యూనిట్

అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధ మహిళలను కాపాడిన కడప పోలీసులు

 జీవనోపాధిగా ఉన్న చీపురు పుల్లలను ఏరుకునేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన ఇరువురు వృద్ధ మహిళలు తప్పిపోయిన ఘటన  కడప జిల్లా జరిగింది.  కడప జిల్లాలోని వీరబల్లి మండలం ఈడిగపల్లికి చెందిన  చెనగాని వీరనాగమ్మ , గవనేరి రాములమ్మ  లు 23 న గురువారం ఉదయం  జీవనోపాధికి అవసరమైన చీపురు పుల్లల సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో దారి తప్పి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళనకు గురిచేసింది. పోలీసులను ఆశ్రయించి వృద్ధ మహిళల ఆచూకీ కనుక్కోవాలని కోరారు. జిల్లా ఎస్.పి   కె.కె.ఎన్.అన్బురాజన్   ఆదేశాలతో తక్షణం రంగంలోకి దిగిన పోలీసు అధికారులు రాయచోటి రూరల్ సి.ఐ. సుధాకర్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె సి.ఐ. యుగంధర్, వీరబల్లి ఎస్.ఐ రామాంజనేయులు, సుండుపల్లె  ఎస్.ఐ భక్తవత్సలం, స్పెషల్ పార్టీ బృందాలు అటవీ ప్రాంతానికి బయల్దేరారు. అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించి ఎట్టకేలకు ముట్టికొండ ప్రాంతంలో మహిళల జాడ కనిపెట్టారు. నిద్రాహారాలు లేక నీరసించిన మహిళలకు వైద్యునితో వైద్యసేవలు అందించి గ్లూకోజ్, పండ్లు ఇచ్చి కోలుకునేందుకు అవసరమైన సపర్యలు చేశారు. క్షేమంగా కుటుంబసభ్యుల చెంతకు చేర్చి ప్రజల మన్ననలు అందుకున్నారు.  

వార్తావాహిని