యూనిట్
Flash News
దొంగ కోరిక

రామాపురంలో
సుబ్బడు అనే దొంగ వుండేవాడు. అతను చాలా తెలివైన దొంగ. అసలు అతను దొంగ అని చాలా
మందికి తెలీదు. అందుకే రాజ భటులకు కూడా అతన్ని పట్టుకోవడం కష్టమైంది. అతను దొంగతనం
చేస్తుండగా ఎవరూ గమనించలేకపోయేవారు. అదీ అతని తెలివి. సాక్ష్యం లేనిదే దొంగతనం
రుజువు కాదు కదాని అతడి ధైర్యం. ఒక రోజు అతనికి ఒక ముసలవ్వ ఎదురయింది. ఆమె
అతనికంటే తెలివైనది. ఏదైనా పని చెబితే చేస్తానని, ఒంటరి దాననని, ఏదయినా సహాయం చేస్తూ నీ దగ్గరే,
నీ ఇంట్లో వుంటానని బతిమాలింది. సుబ్బడు దొంగ కనుక ఎవరినీ
నమ్మడు. అందుకే ‘‘నీకు పని దొరక్కపోతే వెళ్ళి రాజు గారిని
అడుగు. ఆయనే సాయం చేస్తారు ఫో’’ అన్నాడు. ముసలమ్మ రాజుని
కలిసింది. ‘‘సరే. సుబ్బడు అనే దొంగను దొంగతనం చేస్తుండగా
చూసి, సాక్ష్యం చెబితే నీకు బోలెడు వెండికాసులు ఇస్తా’’
అని చెప్పాడు రాజుగారు. సరేనని ముసలమ్మ దొంగ సుబ్బడిని వెదుకుతూ
వెళ్ళింది. చివరికి అదే గ్రామంలో కనిపించాడు. ‘‘ఏమైంది.
రాజు ఉద్యోగం చూపించాడా’’ అని సుబ్బడు ముసలవ్వని అడిగాడు.
‘‘అబ్బే లేదు. నీతో తిరుగుతా, వండి
పెడతా. నన్ను నీతో వుండనీ. నాయనా పెద్దదాన్ని అడుగుతున్నా’’ అని బతిమాలింది. సరేనన్నాడు. అతనితో కూడా ముసలవ్వ నడిచింది. ఎలాగయినా
అతడి దొంగతనం చూడాలని. సుబ్బడు ఒక సంచి తగిలించుకున్నాడు. రెండు చేతులకూ బాగా నూనె
పట్టించాడు. ‘‘ఇవాళ మంచి గారెలు, బూరెలు, అట్లు చేసుకుని తిందాం- బజారు వెళ్ళి
వద్దాం రా’’ అని ముసలామెతో బజారుకి వచ్చాడు. ప్రతి దుకాణం
బయట పప్పులు, ఉప్పులూ బస్తాలు తెరిచి వుంచారు చూసిన జనం
కొనడానికి. మినపప్పు, గోధుమలు, కందిపప్పు,
పెసరపప్పు, ఆవాలు, ధనియాలు - ఇలా అన్ని ధరలు అడిగి ముసలమ్మ బేరం ఆడుతోంది. ఈలోగా సుబ్బడు
నూనె చేత్తో ప్రతి పప్పు మీద చెయ్యి పెట్టి తీసి సంచిలోకి దులపడం, మళ్ళీ పప్పుల మీద చెయ్యి పెట్టడం, సంచిలో
దులపడం - ఇలా అన్ని పప్పులూ సంచిలోకి పోస్తున్నాడు. ప్రతి పప్పు మామూలుగా తాకి
దాని ధర అడుగుతున్నాడని దుకాణం వ్యాపారి అనుకున్నాడు. ముసలమ్మ బేరం చేస్తోంది.
బేరం కుదరక ఇంకో దుకాణానికి పోవడం - చివరికి ‘‘నా దగ్గర
డబ్బులు లేవు - చేసిన బేరం చాలు - పద ఇంటికి’’ అన్నాడు
సుబ్బడు ముసలామెతో. ముసలామె ఓ కంట సుబ్బడి దొంగతనం గమనించింది. ఇంటికొచ్చాక సంచిలో
కంది, మినప, పెసర ఇలా అన్ని ఏరి
దేనికది విడిగా పొట్లాలు కట్టి వంట చెయ్యమన్నాడు సుబ్బడు. హాయిగా ఇద్దరూ భోజనం
చేశారు. దొంగ సుబ్బడు నిద్రలో వున్నాడు కదాని ముసలమ్మ ముందుగానే నిద్రలేచి
రాజభటులకి చెప్పడానికి వెళ్ళింది. సుబ్బడు దొంగ నిద్ర మాని ముసలమ్మ బయటికి వెళ్ళాక
తనూ బయటికి వచ్చాడు. రాజభటులతో ముసలమ్మ వచ్చేసరికి దొంగ సుబ్బడు ఊరే కాదు, రాజ్యం కూడా దాటి వెళ్ళిపోయాడు. ముసలమ్మ అబద్దం చెప్పిందని రాజ భటులు
ఆమెను కోప్పడి వెళ్ళిపోయారు. ముసలమ్మ లబోదిబోమన్నది.