యూనిట్
Flash News
ఆమె చివరి మాటలు

‘’Memo Moriturus Praesmitur mentri” అనే లాటిన్ సూక్తికి
అర్థం 'మానవుడు తన నోటిలో
అబద్ధాన్నుంచుకొని తన సృష్టికర్త దగ్గరకు వెళ్ళడు' అని.
'ఒక
వ్యక్తి తన మరణానికి ముందు చెప్పే మాటలు నిజమే అయి వుంటాయి. లేదా వ్యక్తి
చనిపోయేముందు అబద్ధం చెప్పడు' అనే
నమ్మకం ప్రపంచవ్యాప్తంగా అన్ని మత విశ్వాసాల్లోనూ వుంది. ఈ నమ్మకంపై ఆధారపడే మరణ
వాగ్మూలం (Dying
Declaration) అనే భావనని న్యాయశాస్త్రగ్రంథాల్లో చాలా దేశాలు
చేర్చుకున్నాయి. మరణ వాంగ్మూలాన్ని లాటిన్లో Letem Mortem అంటారు.
భారత సాక్ష్యాధార చట్టం (IEA) సెక్షన్ 32
(1)లో మరణ వాంగ్మూలాన్ని (D.D) ఒక ముఖ్యమైన
సాక్ష్యాధారం (
Substantial evidence)గా కోర్టులు పరిగణిస్తాయి. చాలా కేసుల్లో 'మరణ వాంగ్మూలమే' ప్రధాన సాక్ష్యంగా
నిర్ణయించుకుని (Conclusive
Proof) దోషులను శిక్షించడం జరిగింది.
కానీ, ఆధునిక
సమాజంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పెరిగిన మానవునిపై 'మత విశ్వాసాల ప్రభావం' ఎంత? కేవలం 'మరణించబోతున్న వ్యక్తి నిజమే
చెప్తాడన్న' భావనపై
తీర్పులు చెప్పే పరిస్థితులు నేడు వున్నాయా? భారతీయ న్యాయస్థానాలు మరణ
వాంగ్మూలాన్ని ప్రధాన సాక్ష్యంగా ఏయే సందర్భాల్లో అంగీకరిస్తాయి? ఏయే
సందర్భాల్లో తిరస్కరిస్తాయి? భారతీయ సాక్ష్యాధార
చట్టంలో (IEA) మరణ వాంగ్మూలానికి ఉన్న విలువెంత? ఒక విశ్లేషణ
1981 సంవత్సరం జులై 24, సాయంత్రం 5 గం.లు. మధ్యప్రదేశ్లోని ఒక గ్రామం.
మణిరాం తన భార్య రాధాభాయి మీద ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.... 'పట్టుమని పదహారేళ్ళు లేవు దీనికి.
ఎంత పొగరు? నన్నే
నిలదీస్తుందా?' అని'' అనుకున్నాడు.
ఇంతకీ భార్య చేసిన తప్పల్లా మాటకి మాట సమాధానం చెప్పడమే. చిన్న వయసు లోనే పెళ్ళి, పైగా
పుట్టింట్లో గారాబం వల్ల ఆమెకి ఇంకా పసితనం ఛాయలు పోలేదు.
కాసేపటికి ఒక నిర్ణయానికి
వచ్చినట్టుగా మణిరాం తల్లిని పిలిచాడు.
'పిన్ని
నీతో ఏదా మట్లాడాలి రమ్మంది' అని
చెప్పాడు. మణిరాం తల్లికి చెల్లి వరసయ్యే శాంత అదే వీధిలో రెండిళ్ళ అవతల ఉంటుంది.
మణిరాం అలా చెప్పడంతో ఆమె చెల్లెలి ఇంటికి వెళ్ళింది.
మణిరాం మెల్లగా
వంటగదిలోకి వెళ్ళాడు. భార్య కూరగాయలు తరుగుతోంది. మెల్లగా కిరసనాయిలు డబ్బా
అందుకున్నాడు. మూత తీసి కూర్చున్న ఆమె తలమీద నుండి కుమ్మరించాడు. ఏం జరుగుతుందో
ఆమె గ్రహించే లోపలే అగ్గిపుల్లగీసి ఆమె మీద విసిరేసి పారిపోయాడు.
చెల్లెలు తనని పిలవలేదు
అని చెప్పడంతో అనుమానం వచ్చిన మణిరాం తల్లి ఆందోళనగా ఇంటికి పరుగు తీసింది.
అప్పటికే కాలిపోతూ కోడలు చేస్తున్న హాహాకారాలకు ఇరుగు పొరుగు వచ్చేసారు. అందరూ
కలిసి నీళ్లు చల్లారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు.
డ్యూటీ డాక్టర్కి అది
మెడికో లీగల్ కేస్ అని చూసిన వెంటనే అర్థమైంది. పోలీసులకు సమాచారమిచ్చి చికిత్స
ప్రారంభించాడు. అప్పటికే అర్థరాత్రి సమీపిస్తున్నందున మరునాడు ఉదయమే పోలీసులు ఆసుపత్రికి
వెళ్లారు.
బాధితురాలు పూర్తి
తెలివిలో వుండి, ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడుతున్నందున
ఎస్సై జరిగిన విషయాన్ని ఆమె నోటి ద్వారానే విని స్టేట్మెంట్ రాసుకున్నాడు.
వెంటనే (FIR) రిజిష్టర్ చేసి ఆ
స్టేషన్ పరిధిలో వున్న తాహసిల్దార్కి విషయం తెలిపి పిలిపించాడు.
ఉదయం 7.15 ని.లకు తాహసిల్దారు వచ్చాడు. ఆమె మరణ
వాంగ్మూలాన్ని రికార్డ్ చేసాడు. అంతేకాక ఆమె పూర్తి తెలివిలో వుండి
మాట్లాడుతుందని కూడా సర్టిఫై చేసాడు. ఎస్సై కూడా సాక్షి సంతకం చేసాడు.
దురదృష్టవశాత్తూ తర్వాత కొన్ని గంటల్లోనే రాధాబాయి మరణించింది.
పోస్ట్మార్టం రిపోర్టులో
కూడా కాలినగాయాలే ఆమె మరణానికి కారణం అని వచ్చింది. ఎస్సై వెంటనే ఆమె భర్తను ఐపిసి, సెక్షన్ 302 ప్రకారం 'హత్యానేరం' ఆరోపిస్తూ, అరెస్టు
చేసి రిమాండ్కి పంపాడు. తర్వాత సాక్షులు పది మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి, ఇతర
ఆధారాలతో ఛార్జ్షీట్ వేసాడు.
ఊహించినట్టుగానే పది మంది
సాక్షుల్లో ముఖ్యమైన సాక్షులు సెషన్స్ కోర్ట్ విచారణ సమయంలో తిరగబడిపోయారు. ఉన్న
మిగిలిన సాక్షుల సాక్ష్యం కూడా ప్రాసిక్యూషన్కు పెద్దగా ఉపయోగపడదు (Not relevant).
ఇంక జడ్జిల ముందు
మిగిలింది ఒకే ఒక సాక్ష్యం. అది మరణ వాంగ్మూలం (డిడి). ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
సెక్షన్ 32 (ఎ) ప్రకారం డిడి అనేది ఒక
దృఢమైన సాక్ష్యాధారం (Substantial ) అది నేరాన్ని
నిర్ధారించడానికి సరిపడా సాక్ష్యాధారం (Support a conclusion) కనుక ప్రాసిక్యూషన్ ఆశలన్నీ
మరణ వాంగ్మూలంపైననే ఉన్నాయి.
జడ్జి తన ముందు ఉన్న
రెండు డిడిలను లోతుగా పరిశీలించాడు. అందులో ఒకటి ఎస్సై రికార్డ్ చేసింది కాగా, రెండవది
తాహసిల్దార్ చేసింది.
ముందుగా ఎస్సై చేసిన
డిడిని జడ్జి పరిశీలించాడు. అది బాధితురాలి స్టేట్మెంట్. దాన్ని కంప్లైంట్గా
తీసుకొని ఎఫ్ఐఆర్ (FIR) రిజిస్టర్ చేసాడు కనుక
దాన్ని (మరణ వాంగ్మూలాన్ని) ఎఫ్ఐఆర్గా భావించవచ్చు. ఆ కంప్లైంట్ (డిడి) క్రింద
భాదితురాలి సంతకం కాని వేలి ముద్ర కానీ లేదు. దాని క్రింద డ్యూటీ డాక్టర్
సర్టిఫికెట్ కూడా లేదు. బాధితురాలు పూర్తి తెలివిలో ఉండి (Coherent), ఆరోగ్య స్థితి నిలకడగా
ఉన్నదని డ్యూటీ డాక్టరు ఆ మరణవాంగ్మూలం క్రింద సర్టిఫై చేయాల్సిఉంటుంది. ఎఫ్ఐఆర్
బలమైన సాక్ష్యాధారం కాదు.
భారత క్రిమినల్
ప్రొసీజర్ కోడ్ (Cr.P.C) సెక్షన్ 157 ప్రకారం పోలీసులు
రికార్డ్డ్ చేసే ఈ మూడు రకాల స్టేట్మెంట్స్ బలమైన సాక్ష్యాధారాలు కాదు. 1. ఎఫ్ఐర్, 2. సాక్షుల
విచారణ తెలిపే స్టేట్మెంట్స్ 3. ఏ ఇతర స్టేట్మెంట్స్
(ఉదాహరణకు నేరాంగీకారం (Confessions) ఈ మూడు రకాల స్టేట్మెంట్స్ను తిరిగి కోర్టులో విచారణ (Trial) సందర్భంలో ప్రమాణం (Oath) చేసి తిరిగి అదే విషయాన్ని చెప్పినప్పుడు, క్రాస్ ఎక్జామిన్
చేయబడినప్పుడు, (ఇండియన్ ఎవిడన్స్ యాక్ట్ సెక్షన్ 157 ప్రకారం)
మాత్రమే బలపరచ (Corrabarate) బడతాయి.
అందువలన ఈ కేస్లో ఎస్సై
రికార్డ్ చేసిన డిడిని బలహీన సాక్ష్యంగా భావించి నేరాన్ని నిరూపించదగ్గ
సాక్ష్యంగా అంగీకరించలేము.
ఇకపోతే తహసిల్దార్
రికార్డ్ చేసిన డిడిలో కూడా అవే తప్పిదాలు పునరావృతం అయ్యాయి. పేషంట్ సంతకం కానీ, వేలుముద్ర
కానీ లేవు.
'అలాగే
డాక్టర్ సర్టిఫికెట్ అవసరమని నాకు అప్పుడు అనిపించ లేదు', అని తహసిల్దార్ క్రాస్
ఎగ్జామినేషన్లో ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు. కనుక మృతురాలు ఇచ్చిన డిడి
సందేహాలకు తావు ఇస్తున్నందున 'సందేహ లబ్ధి' (Benefit of doubt) ముద్దాయి అయిన మణిరాంకు చెందుతుంది
అని పేర్కొంటూ ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేసింది.
తీర్పును హైకోర్టులో
సవాల్ చేయగా, హైకోర్టు తీర్పు సెషన్స్
కోర్టుకు పూర్తి భిన్నంగా వుంది. హైకోర్టు తన తీర్పులో 'ఈ కేసులో తాహసిల్దారు రికార్డు
చేసిన మరణవాంగ్మూలంను తీసిపారేయలేము. ఎందుకంటే తాహసిల్దార్ పూర్తిగా ఇండిపెండెంట్
విట్నెస్ (ముద్దాయి లేదా మృతురాలితో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేని వ్యక్తి)
అతనే పేషెంట్ స్థితి పై సంతృప్తి వ్యక్తం చేస్తూ స్వయంగా సర్టిఫై చేసాడు
కూడా. దీనిపై ఏ అనుమానమూలేదు. కాబట్టి ఈ సాక్ష్యం నేరాన్ని నిరూపించడానికి
సరిపోతుంది (Conclusive Proof) అందువల్ల ముద్దాయికి ఐపిసి, సెక్షన్ 302 ప్రకారం
జీవిత ఖైదు విధించడం జరిగింది' అని పేర్కొంది. తర్వాత
కేస్ సుప్రీంకోర్టు కొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మరోలా ఉంది. 'ఒక బాధిత వ్యక్తి నుండి ఒక స్టేట్మెంట్ను
రికార్డ్ చేస్తున్నప్పుడు, ఆ
బాధ్యతను తీసుకున్న అధికారి ఎంత శ్రద్దగా ఆ బాధ్యత నిర్వర్తించాలి? అందునా
మరణ వాంగ్మూలం లాంటి అత్యంత విలువైన సాక్ష్యాధారాన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు?
ఏ విధమైన అనుమానానికి
తావులేకుండా, పూర్తిగా నమ్మదగ్గదిగా ఆ
మరణ వాంగ్మూలం వుండేలా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ఆ అధికారిదే. ఈ కేసులో ఇతర బలమైన
ఏ సాక్ష్యాధారాలు లేవు. ఉన్న మరణ వాంగ్మూలం కూడా నమ్మదగిన పద్ధతిలో లేదు.
ఎస్సైకానీ తాహసీల్దారుకానీ డి.డి.రికార్డు చేసేముందు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు
కూడా తీసుకోలేదు. పోనీ డిడిని డాక్టర్ సమక్షంలో రికార్డ్ చేయకపోవటానికిచ్చిన
వివరణ కూడా సంతృప్తికరంగా లేదు. కాబట్టి 'సందేహ లబ్ధి' (Benefit of doubt) ముద్దాయికే
చెందుతుంది కనుక ముద్దాయిని నిర్దోషి అని పేర్కొంటూ కేసు కొట్టివేసింది.
ఈకేసులో గమనించాల్సిన
ముఖ్య విషయం ఏంటంటే డిఫెన్స్ లాయర్ వాదన రాధాబాయి డిడి రికార్డ్ చేయకముందే
మరణించిందనీ, అందుకే డాక్టర్ సర్టిఫై
చేయలేదనీ, చివరికి తహసీల్దారు
రికార్డు చేసిన డిడి
కూడా ఎస్సై చేసిందేనని, తహసీల్దార్ కేవలం
అటెస్టేషన్ చేశాడని చేసిన వాదనతో న్యాయమూర్తికి డిడి యొక్క విశ్వసనీయతపై సందేహం
కలిగింది.
ఈ కేసుపై వివిధ కోర్టులు
ఇచ్చిన భిన్న తీర్పుల వలన అసలు మరణ వాంగ్మూలం యొక్క సాక్ష్యపు విలువ ఎంత? అని
అనుమానం రాక మానదు.
మరణ వాంగ్మూలం యొక్క
సాక్ష్యపు విలువ - దానిలోని రకాలు - కొన్ని మినహాయింపులు:
శ్రీమతి జి. స్వరూప రాణి