యూనిట్

సౌదీలో బందీ అయిన మహిళను రక్షించిన సిద్దవటం పోలీసులు

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను మభ్యపెట్టి సౌదీకి వెళితే.. తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బును సంపాదిస్తారని ఆశచూపి అమాయకులను సేఠ్‌లకు అక్రమంగా అమ్మేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా సిద్ధవటం -1 లోని లక్ష్మీపురంకు చెందిన పేరూరు సుబ్బలక్ష్మమ్మ గత పదేళ్ళ క్రితం వంటపని నిమిత్తం దుబాయ్‌కు వెళ్లింది. తిరిగి వచ్చిన ఆమె పెంచలయ్యను వివాహం చేసుకుంది. భర్తకు యాక్సిడెంట్‌ కావడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతోంది.  దీన్ని ఆసరాగా చేసుకొని జిలానీ, గౌస్‌పీర్‌లు ఆమెకు మాయమాటలు చెప్పి దుబాయ్‌లో వంటమనిషిగా వెళితే.. మంచి ఆదాయం వస్తుందని చెప్పి.. ముందుగా రూ.80 వేలు తీసుకున్నారు. ఆమెను దుబాయ్‌కి కాకుండా సౌదీలోని రియాద్‌కు చెందిన కపిల్‌ సేఠ్‌కు రూ.2.50 లక్షలకు ఆమెను అమ్మేశారు. సేఠ్‌ ఇంటిలో వంటమనిషిగా చేరిన ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గుర్తించిన సేఠ్‌ మీ ఏజెంట్లు నా వద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తే మీ దేశానికి పంపిస్తామంటూ ఆమెను ఓ గదిలో నిర్భందించినట్లు తెలిపారు. సుబ్బలక్ష్మమ్మ తను పడుతున్న ఇబ్బందులను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. విషయం తెలుసుకున్న భర్త పెంచలయ్య సిద్ధవటం ఎస్‌.ఐ. అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఎస్‌.ఐ. విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి, సౌదీ సేఠ్‌తో, ఎంబసీ అధికారులతో చర్చించి, అనారోగ్యంతో ఉన్న సుబ్బలక్ష్మమ్మను క్షేమంగా స్వగ్రామానికి తీసుకురావడానికి కృషి చేశారు. సిద్ధవటం పోలీసుల కృషిని కర్నూలు రేంజ్‌ డిఐజి రమణకుమార్‌ మీడియాకు వెల్లడించి, ఎస్‌.ఐ. అరుణ్‌రెడ్డి చొరవను డిఐజి అభినందించారు. ఈ కేసులో అదనపు ఎస్‌.పి. సత్యయేసుబాబు, రాజంపేట డిఎస్‌.పి. రాజేంద్ర, ఒంటిమిట్ట సిఐ రవికుమార్‌ల కృషిని అభినందించారు. 

వార్తావాహిని