి ఇతర రచనలు. షేక్‌ జాన్సన్‌ శాస్త్రి, శారదానాథ్‌, సాయిరాం కలం పేర్లతో కూడా రచనలు చేసిన సత్యం ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. 1987లో కనుమూశారు.

వార్తావాహిని