యూనిట్
Flash News
దేవదాసి

'దేవదాసి' అంటే
- గుడిలోని దేవుని ఉత్సవాల్లో నాట్యసేవచేస్తూ జీవితాంతం అవివాహితగా ఉంటూ
వేశ్యవృత్తిలో జీవించే స్త్రీ. దాదాపు 'నరబలి' అని చెప్పవచ్చు దీన్ని. సతీ సహగమనం వంటి
దురాచారం ఇది. భారతదేశంలో పూర్వకాలం ఈ ఆచారం వుండేదని చరిత్రకారులు రచించారు. కాని
ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి ఆచారం వుందని తెలుస్తోంది. ఒక స్త్రీని శాశ్వతంగా
ఒక దేవాలయానికి, లేక దేవునికి 'అప్పగించే' పద్ధతి, ఆమె
కొందరు పూజారులకి, గొప్ప
వాణిజ్యవేత్తలకి, రాజులకి ''అందరి సొంతం''గా మారిపోయే విధానం దారుణం. ఆ స్త్రీ నిత్య సుమంగళి. దేవాలయంలో
నాట్యకత్తెగా, పరిచారికగా, పండగలు, ఉత్సవాల
సమయంలో అందరికీ ఆనందం కలిగేలా నాట్యం చేయడం ఆమె విధి. వారి జీవన విధానానికి
జాలిపడి, వారి విముక్తి కొరకు చాలామంది చాలా పోరాటాలే
చేయవలసి వచ్చింది. ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. తత్పలితంగా ఈ దేవదాసి వ్యవస్థ
నిర్మూలనకు సంబంధించి బ్రిటీష్ పాలన నుండే అనేక చట్టాలు రూపొందాయి. ప్రస్తుతం
దేవదాసీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన ''చట్టం'' వుంది. కాని కొన్ని ప్రాంతాల్లో అనేక పేర్లతో ఈ
ఆచారం అయితే కొనసాగుతూనే వుంది. కఠినమైన ఆచార జీవనంతోను, స్వార్థపరుల అవసరాలకోసం కొందరు స్త్రీలు బలి
అవుతూనే వున్నారు.
''మేనంతా మైనపు ముద్దై మరిగిపోతూ, కరిగిపోతూ'' వున్న ''దేవదాసి''గురించి కవయిత్రి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి రాసిన కవిత ఈ నెల మన మంచికవిత.
జీవితం
పడుగుపేకలుగా
చీకటి
వెలుగుల్లా
ఆశానిరాశలతో
పాప పుణ్యాల
పలుకరింపుల్తో
అంటూ అంటాం!
కానీ-
దేవదాసి
జీవితమంతా
వేసవిఛాయే!
వేడుకలేదు
వేదన
వినా!
ఆమె-
వర్ణచిత్రంలా
అందరికి
ఆకర్షణౌతూ
తీపిలేని
పానకంలా మిగిలిపోతూ
దైవ
నైవేద్యం పేరున నలుపౌతూ
ఊరుమ్మడి
బతుకై
ఉరికొయ్యల
వేలాడుతూ
ఆటనలసి
ఆక్రందనౌతూ
నవ్వులేని
మోముతో నాట్యమౌతూ
సుఖాల
ఊటై మనలేక
వినిపించని
కన్నీటి పాటౌతూ
ఆధిపత్యపు
అరదండాల
అడుగడుగునా
అణగిపోతూ
మేనంతా
మైనపు ముద్దై మరిగిపోతూ
కరిగిపోతూ
కాలం
చూస్తూనే
కసిరేపుతూనే
నిస్సహాయమై
నిస్తేజమై
నశిస్తూనే
దేవదాసైనా
దైవంముందే
ఉన్నా
దయా
ధనమందని దరిద్రమౌతూ
దేవసతియన్న
దేబెలంతా
దొరకపుచ్చుకొన
దేవుళ్ళాడుతూ-
లోకమిది-ఆలోకనమై
కనదు
శోకమిది-
కననీదు
శాద్వలశాఖా
శుభసౌందర్యాన్ని
మల్లెలా
మననీదు
శరణాన్ని
శాశ్వత మవనీదు
బతుకు
మలినం చేస్తూనే..
చూస్తూనే...
గ్రామంలో
జరిగే అన్ని అరిష్ఠాలు, అనర్థాలకు
మూలకారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మిన గ్రామస్తులు, గ్రామ దేవతలను శాంతింపజేయడానికి ఒక స్త్రీని
దేవాలయానికి అర్పించడం, ఆమెచేత
కఠినమైన కార్యక్రమాల్ని చేయిస్తూ, ఉపవాసాలు, బిందెల కొలది నీళ్ళతో తల స్నానాలు, పసుపు కుంకుమల లేపనాలతో వారిచేత అనేక క్రతువులు
నిర్వహింపజేస్తారు.
భూస్వాముల
కామాంధకారానికి బలౌతూ, గర్భస్రావాలకు
బలౌతూ, అనారోగ్యాల పాలౌతూ, చివరి జీవితరంగంలో నిర్లక్ష్యానికి గురౌతూ, అందరి సంపదగా బతికి, చివర్లో ఎవరికీ కాకుండా వెళ్ళిపోయే ఈ దేవదాసి
జీవితం చాలా విషాదకరం. ఎవరూ పట్టించుకోని, పట్టించుకున్నా, వారి గురించి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితిలో
- కవయిత్రి మల్లీశ్వరి 'దేవదాసి' యొక్క దయనీయ జీవితాన్ని కవితరూపంలో వెలువరించడం
అభినందనీయం.
గుంటూరు
జిల్లా మైనేనివారిపాలెంలో 1954లో
జన్మించి రేపల్లెలో పాఠశాల విద్యాభ్యాసం గావించి, భీమవరంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం పి.జి. సెంటర్లో
తెలుగు ఎం.ఏ. చేశారు మల్లీశ్వరి. గుంటూరులో బి.ఇడి. చదివి, హైదరాబాదు బేగంపేటలోని ''హైదరాబాద్ పబ్లిక్స్కూలు'లో సుదీర్ఘ కాలం ఉపాధ్యాయినిగా పనిచేశారు. నిరంతరం బాలసాహిత్యం, భాషా సాహిత్య వ్యాసాలు, వచన కవితలు, పద్య
రచన చేసే తెలుగు భాషా ప్రేమికురాలు శ్రీమతి మల్లీశ్వరి.
1. తేనె వాకలు (గేయ కథలు), 2. తేనె
చినుకులు (బాల గేయాలు). 3. రెల్లు పూలు (గేయాలు). 4. పదాల
పరిమళాలు (భాషా సాహిత్య వ్యాసాలు). 5. బొమ్మలకొలువు (బాలగేయాలు). 6. నేనెవరిని
(పొడుపు కథా గేయాలు). 7. అమ్మపాట (గేయాలు). 8.కైత (వచన కవితలు). 9. ఒక్క
పదం అర్థాలెన్నో (నానార్థ పద వివరణాత్మక వ్యాసాలు) 10. తెలుగు వాచకాల నిర్మాణం (1-8 తరగతులకు) 11. వెయ్యికి
పైగా భాషా సాహిత్య వ్యాసాలు 12. పదిహేను వందలకు పైగా పద్యాలు రచించారామె.
''వాసిరెడ్డి మాట వాస్తవమ్ము'' అనే
శతకం త్వరలో ప్రచురణకు రాబోతున్నది. పదుగురికి తెలుగుభాషా సంపదను పంచడమే తన రచనల
ధ్యేయం అంటారామె. మల్లీశ్వరిగారి భాషా, సాహిత్య
కృషికి గానూ అనేక పురస్కారాలు అందుకొన్నారు.
1. బాల బంధు (సంఘమిత్ర సాంస్కృతిక సంఘ సేవా సంస్థ)
2. తెలుగు కవితా వైభవం వారి నుండి ''సహస్ర కవిమిత్ర'' పొందారు. 3. ఉత్తమ గ్రంథ రచనకు గాను ''డా. రావూరి
భరద్వాజ'' స్మారక
పురస్కారం, 4. బాలసాహిత్య పరిషత్వారి
నుండి జ్ఞాపిక పొందారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందిన రచయిత్రి, కవయిత్రి అయిన మల్లీశ్వరి త్వరలో ''ఇంద్ర ధనుస్సు'' అనే బాలల విజ్ఞాన గేయాలు గ్రంథాన్ని
ఆవిష్కరించబోతున్నారు. వారికి అభినందనలు.
-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
సంకలనం- డా.శ్రీమతి సి.హెచ్. సుశీల