యూనిట్
Flash News
నా దేశపు నాలుగో స్తంభం

పత్రికొక్కటున్న పదివేల
సైన్యము
పత్రికొక్కటున్న మిత్ర కోటి
ప్రజ రక్షలేదు పత్రిక
లేకున్న
- అన్నారు ప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల
వెంకటేశ్వరరావుగారు. పత్రికలు అంత శక్తివంతమైనవి ప్రజాస్వామ్య సౌధానికి పత్రికలు
మూల స్తంభాలు. వార్తనందించే పత్రికలు వార్తాపత్రికలు (న్యూస్ పేపర్స్).
ప్రపంచంలో మొట్టమొదటిగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు.
సుమారు క్రీ.శ. 1620 నాటికి
వార్తాపత్రిలకు వచ్చాయని చెప్పవచ్చు. క్రీ.శ. 1850 నుండి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమయింది.
1930 ప్రాంతంలో ప్రారంభమైన రేడియో అనతి కాలంలోనే
విస్తృత వ్యాప్తిని పొందింది. దాదాపు అదే కాలంలో ప్రారంభమైన సినిమా మరో దశాబ్ది
కాలంలోనే వచ్చిన టెలివిజన్, ఆ
తర్వాతి కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన ఉపగ్రహ ప్రసారాలు, కంప్యూటర్, ఇంటర్నెట్
మొదలైన ఆధునిక ప్రసారసాధనాలు సమాచార వ్యాప్తిలోచాలా విప్లవాలను తీసుకువచ్చాయి.
ఉపగ్రహాలద్వారా సమాచార ప్రసారం సాధ్యమయినప్పటి నుండి సమాచార సాంకేతిక రంగంలో
అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ప్రజోపయోగకరమైన అనేక రంగాలకు సంబంధించి అత్యంత
విలువైన సమాచారాన్ని గ్రహించడంలో ప్రసారం చేయడంలో ఇవి నిర్వహిస్తున్న పాత్ర
నానాటికి విస్తృతమవుతుంది. ఉపగ్రహాల సాయంతో వార్తలను చిత్రాలను ప్రపంచంలో ఏ
మూలకైనా క్షణాల్లో పంపగలుగుతున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్లో వార్తా పత్రికలు
సర్వసాధారణ విషయమై పోయింది. ఇవేకాక ప్రత్యేకించి ఇంటర్నెట్లో, వెబ్సైట్లో నడిపే పత్రికలూ ఉన్నాయి.
ఇంత చరిత్ర, ప్రాధాన్యత గల 'ప్రజాస్వామ్య
నాలుగో స్తంభం' అయిన
వార్తాపత్రికల తీరు సక్రమంగా ఉందా? 'సర్క్యులేషన్' మోజులోపడి అవాంఛనీయ మార్గాలను అవలంభిస్తూ, కులమత ప్రాతిపదికలతో, సమాజానికి హాని కలిగిస్తూ, నీతి బాహ్యమైన విషయాలకి ప్రాధాన్యమిస్తూ
పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయా?
అవుననే అంటున్నారు ఆధునిక
అభ్యుదయ కవి బండ్ల మాధవ రావుగారు తన కవిత 'నా దేశపు
నాలుగో స్తంభం'లో అదే ఈ నెల మన మంచికవిత....
గుండె చేతబట్టుకొని
అత్యంత ఉత్కంఠతో
ప్రాణాలు ఉగ్గబట్టుకొని
ఒకానొక అంతరుద్ధ్యాన్ని
కళ్లారా వీక్షిస్తున్నాను
వ్యాఖ్యలొద్దు
ఊహాగానాలు వద్దు
మాటల్ని నిలువుగా చీల్చి
వాటి వెనుక మర్మాల్ని
ఎవరూ బట్టబయలు
చెయ్యనవసరం లేదు
నిజం నిప్పులాంటిదైనా
మిగులుతోంది బూడిద మాత్రమే
టెలివిజన్ బ్రిటన్లో 1936లో మొదట వ్యాప్తిలోకి
వచ్చింది. టివిని స్కాట్ దేశపు ఇంజనీరు జాన్ బాగ్ బైర్ట్ 1928లో కనిపెట్టాడు. 1962 నుంచి
ఉపగ్రహాల సహాయంతో దేశాల మధ్య ప్రసారం మొదలైంది. నేడు టివి లేని ఊరు లేదు.
నట్టింట్లో పీఠం వేసుక్కూర్చుంది. ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టింది. కానీ, రోజు రోజుకీ పాశ్చాత్య సంస్కృతి, హింసా ప్రవృత్తి, అసభ్యత, అశ్లీలత, వివిధ
వ్యామోహాల్ని ప్రజల మెదళ్ళలోకి ప్రసారం చేస్తున్నాయి. ఇంటింట దుష్ప్రభావాన్ని, విషభావాల్ని వెదజల్లుతున్నాయి. సమాచార
వ్యాప్తికి ఉపయోగపడే మాధ్యమాలు అని ఆనందించిన సగటు మనిషి నేటి 'రంగుల పెట్టె' 'పాపులారిటీ' పేరిట
అశ్లీలతని, ప్రజల్లో ఉద్రేకం రెచ్చగొట్టే విధంగా ప్రసారం
చేస్తున్న వార్తల్ని(?) చూసి
సందిగ్ధావస్థలో పడిపోతున్నాడు. దారుణమైన హింసాత్మక భావాల్ని రేపెట్టేలా రాసి, చూపి ఆకర్షించాలనుకునే ఈ పద్ధతిని తీవ్రంగా
నిరసిస్తున్నారు కవి బండ్ల మాధవరావు.
సమాచారాన్ని అందిచడానికి
ఎటువంటి దమ్ము అవసరం లేదు
చీకటంటే నల్లగా మాత్రమే
ఉంటుందని తెలుసు
చీకటికి రంగులు పులుముతున్న
దృశ్యాన్ని చూస్తున్నాను
సరిహద్దులకటూయిటూ
నిరంతర సంఘర్షణ
తెరమీది నాటకానికి వెనుక
వ్యూహ ప్రతి వ్యూహాలు
ఇంట్లో రంగుల డబ్బాలో జరిగే
మాటల యుద్ధాన్ని
మోస్తున్నవాడ్ని
ఎప్పటికీ హంసను కాలేను
నా దేశపు నాలుగో స్తంభం
ఇప్పుడు శిథిలమౌతున్నది
మాటలే మాటల్ని హత్య
చేస్తున్న వేళ
మాట సూటిదనాన్ని కోల్పోయింది
ముఖానికేసుకున్న రంగుల్లో
మాటలు దాక్కుంటున్నాయి
అసలు మాట
అక్కడుండగానే
మాట నీడలు
ఎల్లలు దాటుతున్నాయి
గుంటూరు జిల్లా తుళ్ళూరు
మండలం అనంతవరం ప్రాంతానికి చెందిన మాధవరావు తల్లిదండ్రులు సామ్రాజ్యమ్మ, వెంకటపతిరావు. 18-7-63న
జన్మించి మాధవరావు పాఠశాల విద్య తుళ్లూరులో, ఇంటర్
తాడికొండలో, డిగ్రీ గుంటూరులో పూర్తి చేశారు. తెలుగు
సాహిత్యంలో ఎం.ఎ. పట్టా బెనారస్ విశ్వవిద్యాయలం నుండి పొందారు. చెమట చిత్తడి నేల, స్పర్శ, అనుపమ
అనే కవితా సంపుటాలు వెలువరించారు. అనుపమ కవితా సంపుటికి పలమనేరు రచయితల సంఘం వారు, గుంటూరు రచయితల సంఘం వారు పురస్కారాలు
అందించారు. 'సుజన' కవితాపురస్కారం అందుకున్నారు. గ్రామీణ ప్రాంతం
నుండి రావడం వల్ల గ్రామీణ పరిస్థితుల్ని సామాజిక సమస్యల్ని ప్రతిబింబించేలా ఆయన
కవితలు ఉంటాయి.
ముఖ్యంగా ఈ కవితలో నేటి
ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పడుతున్న పెడత్రోవల గురించి తన ఆవేదనను
వ్యక్తీకరించారు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి నాలుగు
స్తంభాలు ప్రధానమైనవి. అవి
1. లెజిస్లేచర్- చట్ట సభలు, అవి రూపొందించే చట్టాలు
2. ఎగ్జిక్యూటివ్ - చట్టాల్ని అమలు పరిచే వ్యవస్థ
పోలీసు వంటి వివిధ శాఖలు
3. జుడీషియరీ - న్యాయవ్యవస్థ
4. మీడియా -
నాలుగో స్తంభం అయిన మీడియా
వార్తని వార్తలాగా సమాచారం అందించడం మానేసి, రేటింగ్
కోసం మసాలాలు గుప్పించి, 'నిజానికి' మసిపూసి మారేడు కాయ చేస్తుండటం వల్ల అసలు
ప్రయోజనం మరుగునపడి, అసత్యం
వేగంగా నలువైపులా ప్రవహించి పోతోంది. అనేక సమస్యలు సమాజంలో
ఉత్పన్నమౌతున్నప్పటికీ, యాజమాన్యాలు వాళ్ళవైన రీతిలో, రేటింగ్ కోసం, వ్యాపార
ధోరణిలో ''అబద్దా''నికి
రంగులద్దుతున్నారు.
తెరమీద చేసుకొనే ఉత్తుత్తి యుద్ధాలకు
బలవుతున్నావాణ్ణి
నిర్మించబడుతున్న నిజాలమధ్య
ప్రాణం విలువ
వార్తకంటే తేలికైపోయింది.
ఆత్మహత్యచేసుకోడానికి
నిన్ను చూస్తూ కూర్చున్నాను
నీ రేటింగ్ సూచీకి
వేళ్ళాడుతూ
నేను పోగొట్టుకొన్న ప్రాణం
నీకొక రోజు పతాక శీర్షిక
రేపటికవి పకోడి పొట్లం
నీకిప్పుడు నిజం కావాలి
సూటిగా చెప్పే మాట కావాలి
మాట వలన లోకం వర్ధిల్లాలి!
బండ్ల మాధవరావుగారు
విజయవాడలో ప్రజాశక్తినగర్లో ''శిఖర''
(స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్)ని నడుపుతూ, మంచి భావాలతో మంచి విద్యార్థుల్ని
ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతున్నారు. వీరి కలం నుంచి మరిన్న మంచి కవితలు వస్తాయని
ఆశిద్దాం.
- బండ్ల మాధవ రావుగారు
డా|| శ్రీమతి సి.హెచ్. సుశీల