యూనిట్

చిత్రంతో ఘోరాన్ని తెలిపిన బాలిక

ఆ పాప తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. మద్యానికి బానిసైన తన తండ్రి చేతిలో నిరాదరణకు గురైంది. ఆమె మేనమామ పునరావాసం పేరుతో ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలికపై లైంగిక దాడి మొదలుపెట్టాడు. సంఘం

దష్టిలో తన సంరక్షుడిగా చెలామణి అవుతున్న వ్యక్తే ఆమెపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏమీ తెలియని వయసులో, ఎందుకిలా చేస్తున్నాడో అర్థంకానీ పసిప్రాయంలోనే ఆమె ఒళ్లు హూనమైంది. మరోవైపు ఆ బాలిక అత్త ఆమెకు వయసుకు మించిన పని భారం కల్పించి హింసించింది. ఈ వేదనలన్నింటికీ తాళలేక ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆ పాప ఇల్లొదిలి పారిపోయింది. చిన్న పిల్లల పునరావాస కేంద్రం ఆమెను అక్కున చేర్చుకుంది.

ఎప్పుడూ దిగాలుగా, భయం భయంగా ఉంటూ.. పెద్దవాళ్లను చూస్తే వణికిపోతున్న ఆ బాలిక

హదయంపై ఎవరో మానని గాయం చేశారని అక్కడి నిర్వాహకులకు అనుమానం వచ్చింది. ఆ బాలికను ప్రేమగా దగ్గర తీసుకొని విషయం ఆరా తీస్తే.. జరిగిన దారుణం తెలిసింది. దీంతో వాళ్లు ఓ లాయర్‌ సాయంతో కోర్టును ఆశ్రయించారు.

2016 జూన్‌ 4న పోలీసులు.. నిందితుడు అక్తర్‌ అహ్మద్ను అరెస్టు చేసి కోర్టు బోనెక్కించారు. కానీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అతడు బుకాయించాడు. నిందితుడి తరఫు లాయర్‌ కూడా అక్తర్‌ దారుణం చేశాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని గట్టిగానే వాదించాడు. కేసు ఓడిపోబోతున్నాం.. పసిప్రాయాన్ని చిదిమేసిన దుర్మార్గుడు చట్టం నుంచి తప్పించుకోబోతున్నాడని బాలికను ఆదరించినవాళ్లు బాధ పడుతున్న తరుణంలో.. సెషన్స్‌ జడ్డి వినోద్‌ యాదవ్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

ఆ బాలిక చేతికి పేపర్‌, పెన్సిళ్లు అందజేసి.. రెండేళ్ల కిందట తనకు ఏం జరిగిందో బొమ్మ రూపంలో తెలపమని కోరారు. వాటిని అందుకున్న ఆ బాలిక తన మేధస్సుకు పని చెప్పింది. కొంత సేపు కుస్తీపడ్డ తర్వాత ఓ బొమ్మ వేసి కోర్టువారి చేతిలో పెట్టింది. దాన్ని చూసిన న్యాయమూర్తి చలించిపోయారు. తన గుండెలో గూడు కట్టుకున్న ఆవేదనను నోటితో చెప్పుకోలేని ఆ బాలిక చిత్రం ద్వారా తన మానసిక సంఘర్షణను వెలిబుచ్చింది.

విషయం గ్రహించిన న్యాయమూర్తి నిందితుడికి అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అంతే కాకుండా ఆ బాలిక సంరక్షణార్థం తక్షణమే రూ. 3 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. 'ఇక చాలు. తెలిసీ తెలియని వయసులో ఓ బాలిక తన శరీరానికి అయిన గాయం గురించి ఇంతకంటే గొప్పగా చెప్పలేదు. నిందితుడు తప్పు చేశాడనటానికి ఇంతకంటే బలమైన ఆధారం మరొకటి ఉండదు' అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

తీర్పు వెలువడిన తర్వాత.. బాలిక తరఫు న్యాయవాది, బాలల హక్కుల కార్యకర్త చంద్ర సుమన్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 'న్యాయ యుద్ధం ముగిసింది. చివరికి న్యాయమే గెలిచింది. బాలికకు అందనున్న నష్ట పరిహారం ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. ఇప్పటికే చదువులో అద్భుతంగా రాణిస్తున్న ఆమెకు అది ఎంతగానో తోడ్పడుతుంది' అని ఆయన చెప్పారు.

అందరి మనసులనూ కదిలింపజేసిన ఈ ఘట్టానికి ఢిల్లీ సెషన్సు కోర్టు వేదికైంది. ఆ పదేళ్ల పాప తాను వేసిన చిత్రంలో.. ఒక ఇళ్లు, అందులో ఒక గది, పక్కన రెండు బెలూన్లను పట్టుకొని నిల్చున్న చిన్న పాప, మరో పక్కన విసిరేసిన ఆమె డ్రెస్సును గీసింది.

వార్తావాహిని