యూనిట్

తెలివిగల కూతురు

పూర్వం రామాపురంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్నకి బాగా ఆస్తి, డబ్బు వచ్చాయి. తమ్ముడు పేదవాడు. పిల్లలకి సరిగా పాలు, మజ్జిగ కూడా ఇవ్వలేని పేదవాడు. అందుకని అన్నగారు తమ్ముడికి ఒక ఆవు ఇచ్చాడు. ఐతే ‘‘నా దగ్గర ఇంటి పని, పొలం పనీ చేసి బాకీ తీర్చుకో’’ అని చెప్పాడు. వీళ్ళిద్దరూ బంధుత్వం వల్ల అన్నదమ్ములు, ఒకే తల్లిపిల్లలు కారు. అందుకే బాకీ తీర్చాలన్నాడు అన్న. తమ్ముడు చాలాకాలం వొళ్ళు అలిసిపోయేలాగ అన్న దగ్గర పనిచేసి, ఇక పని చేయలని స్థితిలో వున్నాడు. ‘‘సరే చేసింది చాలు. నా ఆవుని నాకు ఇచ్చేయ్యి’’ అన్నాడు అన్న. ఇంతకాలం చాకిరీ చేసేను గదా- ఇదే న్యాయం అని అడిగాడు తమ్ముడు. ఇద్దరికి పట్టుదల పెరిగింది. రాజు గారి దగ్గరకు వెళ్ళి న్యాయం చెప్పమని కోరారు. రాజు గారు బాగా తిక్క మనిషి- వీళ్ళకి న్యాయం చెప్పడం కన్నా తప్పించుకోడం నయం అనుకుని, నా రాజ్యం సరిహద్దులు దాటకుండా మూడు కాళ్ళ కుందేలుని పట్రండి - దొరకలేదని చెబితే చాలదు. ‘‘నాకు తగిన సమాధానం చెప్పకపోతే తలలు తీసేస్తా’’ అని అన్నదమ్ములకి చెప్పాడు. ‘‘చచ్చాంరా బాబు’’ మన తగవు ఇక లేనట్టే - ఆవు సంగతి వదిలేద్దాం - ముందు ఈ రాజు పెట్టిన చిక్కు తప్పించుకోవడం ఎలా?’’ అని అన్నదమ్ములు దిగులు పడ్డారు. తెల్లారేలోగా మూడు కాళ్ళ కుందేలు, లేదా తగిన కారణం... ఎలా దొరుకుతాయి? - అప్పుడు తమ్ముడి కూతురు అక్కడికి వచ్చింది. ఆ పిల్ల చాలా తెలివైంది. ‘‘ఏమైంది నాన్నా’’ అని అడిగింది. పిల్ల తండ్రి జరిగిందంతా చెప్పాడు. ఇంతేనా? సరే నన్ను రాజు గారి దగ్గరకు తీసుకుపోండి. నేను సమాధానం చెబుతా’’ అన్నది. మూడు కాళ్ళ కుందేలు ఈ భూమి మీద ఎక్కడా దొరకదని తెలుసు గనుక అన్నదమ్ములు అమ్మాయిని తీసుకుని రాజు గారి దగ్గరకు వెళ్ళారు. ‘‘ఏదీ కుందేలు? కుందేలు బదులు ఈ చిన్న పిల్లని తెచ్చారేం?’’ అనడిగాడు రాజు. ‘‘కుందేలు దొరకలేదు మహారాజా’’ అంది పిల్ల. ఐతే నాకు తగిన కారణం చెప్పి తీరాలి, లేకపోతే ఈ పిల్ల భవనంలో పనిపిల్లగా వుండాల్సిందే, సరేనా?’’ అని గద్దించాడు రాజు. తెలివైన అమ్మాయి వెంటనే కారణం చెప్పింది. ‘‘అయ్యా, మహారాజా - మీ మంచి పరిపాలనలో మనుషులకి, పిట్టలకీ రెండు కాళ్ళు, జంతువులకి నాలుగు కాళ్ళూ వున్నాయి. కుందేళ్ళకీ అంతే. తెలివి తక్కువ రాజులుంటే వాళ్ళ పాలనలోనే మూడు కాళ్ళ మనుషులు, కుందేళ్ళూ వుంటాయి’’ అన్నది తెలివైన పిల్ల. రాజుకి పెద్ద చిక్కే వచ్చింది. సమాధానం బాగులేదంటే తను తెలివితక్కువ వాడని అందరూ అంటారేమోనని అనుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు మనుషులు రాజు దగ్గరకు న్యాయం కోసం వచ్చారు. రెండు గుర్రాలు, ఒక అతి బుజ్జి గుర్రపు పిల్ల - ఆ బుజ్జి గుర్రపు పిల్ల నా గుర్రానిదే అని ఇద్దరు మనుషులూ దెబ్బలాడుకుని రాజు దగ్గరకు వచ్చారు. న్యాయం చెప్పాలి. రాజుకి బుర్ర పనిచేయలేదు - తెలివైన అమ్మాయిని ఇబ్బంది పెట్టి వదిలించుకుందామని రాజు ఆలోచించాడు. ‘‘ఏయ్‍ - అమ్మాయీ, నీ తెలివికి సంతోషించా కానీ - ఏదీ ఈ గుర్రపు పిల్ల తల్లి గుర్రం ఏదో చెప్పు. వెంటనే చెప్పాలి లేదా రాజభవనంలో పని పిల్లగా వుండాల్సిందే’’ అన్నాడు. చిన్నమ్మాయి నవ్వింది. వెంటనే గుర్రపు పిల్లని కొంచెం దూరంగా స్థంభానికి కట్టించమంది. రాజు అలాగే చేయించాడు. గుర్రపుపిల్ల గింజుకుని అరిచింది. వెంటనే రెండు గుర్రాల్లో ఒకటి వచ్చి స్థంభం దగ్గర గుర్రపు పిల్ల తల నాకింది. పాల పొదుగు అందేలాగ నిలబడింది. వెంటనే ‘‘మహారాజా - ఇదే తల్లి గుర్రం - కదలని ఆ గుర్రం కాదు - ఇదే ఇదే’’ అని చెప్పింది తెలివైన అమ్మాయి. రాజు తల దించుకున్నాడు. అన్నదమ్ములు, తెలివైన అమ్మాయీ చల్లగా ఇంటికి చేరుకున్నారు. వాళ్ళెప్పుడూ న్యాయం కోసం రాజు దగ్గరకి వెళ్ళలేదు. అన్న తన ఆవుని తమ్ముడి దగ్గరే వదిలేశారు. అమ్మాయిని ఊరంతా మెచ్చుకుంది.

వార్తావాహిని