యూనిట్
Flash News
బాలల సంరక్షణ చట్టాలు

పిల్లలకు ప్రయోజనం కలిగించే
బాలల హక్కుల రక్షణ చట్టం, 2005, బాలల
ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009, లైంగిక నేరాలనుంచి రక్షణ కల్పించే చట్టం, 2012, బాలల న్యాయ (సంరక్షణ, రక్షణ) చట్టం, 2000 వంటి
చట్టాలు చాలా ఉన్నాయి. వీటిని సక్రమంగా అమలుజరపడానికి తద్వారా బాలల హక్కులు, వారి సంక్షేమాన్ని కాపాడడమే గాక, మరింత ఎక్కువగా అమలుచేయడానికి మునుపెన్నడూలేని
విధంగా సుప్రీంకోర్టు మే 4న
మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు తీర్పువెలువరించిన ధర్మాసనంలో న్యాయమూర్తులుగా
జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్
దీపక్గుప్తా ఉన్నారు.
ఈ తీర్పులో సిబ్బంది శిక్షణ, పునరావాసం, సామాజిక
జీవనంలో వీరిని తిరిగి భాగం చేయడం, గ్రాంట్లవినియోగం, సంరక్షణకు పాటించే కనీస ప్రమాణాలవంటి చాలా
అంశాలను స్పృశించారు.
''అన్నింటికంటే
ముందుగా బాల న్యాయచట్టంలోని సెక్షన్2(14) కింద
పేర్కొనే సంరక్షణ, రక్షణ
అవసరమైన బాలలు'' అనే పదబంధ నిర్వచనం
దృష్టాంతంగా, సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లలకు ఉద్దేశించిన
ప్రయోజనాలను ప్రభుత్వ సంరక్షణ, రక్షణ
కోరే పిల్లలందరికీ విస్తరింప చేయాలి''
''బాలనేరస్థుల
చట్టం పిల్లల ప్రయోజనాలకు ఉద్దేశించినది, వారి
హక్కులను రక్షించడానికి, మెరుగుపరచడానికి
ఉద్దేశించినది అయినందున ఆ నిర్వచనానికి మరింత విస్తృతార్థం కల్పించాల్సిన
అవసరముందని మేం భావిస్తున్నాం''
-అని
న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ నిర్వచనం పరిధిలోకి నిర్దిష్టంగా చేర్చిన
పిల్లలతో సమానంగా మరింత సంరక్షణ, రక్షణ
అవసరమైన పిల్లలను చేర్చకపోవడం దురదృష్టకరం. బాలలకు ప్రయోజనం కలిగించగలవని భావిస్తూ
ఇక్కడ మనం ప్రస్తావించు కుంటున్న చట్టాలను
న్యాయస్థానాలు కానీ,సంబంధిత వ్యక్తులు కానీ మరింత విస్తారమైన
దృష్టితో చూడాల్సిన అవసరముంది.''
'అనాథాశ్రమాలు, ఇతరత్రా ప్రదేశాల్లో బాలలపై వేధింపులు, దుర్వినియోగం' అనే
శీర్షికన 'హిందూస్థాన్' అనే హిందీ పత్రికలో సెప్టెంబర్, 2007లో ఒక
వార్తాకథనం ప్రచురితమయింది. దీనిని జతచేస్తూ శ్రీ ఎ.ఎస్. చౌథురి అనే పౌరుడు పంపిన
ఒక లేఖను కోర్టు స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. తమిళనాడులోని మహాబలిపురంలో
స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వసంస్థలు
నడిపే అనాథ శరణాలయాల్లో బాలల లైంగిక దుర్వినియోగం తీరుతెన్నులను ఈ కథనం బహిర్గతం చేసింది.
విదేశీ, స్వదేశీ పర్యాటకులకు ఇక్కడి పిల్లలతో లైంగిక
సేవలు అందిస్తున్నట్లు, వారికి
ముట్టచెప్పే సొమ్ము తాలూకు రేట్లు టెలిఫోన్లద్వారా కానీ, అనాథ శరణాలయాల్లో మీటింగ్లద్వారా కానీ
నిర్ణయిస్తున్నట్లు తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైందని వ్యాసరచయిత
పేర్కొన్నారు. బాలల లైంగిక దుర్వినియోగం మరీ ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ఆందోళనకర
స్థాయికి చేరిందని, దీనిని
తక్షణం పరిష్కరించాల్సిన అవసరముందని ఈ వ్యాసం హెచ్చరించింది. న్యాయస్థానం దీనిని
విచారణకు చేపట్టిన తరువాత ఇన్ని సంవత్సరాలుగా చాలా
ఆదేశాలుజారీ చేసింది. సార్వజనీనంగా పిల్లలకు లభించే హక్కులతో ప్రజా ప్రయోజన పిటీషన్
(పిల్) పరిధిని విస్తరింపచేయాలని కోరింది. అమికస్ క్యూరీగా అపర్ణాభట్ అనే
న్యాయవాదిని కూడా నియమించింది. 'ఎన్ని ఆదేశాలు ఇచ్చినా బాలల హక్కుల
రక్షణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వాల వైపునుండి ఎటువంటి పురోగతి ఉండడం లేదు. ఉన్నా అది నామమాత్రంగానే ఉంది' అని పేర్కొంటూ, న్యాయస్థానం
డిసెంబర్, 2013న సవివరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో
వాస్తవంగా తీసుకున్న చర్యలకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారం ఏమిటో ప్రతి రాష్ట్ర
ప్రభుత్వం, కేంద్రపాలిత
ప్రాంతం నిర్దిష్టంగా తెలపాలని కోరింది.
దీనికి వాటి ప్రతిస్పందనలను
చూసిన కోర్టు ఇలా వ్యాఖ్యానించింది-'ఈ అంశాన్ని కోర్టు చేపట్టి
దాదాపు దశాబ్దం - అంటే పదేళ్ళవుతున్నది.అయినా పరిస్థితిలో చెప్పుకోదగ్గ
మార్పులేదు. ఈ ప్రతిస్పందనలు చాలా నిరుత్సాహం కలిగిస్తున్నాయి. ఒకవేళ ఏదయినా
సానుకూలంగా ఎక్కడైనా ఏదయినా ఉందంటే అది నామమాత్రంగానే ఉంది. దురదృష్టవశాత్తూ కొన్ని
రాష్ట్రాలు, కేంద్రపాలిత
ప్రాంత ప్రభుత్వాలకు పిల్లల విషయంలో వారిని సమస్యల
వలయంనుంచి తప్పించాలన్న సానుకూల దృక్పథం అంతగా ఉన్నట్లు
లేదు.''
సంరక్షణ, రక్షణ అవసరమయిన పిల్లల సంక్షేమం, హక్కుల వరకు ఈ పిటీషన్ పరిధిని పరిమితంచేయాలని
కోర్టు నిర్ణయించింది.
న్యాయస్థానం జారీచేసిన
మార్గదర్శకాలు:
1. ''బాల న్యాయ
చట్టంలోని సెక్షన్ 2(14) కింద పేర్కొనే సంరక్షణ, రక్షణ అవసరమైన బాలలు'' అనే పదబంధ నిర్వచనం దృష్టాంతంగా, సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లలకు ఉద్దేశించిన
ప్రయోజనాలను ప్రభుత్వ సంరక్షణ, రక్షణ
కోరే పిల్లలందరికీ విస్తరింప చేయాలి''
2. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ బాలల సంరక్షణ, రక్షణకు ఉద్దేశించిన
అన్ని సంస్థలను
డిసెంబర్ 31, 2017లో రిజిస్ట్రేషన్
చేసేయాలి. అలాగే తమ వద్ద ఉన్న సమాచారం
సరైనదోకాదో నిర్ధరించుకోవాలి. ఈ సమాచారం సంబంధిత అధికారులందరివద్ద ఉండాలి. రక్షణ, సంరక్షణ అవసరమయిన బాలలందరి సమాచార సేకరణ
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండేలా
చూసుకోవాలి. ప్రతినెలా
మార్పుచేర్పులతో సమాచారాన్ని తాజాగా
ఉంచుకోవాలి. సమాచార సేకరణ,నిర్వహణల్లో గోప్యత, ఆంతరంగికత వంటి అంశాలపట్ల సంబంధిత అధికారులు
సదా అప్రమత్తతతో వ్యవహరించాలి.
3. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ బాలల రక్షణ, సంరక్షణకు సంబంధించి బాల న్యాయచట్టం, నమూనా నిబంధనలు నిర్దేశించిన కనీస ప్రమాణాలు
డిసెంబర్ 31, 2017లోగా అమలయ్యేలా చూడాలి.
4. సమగ్ర శిశు సంక్షేమ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను
(వ్యయ ప్రణాళికతో) పూర్తిగా, సక్రమంగా
అమలుపరచడానికి తగిన ప్రణాళికలను రాష్ట్ర
ప్రభుత్వాలు, కేంద్రపాలిత
ప్రాంతాలు రూపొందించాలి. ఖర్చుపెట్టని గ్రాంట్లను తిప్పిపంపడంవల్ల అనవసరపు ఆయాసం, ఖర్చులు తప్ప ఎవ్వరికీ ఒరిగేదేమీ ఉండదు.
5. సంరక్షణ, రక్షణ
అవసరమైన పిల్లల పునరావాసం, తిరిగి
సామాజిక జీవనంలో వారిని భాగం చేయడం వంటి అంశాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ దృష్టి
కేంద్రీకరించడం అవశ్యం, అనివార్యం.
ఇటువంటి సందర్భాల్లో నైపుణ్యాభివృద్ధి, వృత్తి పనులలో శిక్షణవంటి
పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలి.
6. బాలనేరస్థుల న్యాయచట్టం, నమూనానిబంధనలలో పేర్కొన్న విధంగా తనిఖీ బృందాలు ఏర్పాటుచేయాలి. సంరక్షణ, రక్షణ కేంద్రాలలో పిల్లల జీవనస్థితిగతులు
సానుకూలంగా మారేటట్లు ఈ బృందాలు క్రమం తప్పకుండా
తనిఖీలునిర్వహించి నివేదికలుసమర్పించాలి. జులై 31, 2017లోగా ఈ బృందాలను
నియమించాలి. కొత్తగా ఏర్పాటయ్యే బృందాలు తనిఖీలు నిర్వహించి 31 డిసెంబర్, 2017లోగా
తొలి తనిఖీ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత
ప్రాంతాలకు సమర్పించాలి.
7. సంరక్షణ కేంద్రాల్లో ఉండే పిల్లల్లో ప్రతి
ఒక్కరికీ సంబంధించి వ్యక్తిగత సంరక్షణ ప్రణాళిక తయారు చేయడం చాలా ముఖ్యం. ఇది కొంత
కష్టంతో కూడుకున్నప్పటికీ,సమయం కూడా ఎక్కువ
తీసుకున్నప్పటికీ, ఎటువంటి
పరిస్థితుల్లోకూడా దాని అవసరాన్ని తక్కువగా అంచనా వేయరాదు. దీన్ని వెంటనే
ప్రారంభించి 31 డిసెంబర్, 2017 నాటికల్లా ప్రతి సంరక్షణ కేంద్రంలోని పిల్లల్లో
ప్రతి ఒక్కరికీ సంబంధించిన నివేదిక తయారయ్యేట్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి.
8. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పాటుకానిచోట్ల లేదా ఏర్పాటయినా ఛైర్పర్శన్, సభ్యులపదవులు భర్తీకాకుండా ఉన్నచోట 31 డిసెంబర్, 2017లోగా ఆ
పనులు పూర్తి చేసేయాలి. అలా ఏర్పాటయిన లేదా పునరుద్ధరింపబడిన కమిషన్లు వార్షిక
నివేదికలు ప్రచురించాలి. బాలల రక్షణ, సంరక్షణకు
వ్యక్తిగతంగా, ఉమ్మడిగా ఎవరు ఏమి చేయవచ్చనే విషయం అవి చూసి
ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతారు.
9. బాలల న్యాయచట్టం,నమూనా నిబంధనల్లో పేర్కొన్నట్లు
సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అవసరం. ఈ పని చేసిపెట్టడానికి చాలా అకాడమీలున్నాయి.
రాష్ట్రాల్లో పోలీసు అకాడమీలు, జ్యుడీషియల్
అకాడమీలు దీనికి తోడ్పడగలవు. ఇవిగాక జాతీయస్థాయి పోలీసు పరిశోధనా కేంద్రం, జాతీయ జ్యుడీషియల్ అకాడమీ లేదా స్థిరంగా
నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల సహాయంతో శిక్షణ ప్రక్రియను రూపొందించవచ్చు.
వీలయినచోట్ల వీలయినంత త్వరగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలి.
10. బాలల రక్షణ, సంరక్షణ
చూడడానికి ప్రత్యేక కేంద్రాలుండడం మంచిదే అయినా, వీటికి
ప్రత్యామ్నాయ పద్ధతులను కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవస రముంది. రక్షణ, సంరక్షణకు పిల్లలను ఈ కేంద్రాల్లోనే ఉంచాల్సిన
అవసరం లేదు. దత్తత, పెంపకం
వంటి పలు ప్రత్యామ్నాయాలను కూడా సంబంధిత అధికారులు అన్వేషించాలి.
11. సామాజిక తనిఖీలు కూడా అవసరం. కాగ్వంటి సంస్థలు
కూడా వీటి ప్రాముఖ్యతలను నొక్కి చెప్పాయి. బాలల హక్కుల రక్షణకు సంబంధించిన, రాష్ట్రస్థాయి, జాతీయ
స్థాయి కమీషన్ లు వీటిని నిర్వ హించాలి. బాలల సంరక్షణ కేంద్రాల నిర్వహణ, పనితీరులలోని వాటి పారదర్శకతలు, బాధ్యతలను అంచనా వేయడానికి ఇదే అత్యుత్తమ మార్గం.
12. బాలల న్యాయచట్టం,నమూనా నిబంధనల అమలు
పర్యవేక్షించడంలో హైకోర్టులోని జువెనైల్ జస్టిస్ కమిటీలు వాటి పాత్ర అవి
పోషిస్తున్నాయి. ఈ బాధ్యతల నిర్వహణలో వీరికి సాయపడడానికి చిన్న సెక్రటేరియెట్లాంటి
ఒక యంత్రాంగం అవసరమవుతుంది. ఈ ఏర్పాటు ఆలోచనను ఈ కమిటీలు సునిశితంగా పరిశీలించాలి.
ఈ విషయంలో కమిటీలకు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తున్నాం.
13. ఈ మార్గదర్శకాల అమలునిమిత్తం కేంద్ర ప్రభుత్వం
సంబంధిత మంత్రిత్వశాఖకు లేదా రాష్ట్రప్రభుత్వాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు
పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. దీనికి సంబంధించిన పనుల
ప్రగతి నివేదికను జనవరి 15, 2018లోగా
ఇదేన్యాయస్థానంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత దీనిపై విచారణ కొనసాగుతుంది.