యూనిట్

నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం

 (గత సంచిక తరువాయి)

ఎలుకలు ఓడని యెందుకు వదిలిపెట్టాయి?

ఆ భారమైన ఓడని లాగడం కొంగలకి కష్టం అయింది. కొన్ని గంటల్లోనే అవి అలిసిపోయి, దాదాపు సముద్రంలో పడినంత పనైంది. అప్పుడవి ఆ ఓడని ఒడ్డు దగ్గరకి లాగాయి. డాక్టరుగారి దగ్గర సెలవు తీసుకున్నాయి. తమ బాడవకి యెగిరిపోయాయి. యిప్పుడు గుడ్లగూబ బుంబా డాక్టరుగారి దగ్గరికి వచ్చి అంది:

''అదుగో చూడండి! ఓడపైన ఎలకలున్నాయి. అవి తిన్నగా నీళ్లల్లోకి దూకి ఒకదాని తర్వాత ఒడ్డుకి యీదుకుంటూ పోతున్నాయి.''

''మంచిదే! ఎలుకలు చెడ్డవి, క్రూరమైనవి. అవంటే నాకిష్టం వుండదు'' అన్నాడు డాక్టరుగారు.

''మీరు పొరబడ్డారు'' అంది బుంబా. ''అది తప్పు. ఎలుకలు ఓడ అడుగున వుంటాయి. ఓడ మట్టుకి చిల్లు పడి నీళ్లు యెక్కేటప్పుడు, అవే అందరికంటే ముందు చూసి, నీళ్లల్లోకి దూకి ఒడ్డుకి యీదుకుపోతాయి! అంటే ఓడ ములిగి పోతుందని అర్థం. ఎలుకలు యేం మాట్లాడుకుంటున్నాయో వినండి!''

ఆ సమయంలో రెండు ఎలకలు యివతలికి వచ్చాయి - ఓ ముసల్దీ, ఓ పడుచుదీ. ముసలి యెలక పడుచు ఎలకతో అంది:

''రాత్రి నేను నా కన్నంలోకి తిరిగి వస్తూ వుంటే, ఓ బీటద్వారా నీళ్లు లోపలికి రావడం కనిపించింది. సరే, ఓడని వదిలి పెట్టాలి, యిది రేవు ములిగి పోతుంది అనుకున్నాను. యింకా అవకాశం వుండగానే నువ్వు ఓడని వదిలిపెట్టాలని నా అభిప్రాయం.''

అలా అని అవి రెండూ సముద్రంలోకి దూకాయి. ''అవునవును! నాకు గుర్తు వచ్చింది. ఓడ ములిగిపోయే ముందు ఎలకలు ఓడని వదిలేస్తాయి. మనం తక్షణం యీ ఓడని వదిలిపెట్టెయ్యాలి! లేకపోతే మనమూ దీంతోబాటు ములిగిపోతాం! జంతువుల్లారా! రండి! త్వరగా'' అన్నాడు డాక్టరుగారు.

ఆయన తన సామాను పోగుజేసుకుని గబగబా ఒడ్డుకి పరిగెత్తాడు. జంతువులు ఆయన వెంట వచ్చాయి. ఆయనా, అవీ చాలాసేపు యిసక ఒడ్డుమీద నడిచిం తర్వాత, అలసట వచ్చింది.

''కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుందాం. ఏం చెయ్యాలో ఆలోచిద్దాం'' అన్నాడు డాక్టరుగారు. ''యిక మన జీవితాంతం మనం యిక్కడే వుండిపోతామా?'' అంది తోపుడులాగుడు. అది యేడ్చింది.

 దాని నాలుగు కళ్లనుంచీ పెద్దపెద్ద కన్నీటి చుక్కలు కారాయి. జంతువులన్నీ తోపుడులాగుడుతోబాటు కలిసి యేడవటం మొదలెట్టాయి, వాటన్నిటికీ యింటికి తిరిగివెళ్లిపోవాలనే వుంది.

 అనుకోకుండా ఒక స్వాలో పక్షి వచ్చింది. ''డాక్టరుగారూ, డాక్టరుగారూ, పెద్ద అనర్థం సంభవించింది. సముద్రపు దొంగలు మీ ఓడని పట్టుకున్నారు'' అంది. డాక్టరుగారు ఒక్కసారి ఎగిరి నుంచున్నాడు.

 ''మా ఓడమీద వాళ్లేం చేస్తున్నారు?'' అని అడిగాడు.  ''వాళ్లు మీ ఓడని కొల్లగొట్టాలని చూస్తున్నారు. గబగబా అక్కడికి వెళ్లి వాళ్లని తరిమెయ్యండి'' అని చెప్పింది. ''వూహుకు!'' అన్నాడు డాక్టరుగారు చిరునవ్వు నవ్వుతూ. ''వాళ్లని తరిమెయ్యకూడదు. వాళ్లని మా ఓడమీద ప్రయాణం చెయ్యనీ, వాళ్లు యెక్కువ దూరం వెళ్లలేరు. నువ్వు చూద్దువుగాని. పోదాం పదండి. వాళ్లు మనల్ని చూడక ముందే వాళ్ల ఓడని మన ఓడకి బదులుగా లాగేసుకుందాం. పోయి సముద్ర దొంగల ఓడ తీసుకుందాం.'' డాక్టరుగారు ఒడ్డమ్మటే పరిగెత్తివెళ్లాడు. తోపుడులాగుడు, మిగతా జంతువులూ వెనకే వెళ్లాయి.

 తొందర్లోనే వాళ్లు సముద్ర దొంగల ఓడని చేరుకున్నారు. ఎవళ్లూ ఓడమీద లేరు. అందరూ నొప్పిడాక్టరుగారి ఓడమీదకి పోయారు. ''హుష్‌'' అన్నాడు డాక్టరుగారు. ''సద్దు చెయ్యద్దు, వాళ్లు మనల్ని చూడకుండా మనం వాళ్ల ఓడ యెక్కుదాం.'' ఒక దురదృష్టం తర్వాత యింకోటి జంతువులు యేం చప్పుడు చెయ్యకుండా ఓడ యెక్కాయి. చడీచప్పుడూ కాకుండా నల్ల తెరచాపలు యెత్తాయి. సముద్రంమీద ప్రయాణం అయ్యాయి. సముద్రపు దొంగలు యేమీ చూళ్లేదు.

యింతట్లోకీ పెద్ద దురదృష్టం సంభవించింది.

విషయం యేమంటే చిన్న పంది గుర్రుగుర్రుకి విపరీతమైన జలుబు చేసింది.       మిగతా వచ్చే సంచికలో..

వార్తావాహిని