యూనిట్

రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా 'ఆపరేషన్‌ ముస్కాన్‌'

రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు 'యాక్షన్‌ ప్లాన్‌'ను తయారుచేసి ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 'ఆపరేషన్‌ ముస్కాన్‌' చేపట్టాలని రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ సంకల్పించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 6న రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్‌.పి.లు, డివిజన్‌ స్థాయి, పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోలీసు అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ టీమ్‌లో పోలీసులతో పాటు చైల్డ్‌లైన్‌, సిడబ్ల్యూసి, డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ డిపార్టుమెంట్ల సమన్వయంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 693 టీమ్‌లు పాల్గొన్నట్లు రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, సినిమా హాల్స్‌, పార్కుల్లో దాడులు నిర్వహించారు. వీటిలో ఎంతో మంది ఆదరణ కోల్పోయిన బాలలు, బాలికలను పోలీసులు గమనించి, చేరదీశారు. కొందరు భూస్వాములు, హోటళ్లలో బాలకార్మికులుగా మగ్గుతున్న చిన్నారులకు విముక్తి కల్పించారు. ఆదరణ కోల్పోయి నిరాశ్రయులుగా రైల్వేస్టేషన్లు, పుట్‌పాత్‌లపై కాలం వెళ్ళదీస్తున్న బాలలను గుర్తించారు. వీరిని అందరిని ఓ చోటకు చేర్చి వారి పూర్తి వివరాలు, తల్లిదండ్రుల సమాచారం తెలుసుకున్నారు. తల్లిదండ్రులను పిలిపించి పిల్లలను వదిలిన వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అంతేకాదు వారి బాగోగులను చూసుకునేలా నిరంతరం నిఘా ఉంచుతామని వారికి సూచనప్రాయంగా హెచ్చరికలు జారీ చేశారు. చిరునామాలు లేని చిన్నారులను సిడబ్ల్యూసీ అధికారులకు అప్పజెప్పి వారి బాగోగులను చూసుకునేలా బాలల ఆశ్రయాలకు అప్పజెప్పారు. వారిని ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన బాలల వివరాలను రాష్ట్ర డిజిపి వివరించారు. బాలలు 1192 మంది, బాలికలు 179 మంది, మొత్తం 1371 మందిని గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 286 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని వారి చెంతకు చేర్చినట్లు చెప్పారు. వీరిలో 125 మంది చిన్నారులను చైల్డ్‌హోమ్‌కేర్‌కు తరలించినట్లు వివరించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు బాలురు 1123 మంది, బాలికలు 178 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలురు 69 మంది, బాలికల్లో ఒకరుగా గుర్తించామని డిజిపిగారు తెలిపారు. ఏకకాలంలో పోలీసులు చేసిన కృషివల్ల ఎంతో మంది భావిభారత పౌరులను గుర్తించిన వారయ్యారని అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల ఎస్‌.పి.లు, డివిజన్‌ స్థాయి అధికారులు, పోలీస్‌ టీమ్‌తో పనిచేసిన ఇతర అధికారులకు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

వార్తావాహిని