యూనిట్
Flash News
బొమ్మలాంతరు

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
తోలుబొమ్మలాట
అనేది పండితపామరులను ఆకర్షించే, అలరించే
ప్రాచీన జానపద కళారూపం. వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని కల్గించే కళా ప్రదర్శన యిది.
రంగస్థలం మీద అట్టలను ఆయా పాత్రలకనుగుణంగా కత్తిరించి, రంగులద్ది దారాలను కట్టి, తమ చేతివేళ్ళతో దారాలను పట్టుకొని, తెరవెనుక నుండి కొందరు (సూత్రధారులు), వేళ్ళను ఆడిస్తూ బొమ్మల్ని ఆడిస్తారు.
చలనచిత్రాలకు పూర్వం నాటకాలు రాజ్యమేలాయి. నాటకాలకు పూర్వం యక్షగానాలు, చిరుతల నాట్యాలు, తందనాల
ఆటలు, బుఱ్ఱకథలు, వీధి
భాగవతాలు, కోలాటాలు, భజనలు, పగటివేషాలు, చెక్కబొమ్మలాటలు, బుట్ట బొమ్మలాటలు, గారడీ విద్యలు, పులివేషాలు, అశ్వనృత్యాలు, తోలుబొమ్మలాటలు
ఉండేవి. ఈ ఆటగాళ్ళు తమ ఆచార సంప్రదాయాల్ని నిత్యం నిర్వహిస్తూనే పండుగలు, జాతరలు, కొన్ని
ప్రత్యేక సందర్భాల్లో, రాత్రివేళల్లోగాని
రోజంతాగాని వినోదవిజ్ఞానాల కోసం తమవైన ప్రత్యేకమైన ఈ కళను ఉత్సాహంగా ప్రదర్శిస్తారు. ''కేతిగాడు'' ''బంగారక్క'' పాత్రల
ద్వారా హాస్యాన్ని చిందిస్తూ రామాయణభారతాది గ్రంథాల్లోని ముఖ్య అంశాల్ని
ప్రదర్శిస్తారు. వృత్తిని నమ్ముకొని జీవిస్తూ, పోషకుల్ని
ఆశ్రయిస్తూ ఊరూరా తిరుగుతుంటారు.
కథలు వినాలనే ఆసక్తి మానవ స్వభావంలోనే వుంది.
ముఖ్యంగా పల్లెజనం తమ పనులన్నీ పూర్తయిన పిమ్మట, ఆరుబయట
అందరూ విశ్రాంతిగా కూర్చొని, వినోదరూపాల్ని
ముఖ్యంగా తోలుబొమ్మలాటని చూడ్డానికి ఇష్టపడతారు. అనేక కథల్ని తోలుబొమ్మలాట రూపంలో, ఆటగాళ్ళ అద్భుత కల్పనా శక్తిని, నేర్పుని ఆసక్తిగా ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. కాని ఆ ప్రదర్శన వెనక, తెరవెనక వున్న కళాకారులు తమ వృత్తిని
వదులుకోలేక, వదిలివేరే వృత్తిని చేపట్టలేక, వృత్తిధర్మం పట్ల నిబద్ధతతో, భుక్తికోసం, కోటి
విద్యలు కూటి కోసమే అన్న సామెతని నిజం చేస్తూ బతుకుబండి లాగిస్తూ, నిత్యం పడేపాట్లు ఎందరికి తెలుసు!
అంతరించిపోతున్న
ఈ కళకి రూపకల్పన చేశారు కవి శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి తన ''బొమ్మలాంతరు'' కవితలో ఇదే ఈనెల మన మంచి కవిత.
వాళ్ళకి
ఒంటెద్దుబండి
గూడే మేడై
వలస
జీవితానికి తోడౌతుంది!
ఆకుపసర్ల
రంగులద్ది మేకప్జేస్తే
మేకతోలే
పురాణపురుషులౌతారు!
రాత్రంతా
రాలే చీకట్ల తెరపై
బొమ్మల
జాగారమే బువ్వవుతోంది!
వాళ్ళ
నీడల్లో జాడలు వెతికే
సినీరంగం
స్థిరపడి పోయింది!
నేడు...
తెరవెనుక గుడ్డిదీపం
చమురందక
గతుకుతోంది!
తెల్లని
తెరగట్టి, తెరవెనక లాంతరు వెలుగులో, తెరపై తోలుబొమ్మలాడిస్తూ, భారతరామాయణ గాధల్ని అద్భుతంగా మన అనుభవంలోకి తెస్తూ, ఒంటెద్దుబండిలో సంసారాన్నినింపుకొని, ఊరూరా తిరిగే తోలు బొమ్మలటగాళ్ళు ఇప్పుడు ఎక్కడ? సినిమాలు, టీవీలు, రేడియోలు సాంస్కృతిక దాడికి పూనుకొన్నాక ఇలాంటి
జానపద కళారూపాలు ఎంత దయనీయంగా అంతరించిపోతున్నాయో! వీటినే జీవనాదారం చేసుకొన్న
బడుగుల బ్రతుకుల్ని పరకాయప్రవేశం చేశాడా ఈ కవి అన్నంతగా మనముందుంచారు కొండ్రెడ్డి.
ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన
బుడ్డారెడ్డిపల్లె కుగ్రామంలో మధ్యతరగతి రైతుకుటుంబానికి చెందిన కోటమ్మ, పెద్ద సుబ్బారెడ్డి గారి ఏకైక సంతానం
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ''నా బాల్యాన
మావూరు కక్షలు కార్పణ్యాలు కురుపు, రచ్చబండ
రాజకీయం అన్ని యిజాల'' గూర్చి
నిజాలు చెప్పేట్టు రంకెలేసేది. రైతుకుటుంబాల్ని రాజకీయం ఊబిలోకి లాగి అయినవారి
మధ్య అగ్ని రగిల్చేది. ఆనాడు బాధింపబడిన కుటుంబాలలో మాది ఒకటి. అందుకే ఆనాడే నాలో
అశాస్త్రీయ రాజకీయ విధానాలు అనర్థాలకు దారి తీస్తాయనే భావన ఏర్పడింది'' అంటారాయన-
''సామాజిక రుగ్మతల్ని ఎత్తిచూపడానికి కవిత్వం ఒక సాధనం. సామాజిక మార్పుకోసం
ఎన్నుకొన్న పద్ధతి ఇది. సమాజాన్ని విడిచి, విస్మరించి
కవిత్వం చెప్పడం అనవసరం'' అని
నమ్ముతారాయన.
ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగళ్ళూరులో పనిచేసి, పెదచెర్లోపల్లిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా
పనిచేస్తూ రిటైర్ అయి, కనిగిరిలో
స్థిరపడ్డారు. దాదాపు 13 పుస్తకాలు వెలువరించిన వీరి రచనలపై 2 ఎం.ఫిల్లు, ఒక పిహెచ్డి వచ్చాయి. వీరి సాహిత్య విమర్శకు ''తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి
పురస్కారం'' లభించింది.
రంజనీకుందుర్తి అవార్డు, నెల్లూరు
జిల్లా రచయితల పురస్కారం, ఆవంత్స
సోమసుందరం లిటరసీ ట్రస్ట్వారి ''శ్రీమతి
రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం'', ఆటావారి
పురస్కారం అందుకున్నారు. ఇటీవల గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్వారి ''గిడుగు రామ్మూర్తి సాహిత్య
పురస్కారం 2016'' అందుకొన్నారు.
తెరమీద
తోలుబొమ్మ
మసకబారి
కులుకుతోంది
రాగం
ఆకలిగొని
శృతి
దప్పి రోదిస్తుంది!
తాళం
దప్పిక గొని
లయదప్పి
విలపిస్తుంది
పల్లవి
శోషతో ఒళ్ళంతా చల్లబడి
పలుకురాక
మూగబడిపోతోంది!
బంగారక్క
బతుక్కు
బుడకేతిగాడు
చీకటి తరగౌతాడు
జుట్టుపోలుగాని
జులాయితనం
బజారెక్కిజార
విరుచుకుంటోంది!
బతుకు తెరువుకోసం జానపదకళాకారులు ఏ దిక్కూలేక
అల్లాడిపోతూంటే, మన ప్రాచీన సాంప్రదాయిక కళల్ని కాపాడుకోలేని మనం
పాశ్చాత్య ధోరణులకి దాసోహమవడం దౌర్భాగ్యం కాదా! అభివృద్ధి ఎవరు పొందుతున్నారు, అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి - అన్నీ
ప్రశ్నలే. అప్పుడప్పుడు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలోనో వీళ్ళని ''తోలుకొస్తారు''. మనసులో విసుక్కుంటూ, పైకి పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకొని, ''కళాపోసన'' అంటారు. నిజంగా మనవైన జానపద కళల్ని పోషించే
కళాత్మకహృదయం మనకుంటే ఇవి క్రమంగా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడేదా? తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తిని
వదులుకోలేక, మరే వృత్తి చేయలేక పోతున్న వీరి బిడ్డల
బిడ్డలకి భవిష్యత్ ఏమిటి?
కళను
నమ్ముకొన్న బతుకు
బజార్లో
మెతుకులేరుకొంటోంది
పురాణాలు
పుక్కిలించే నోళ్ళకు
పున్నీళ్ళు
కరువై పోతున్నాయ్!
యజమాని
పస్తుల గస్తీకి రోసి
తోలుబొమ్మలు
తెరదిగిపారిపోతున్నాయ్!
కళాకారుని
జీవితం కన్నీటి చుక్కలే
జాబిలమ్మ
కళ్ళల్లో 'క్యాట్రాక్టు'' పొర కమ్మేస్తూంది!
మన
సంస్కృతి రూపాన్ని
టి.వి.
నీడల్లో చూచే దుష్కృతి
ఇవాళ...
మన
జానపదకళ...
చరిత్ర
పుటల్లో సమాధైంది..
మానస
సరోవరం నుండి
అంతరించి
పోయిన హంసైంది!
మనసుద్రవించేలా, కన్నులను కట్టినట్టు తోలుబొమ్మలాట దయనీయగతిని
వర్ణించారు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. అందుకే ''బొమ్మలాంతరు'' జానపదుల కళల దురవస్థపై రాల్చిన కన్నీటి చుక్క'' అన్నారు కీ.శే.డాక్టర్ నాగభైరవ
కోటేశ్వరరావుగారు.
డా|| శ్రీమతి సి.హెచ్. సుశీల