యూనిట్

నొప్పిడాక్టరుగారు పనిచెయ్యడం

(గత సంచిక తరువాయి)

''అబ్బెబ్బే వీల్లేదు. మీరిక్కడ కొంత కాలం మా అతిధులుగా వుండాలి!'' అంది మత్స్యకారుడి భార్య. ''మేం చేపల్ని పడతాం. అప్పచ్చులు చేస్తాం. తోపుడు లాగుడికి తేనే తుట్టెల్ని యిస్తాం'' అంది.

''నేను సంతోషంగా యిక్కడ యింకొక రోజు వుంటాను'' అంది తోపుడు లాగుడు రెండు నోళ్లతోటి నవ్వుతూ.

''నేనూను'' అంది కికా.

''అలాగే నేను కూడా'' అంది బుంబా.

''సరే అయితే. నేనూ అందరితోబాటూ వుంటా'' అన్నాడు డాక్టరుగారు.

ఆయన, జంతువులన్నీ వెంట రాగా మత్స్యకారుడి యింటికి వెళ్లాడు.

అవ్వాకి బహుమతి రావడం

డాక్టరుగారు తోపుడు లాగుడు వీపెక్కి వూళ్లోకి వచ్చారు. ఆయన ముఖ్య వీధి గుండా వెళ్లేటప్పుడు గ్రామస్థులందరూ ఆయనకి అభివాదం చేసి,

''జాలిగుండె డాక్టరుగారు చిరకాలం వర్ధిల్లాలి!'' అని అరిచారు.

చౌకులో స్థానిక పాఠశాల పిల్లలు ఆయన్ని కలుసుకుని చక్కటి పువ్వుల గుత్తిని ఆయనకి బహుకరించారు.

అప్పుడొక మరుగుజ్జు ఆయన దగ్గర కొచ్చి

''మీ కుక్క అవ్వాని చూద్దామని వుంది నాకు'' అన్నాడు.

ఆ మరుగుజ్జు పేరు బంబుకో. ఆ వూళ్లోకల్లా వృద్ధుడైన గొర్రెలకాపరి అతనే. వూళ్లోవాళ్లందరూ అతన్ని గౌరవంగా చూస్తారు. అభిమానిస్తారు.

అవ్వా అతని దగ్గరికి పరిగెత్తివెళ్లి తోక ఆడించింది.

బంబుకో జేబులో నుంచి యెంతో ముచ్చటగా వున్న కుక్క తోలుపటకా తీశాడు.

''గౌరవనీయమైన అవ్వా, సముద్రపు దొంగలు యెత్తుకు పోయిన బెస్త వాణ్ణి కనిపెట్టినందుకు యీ ముచ్చటైన తోలుపటకాని నీకు కానుకగా మా గ్రామ వాసులం యిస్తున్నాం'' అన్నాడు.

అవ్వా తోక ఆడించి ''చాకా'' అంది.

మీకు గుర్తుండే వుండాలి, జంతుభాషలో అలా అంటే ''థాంక్సూ'' అని అర్థం.

మనుషులందరూ కుక్క తోలుపటకాని చూశారు. పెద్దపెద్ద అక్షరాలతో యిలా రాసి వుంది:

''యెంతో తెలివీ, జాలీ, ధైర్యంగల కుక్క అవ్వాకి''

నొప్పిడాక్టరు మూడ్రోజులు పెంటా తల్లిదండ్రుల్తో గడిపారు. చాలా సరదాగా

గడిచింది. అన్ని రోజులూ తోపుడులాగుడు తియ్యని తేనెపట్లు తింటూనే వుంది. పెంటా ఫిడేలు వాయించాడు. గుర్రుగుర్రు, బుంబాలు నాట్యం చేశాయి. కాని యింటికి వెళ్లే సమయం అయింది.

''సెలవ్‌'' అన్నాడు డాక్టరుగారు మత్స్యకారుడితోటీ, అతని భార్యతోటీ.

తోపుడులాగుడు వీపెక్కి ఓడ దగ్గరికి వెళ్లిపోయాడు.

మొత్తం గ్రామం అంతా ఆయనకి వీడ్కోలు చెప్పారు.

''మీరు మాతో వుండిపోతే మంచిది'' అన్నాడు మరుగుజ్జు బంబుకో.

''సముద్రపు దొంగలు సముద్రంమీద తిరుగుతున్నారు. వాళ్లు మీమీద దాడి చేస్తారు.

మిమ్మల్నీ మీ జంతువుల్నీ బందీలుగా పట్టుకుంటారు.''

''నాకు సముద్రపు దొంగలంటే భయం లేదు. మా ఓడ చాలా వేగంగా పోతుంది. మేం అన్ని తెరచాపల్నీ విడుస్తాం. దొంగలు మాతో అందుకోలేరు'' అన్నాడు డాక్టరుగారు.

యీ మాటలని డాక్టరుగారు సముద్రం మీద ప్రయాణం అయి వెళ్లిపోయాడు.

వూళ్లో వాళ్లందరూ రుమాళ్లు వూపి ''భేష్‌'' అంటూ వీడ్కోలు చెప్పారు.

సముద్రపు దొంగలు

డాక్టరుగారి ఓడ అలల మీద వేగంగా పోతోంది. మూడవ రోజున వాళ్లకి ఒక ద్వీపం కనిపించింది. చెట్లుగాని, మనుషులుగాని, జంతువులుగాని యేమీ లేవక్కడ. వూరికే యిసక, పెద్ద రాళ్లూ వున్నాయంతే. కాని వాటి వెనకాల భయంకరమైన సముద్రపు దొంగలు దాంకున్నారు. యేదేనా ఓడ ద్వీపం దగ్గరికి వస్తే, వాళ్లు దానిమీద దాడిచేసి, కొల్లగొట్టి, మనుషుల్ని చంపేసి ఆఖరికి ఓడని ముంచేస్తారు. డాక్టరుగారంటే ఆ దొంగలకి చాలా కోపంగా వుంది. ఆయన ఎర్రతల మత్స్యకారుణ్ణీ అతని కొడుకు పెంటానీ విడిపించాడు కదా. వాళ్లు చాలా రోజులుగా డాక్టరుగారి కోసం పొంచి వున్నారు.

వాళ్లకి పెద్ద ఓడ వుంది. దాన్ని ఓ పెద్ద బండరాయి వెనక దాచిపెట్టారు.

డాక్టరుగారు సముద్రపు దొంగల్ని కాని, వాళ్ల ఓడని కాని చూళ్లేదు. ఆయన తన జంతువుల తోటి ఓడపైన పచార్లు చేస్తున్నాడు. వాతావరణం బ్రహ్మాండంగా వుంది, మంచి యెండ కాస్తోంది. డాక్టరుగారు చాలా సంతోషంగా వున్నాడు. వున్నట్టుండి చిన్న పంది గుర్రుగుర్రు అంది:

''చూడండి యెలాంటి ఓడ కనిపిస్తోందో అక్కడ?''

డాక్టరుగారు చూశాడు.

నల్లగా మసి బొగ్గులాంటి తెర చాపలతో వుంది ఓడ.

ద్వీపం వెనకాలనుంచి వాళ్లకేసే వస్తోంది. నల్లగా, సిరాలా వుంది.

(ఇంకావుంది)

వార్తావాహిని