యూనిట్

సాహసం చేసి అమ్మాయి ప్రాణాలు కాపాడిన పోలీసులు

అనంతపురం  పిటిసి ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పైన ఒక అమ్మాయి ఇందిరా అలియాస్‌ ఇందు, (28)  నడుచుకుంటూ వెళ్లడాన్ని అటుగా వెళుతున్న ఇద్దరు అనంతపురం 2 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్ళు  కే. విష్ణువర్దన్‌ రెడ్డి, జి. దిలీప్‌ కుమార్‌లు గమనించారు. వారికి అనుమానం వచ్చి  ఇద్దరు ఆ అమ్మాయి వెంటే ఫాలో అయ్యారు.  ఆ అమ్మాయి ఎదురుగ వస్తున్న ట్రైన్‌ క్రింద పడాలనే ఉద్దేశంతో వెళుతున్నట్టు సదరు కానిస్టేబుళ్ళు గ్రహించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఇందిరను రైల్వే ట్రాక్‌ పైనుంచి పక్కకు లాగివేసారు. తరువాత కొన్ని సెకండ్లలోనే ట్రాక్‌ పైనుంచి ట్రైన్‌ వెళ్ళిపోయింది. ప్రాణాలు కాపాడిన ఇందిరను ఇద్దరు స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్ళు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నందు ఎస్‌.ఐ. శివ గంగాధర్‌ రెడ్డికి అప్పగించారు.  ఎస్‌.ఐ. శివ గంగాధర్‌ రెడ్డి ఆ అమ్మాయి పూర్తి విషయాలు అడుగగా ఆమె చెప్పడానికి నిరాకరించింది. ఎస్‌.ఐ. అమ్మాయికి ధైర్యం చెప్పి అమ్మాయి పూర్తి వివరాలు రాబట్టారు. ఆ అమ్మాయి భర్త, బావ, వదినలను పోలీస్టేషన్‌కు పిలిపించి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్‌ నిర్వహించి స్థానిక విఆర్‌ఓ సమక్షంలో ఆమెను తన భర్తకు అప్పగించారు. విచారణలో ఇందిర తన కుటుంబ వ్యక్తిగత సమస్యల కారణాలతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలిసింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.      ఆమె తన భర్తతో కలసి హైదరాబాద్‌లో కాపురము  ఉంటున్నది. ఓ పెళ్లి కార్య ము నిమిత్తం స్థానిక 4వ రోడ్‌ నందు గల ఇందిర బావ,వదిన ఇంటికి వచ్చిన తరువాత ఈ సంఘటన జరిగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అమ్మాయి ప్రాణాలు రక్షించటంతో ఇద్దరు స్పెషల్‌ పార్టీ కానిస్టేబుళ్ళు కే.విష్ణువర్దన్‌ రెడ్డి, జి.దిలీప్‌ కుమార్‌లను అనంతపురం 2 టౌన్‌ పోలీస్‌స్టేషన్‌  సి.ఐ. ఎల్లమరాజు, ఎస్‌.ఐ. శివ గంగా ధర్‌ రెడ్డిలను అమ్మాయి భర్త, బంధువులు మరియు స్థానికులు అభినందించారు.

వార్తావాహిని