యూనిట్
Flash News
విసనకర్ర

ఆచార్య
ఎండ్లూరి సుధాకర్
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి ప్రాంగణంలో తెలుగు సాహిత్యవిభాగం డీన్గా, శాఖాధిపతిగా పని చేస్తున్న ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ 10 గ్రంథాలు, 60 సాహిత్యవ్యాసాలు, 40 (జాతీయ, అంతర్జాతీయ) పరిశోధన పత్రాలు
వెలువరించారు. 21-1-1959న పాములబస్తీ, నిజామాబాద్లో జన్మించిన సుధాకర్ బాల్యం, విద్యాభ్యాసం
అక్కడే జరిగి, ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఏ.చేశారు.
తర్వాత కొన్నాళ్లు సికింద్రాబాద్ వెస్టీ ్లబాయ్స్ హైస్కూల్లో గ్రేట్ 1 పండిట్గా పనిచేసి, తెలుగు విశ్వవిద్యాలయ రాజమండ్రిలో
అధ్యాపకునిగా చేరి, రీడర్గా ఎదిగి, ప్రొఫెసర్గా, డీన్గా, 'వాఝ్మయి' త్రైమాసిక పత్రికకు సంపాదకునిగా, నిరంతర
సాహితీ కృషివలునిగా పేరుగాంచారు. జాషువా సాహిత్యంలో పరిశోధన చేసి ఎం.ఫిల్ మరియు
పిహెచ్.డి పొందారు. తన ప్రతిభాపాటవాలు తర్వాత తరాలకు కూడా అందిస్తూ, నిత్యం విద్యార్థులకు సాహిత్యం బోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే ''ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం' అందుకొన్నారు.
రెండుసార్లు రాష్ట్రప్రభుత్వంచే 'జాషువా
పురస్కారాలు'తో పాటు, జాతీయ
అంతర్జాతీయ స్థాయిల్లో 22 పురస్కారాలు అందుకొన్నారు. మొదటి
కవితాసంపుటి ''వర్తమానం'' నుండి ''వర్గీకరణీయం'' ''కొత్త గబ్బిలం'' కవితాసంపుటాలు, ఆటా (అమెరికా తెలుగు సంఘం) ఆహ్వానం మేరకు
వెళ్ళి సభలలో ప్రసంగించి వచ్చాక ఆ అనుభవాల అనుభూతులతో ''ఆటా జనికాంచె'' రచించారు. ముఖ్యంగా ''నల్లద్రాక్షపందిరి'' కవితాసంపుటి అత్యధిక సాహితీవేత్తల
అభిమానాన్ని చూరగొనింది. ఆకాశవాణి, దూరదర్శన్, ఇంటర్నెట్లలో తన వాడివేడి ప్రసంగాలుచేస్తూ, శిష్యులకు
మార్గదర్శకత్వం చేస్తున్న సుధాకర్గారి గైడెన్స్లో
61 ఎం.ఫిల్లు, 18 పిహెచ్.డిలు వచ్చాయి. ''ఇప్పటి వరకు
చేసిన సాహితీకృషి గోరంత, చేయాల్సింది ఇంకా కొండంత'' అంటారాయన వినయంగా.
వారి రచన ''విసనకర్ర'' ఈనెల మంచికవిత.
విసనకర్ర
ఇదెప్పుడు మా ఇంట్లో కొచ్చిందో తెలీదు
ఎలా కనుమరుగయ్యిందో తెలీదు
దీన్ని ఏ విశ్వకర్మకనిపెట్టాడోగాని
కళ్ళు కదలికల్ని పసిగడుతున్న దశలో
తొలిసారి నా ముందు
సగం తెరిచిన హంసరెక్కలావూగింది
వేసవి వచ్చిందంటే చాలు
వాడవాడలా గాలిచుట్టాలై వాలిపోయేవి
చిన్నప్పుడు మా మేదరక్కలు
చేతివేళ్ళ యంత్రాల మీద
చిత్ర విచిత్రంగా చేసిన వన్నెల విసనకర్రల్ని
మా ఊరి బుడెన్ సాహెబు
భుజాన తగిలించుకొని
వీధుల్ని విసనకర్రల్ని చేసేవాడు
ఈత పాయల జడవేసినట్లు
తాటాకుల దువ్వెనతో జుట్టుదువ్వినట్టు
రంగురంగుల జెండాలై
మా చేతుల్లో విసనకర్రలు
వాయువందన స్వీకారం చేస్తున్నట్టుండేవి.
జ్వరం వచ్చినప్పుడో
అమ్మవారు పోసినప్పుడో
మా అమ్మే రాత్రంతా విసనకర్రగా మారిపోయేది
మా తాతకు వడదెబ్బతగిలి
నులకమంచంలో గిలకలా
గిలగిలలాడుతుంటే
మా అవ్వ చేతిలోకి
చల్లని దేవతలా వచ్చి
బొందిలో ప్రాణబిందువయ్యింది
ఈ విసనకర్రే.
ఆఖరిచూపుల
అగరొత్తుల పొగలమధ్య
తల దీపమై మా అమ్మతాండ్లాడుతున్నప్పుడు
మా నాయన మృత్యుముఖాన్ని
ఇంటిఈగలు ముద్దాడుతుంటే
పరిచారికలా
ఇరువైపులా జాలిగా ఓదార్చింది
విరిగిన మా పాత విసనకర్రే.
నవారు మంచం మీద
సవారు చేసే కొత్త దంపతులకు
మంచినీళ్ళ చెంబుతో పాటు
మంచంపక్కన
విశ్వాసంగా పడివుండే
ఏకైక వస్తువు
ఈ విసనకర్రే.
అన్నం ఆరాలన్నా
పొగరుబోతు నాన్నల
పొగలసెగల చల్లారాలన్నా
ఎంతకీ ఏడుపాపని
ఎండాకాలపు పాపని
హాయిగా బజ్జోపెట్టాలన్నా
చల్లని గాలి మందుబిళ్ళలు
ఈ విసనకర్రలు.
మా కుర్రతనంలో
ఒంటిచెట్లకు చెమటకాయలు కాసి
ఒళ్ళంతా పండిపేలిపోయినపుడు
గాలిలో తేలిపోయేలా
శీతల పవన సుగంధ లేపనాలు పూసినవి
ఈ విసనకర్రలే కదా!
గాలి ఘనీభవించిన గ్రీష్మరాత్రి
అటుచూడండి ఆకాశం వంక
మలయమారుతాల మబ్బులమధ్య
చందమామ...ఊగుతున్న వెండివెన్నెల
పంఖా
లేత సీతాకోక చిలుకల
తాజా రెక్కల ఇంధ్రధనుస్సులు వాడిపోకుండా
కొలను గట్టున నీడగొడుగు పట్టింది
ఆకుపచ్చని అరటి సురటి.
ఒకప్పుడు ప్రకృతి మనల్ని కాపాడేది
ఇప్పుడా రుతుధర్మమేది?
ఈవాళ మీట నొక్కగానే పక్షుల్లా ప్యాన్లు
తిరగాలి
కరెంటు పోయిందా
అషో-ఉషో మధ్య
ఒడ్డున పడిన చేపలవ్వాలి
న్యూసుపేపరో
న్యూసెన్సుపుస్తకాన్నో
ఏదో ఒకటి దొరకబుచ్చుకొని
విసుక్కుంటూ విసురుకోవాలి
పేరుకు పెద్ద బంగ్లాలే
ఖరీదైన నగర జీవితాలే
ఎక్కడా ఏ ఇంట్లోనూ
చిన్న విసనకర్ర కనబడదు.
ఏదో ప్లాస్టిక్ ముక్కలు తప్ప.
ఈసారి మా వూరెళ్ళినప్పుడు
నాలుగు విసనకర్రలు తెచ్చుకోవాలి
ఇప్పుడక్కడ మా వూరుందో లేదో!
ఊరు ఉండి ఉంటుంది కానీ, విసనకర్రలు
దొరకకపోవచ్చు. ఎందుకంటే చేతివృత్తులు నానాటికీ నశించిపోతున్నాయి. ''హైటెక్ సిటీలైఫ్'' ప్రభావం క్రమంగా పల్లెల్ని కూడా కప్పేసి, తరతరాల వృత్తులు చిన్నాభిన్నమైపోయాయి. విసనకర్రతో విసురుకోవడం ''నామోషీ''గా పరిగణింపబడుతోందీనాడు. రేపటి పౌరులకి
అమ్మమ్మ నానమ్మల అనురాగం, తెలుగుభాష తీయదనం, విసనకర్రలు, ఈత చాపలు, తాటాకు
పందిళ్లు, కుండలు కూజాలు, కుంపట్లు, లాంతర్లు తెలీకపోవచ్చుకూడ.
వస్తు వ్యామోహం పెరిగిపోయి, ఆధునిక, ఖరీదైన వస్తువులతో ఇల్లంతా (మనసంతా డొల్ల) నింపేసి, వాటి లేటెస్ట్ టెక్నాలజీలని గొప్పగా చెప్పేసుకుంటున్నారు నేటి జనాలు.
ఇంట్లో మనుషుల సంఖ్య తగ్గిపోయి, వస్తువుల
మెరమెచ్చుల సంఖ్య పెరిగిపోయి, ఇల్లంతా
వస్తువుల్ని అందంగా అమర్చి ''ఎగ్జిబిషన్'' చేసేస్తూ, పాత వస్తువులతోపాటు పాతమనుషుల్ని ఓ
స్టోర్ రూంలో పడేస్తున్నారు. ఆత్మీయ అనుబంధాల్ని అటకెక్కిస్తున్నారు. వాళ్ళతో, వాటితో ఇప్పుడు అవసరం లేదుకదా!
మనిషినిగానీ, వస్తువునిగానీ రూపాయివిలువలో కాక, ''మనసుతో అనుభూతితో నిండిన విలువలో'' గుర్తిస్తే గుండె బండబారిపోకుండా, మనిషి ఆపాదమస్తకం ఆర్ధ్రతతో నిండిపోడూ! మనిషినీ, వస్తువునీ కూడా మనసుతో అనుబంధాన్ని పెంచుకొని ప్రేమిస్తే రక్తమంతా జీవశక్తితో పరవళ్ళు తొక్కదూ! చేతన అచేతనాల్ని తన జీవితంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తుల నిండా కొత్తఊపిరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఊగిపోతూ! ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలుమారినా నిత్యసత్యమిది కాదూ!!