యూనిట్

20 మంది చిన్నారులకు విముక్తి కలిగించిన మదనపల్లె పోలీసులు

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో ఉమెన్‌ పోలీస్‌స్టేషన్‌ సి.ఐ. పి.హనుమతునాయక్‌ ఆధ్వర్యంలో దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ -2ను విజయవంతంగా నిర్వహించారు. నగరంలో ఎంతోమంది చిన్నారులు వివిధ కంపెనీలు, షాపులలో బాలకార్మికులుగా మగ్గుతున్నారనే సమాచారం అందుకున్న సి.ఐ. హనుమంతునాయక్‌ చిన్నారులకు మోములో చిరునవ్వు చిందించాలనే లక్ష్యంతో పోలీస్‌స్టేషన్‌లోని ఉమెన్‌ ఎ.ఎస్‌.ఐ. సి.సావిత్రమ్మతోపాటు, పోలీసు సిబ్బంది పి.సి.లు కె.శ్యామల (779), ఎం. సునీత (692), ఎస్‌.లత (701), ఎం. యల్లమ్మ (1742), పోర్డు సిబ్బంది రాధమ్మ, యశోధమ్మ, ఉమెన్‌ హెచ్‌.సి.లు ఎం. గిరిజకుమారి, జి.దుర్గాదేవి(628)లతో కూడిన ఒక టీంను నియమించారు. వీరందరూ ఏక కాలంలో మదనపల్లి నగరం పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్‌ నిర్వహించారు. నగరంలో మెకానిక్‌ షాపులు, చిన్నపాటి కర్మాగారాల్లో మగ్గుతున్న 20 మంది కిపైగా చిన్నారులను విచారించి, వారిలో బాలకార్మికులుగా మగ్గుతున్న వారిని విముక్తి కలిగించారు.

అంతేకాదు వారినందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి, చిన్నారుల ద్వారా వారి తల్లిదండ్రుల వివరాలు రాబట్టారు. తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, తమ పిల్లలు చదువుకుంటే ఉన్నతమైన భవిష్యత్‌ను మీకు అందిస్తారని చెప్పి కౌన్సిలింగ్‌ ఇచ్చి, వారి పిల్లలను ఇంకెప్పుడు పనిలోకి పంపరాదంటూ, మళ్ళీ పంపినా.. వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏకకాలంలో 20 మందికి పైగా బానిస సంకెళ్ళనుంచి విముక్తి కలిగించిందనుకు గాను స్టేషన్‌ సి.ఐ. హనుమంతునాయక్‌ సిబ్బందిని అభినందించారు.

 

వార్తావాహిని