యూనిట్

ముగ్గురూ ముగ్గురే

ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములుండే వాళ్ళు. ముగ్గురూ మూడు రకాల వాళ్ళు - అందుకే ముగ్గురూ విడివిడిగానే చిన్నచిన్న గుడిసెల్లో వుంటున్నారు. ముగ్గురూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి పొరుగున ఉన్న ఊళ్ళో అమ్ముకుని వచ్చిన డబ్బులతో తిని గడిపేసేవారు. ఒక రోజు ముగ్గురిలో పెద్దవాడు అడవికి వెళ్ళాడు. ఒక పెద్ద ఎండు చెట్టు కూలిపోయి వుంది. దాన్ని చిన్నచిన్న ముక్కలుగా నరుకుతోంటే చెట్టు తొర్రలోంచి ఒక చిన్న కుందేలు పిల్ల బయటికి వచ్చింది. చప్పుడుకి భయపడినట్టుంది అది. వెంటనే దాన్ని పట్టేశాడు అతను. అప్పుడు అక్కడ ఎక్కడి నుంచో, ఏమో ఒక ముసలవ్వ వచ్చింది. ఏదో మూట మోస్తూ వచ్చింది. నాయనా ఆ కుందేలు పిల్లని వదిలెయ్‍. ఇది అడవిలో వుండాల్సినది. దాన్ని వదిలేస్తే నీకో మంచి బాతునిస్తా - అది రోజూ బోలెడు గుడ్లు పెడుతుంది. ఒక కోడి పెట్టను ఇస్తా - ఇదీ రోజూ బోలెడు గుడ్లు పెడుతుంది. ఒక ఆవునీ ఇస్తా - అది రోజూ బిందెడు పాలిస్తుంది - ఇవన్నీ అమ్ముకుని హాయిగా బతుకు అన్నది. ‘‘అబ్బే - చాలదు. నాకో గేదె. దానికి సరిపడిన గడ్డీ ఇవ్వాలి. రెండు పెద్ద గుమ్మడి కాయలూ కావాలని అడిగాడు. కాస్సేపటిలో అతను కోరినవన్నీ అక్కడే కనిపించాయి. కుందేలుని మాత్రం వదల్లేదు... నువు చెప్పినట్టు నాకు డబ్బులొచ్చి, లాభాలు వచ్చాకా కుందేలుని వదిలేస్తా’’ అని వాటన్నిటినీ తీసుకుపోయాడు. ‘‘నీ సంగతి నేను చూస్తాలే’’ అంటూ ముసలమ్మ వెళ్ళిపోయింది. ఆ తరువాత ముగ్గురు అన్నదమ్ముల్లో రెండవవాడు అడవిలో అదే చెట్టు కొట్టి మరికొన్ని ఎండుకొమ్మలు తీస్తోంటే - చిన్న పక్షి గూడు, గుడ్డూ కనిపించాయి. అవి తీసుకోబోయాడు. అప్పుడు అక్కడికి ముసలమ్మ వచ్చింది. నాయనా గూటినీ, గుడ్డునీ, వదిలెయ్‍ - ఒక బాతుని, కోడిని, ఆవునీ ఇస్తానంది. ‘‘అవన్నీ నాకెందుకు - ఈ పక్షి గుడ్డు చాలు- గుడ్డులో పిల్ల. దాని పిల్లను కలిపి హాయిగా తింటా’’ అని గుడ్డు, కట్టెలూ తీసుకుపోయాడు ‘‘సరే నీ సంగతి చూస్తాలే’’ అని ముసలమ్మ సణుగుతూ వెళ్ళిపోయింది. ఆ తరువాత చివరివాడు. ఆ ముగ్గురిలో తమ్ముడు వచ్చాడు. మిగతా చెట్టు కొమ్మలు నరుకుతుండగా ఒక కొమ్మ నిండా చిన్న చిన్న పురుగులు బోలెడు కనిపించాయి. వాటిని దులిపి కట్టె తీసుకుందామనుకున్నాడు. అప్పుడు మళ్ళీ ముసలమ్మ వచ్చింది. ‘‘నాయనా ఒక పక్క కొమ్మ వదిలిపెట్టి మిగతా కట్టె తీస్కో - ఆ పురుగుల్ని బోలెడు పిట్టలు తింటాయి. నీ ఒక్కడి పొయ్యిలో కట్టెకోసం అన్ని పిట్టలు తినేవి పాడు చెయ్యకు’’ అన్నది. అంతేకాదు కోడిపెట్ట, బాతు, ఆవునీ ఇస్తానంది. అలాగే ఇచ్చింది. తమ్ముడు వాటిని తీసుకుని కట్టెని వదిలేసి ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజులకు ముసలవ్వ అన్నదమ్ములున్న ఊళ్ళోకి వచ్చింది. అన్నదమ్ముల ఇళ్ళు చూసింది. పెద్దవాడు తెచ్చుకున్న కుందేలుని, కోడి పెట్టనీ వండుకు తీనేశాడు. బాతుని అమ్మేశాడు. ఆవుని మేపలేక, పాలు తీసే ఓపిక లేక బద్దకం వల్ల ఆవుని అమ్మేశాడు. రెండో వాడు కట్టెలు ఇంట్లో పెట్టి, గుడ్డుని వండుకుని తిన్నాడు. మూడవవాడు - ముగ్గురిలో చిన్నవాడు కోడి వల్ల కోడిగుడ్లు, బాతువల్ల బాతుగుడ్లూ అమ్ముకుంటూ కాసిని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆవుపాలు తీసి తన కుటుంబానికి వాడి, మిగతా పాలు అవసరమైనవారికి ఇస్తున్నాడు. - మిగిలితేనే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముతున్నాడు. ఈ చిన్న ఆదాయం వలన కట్టెలు కొట్టి అమ్ముకునే శ్రమ తప్పింది. ఆ రోజు రాత్రి అన్నదమ్ములు ఇద్దరూ తమ్ముడు నిద్రపోయాక రాత్రివేళ రహస్యంగా ఆవు, కోడి, బాతు అడవిలోకి తోలుకుపోయారు. - వాటిని అక్కడ వదిలేసి ఏమీ ఎరగనట్లు ఇళ్ళకు తిరిగివచ్చారు. ముసలవ్వకు ఇదంతా తెలిసింది. ఆమె ‘‘సరే, చూడండి ఏం జరుగుతుందో’’ అని మెల్లగా అనుకుంది. తెల్లవారేకా తీరికగా అన్నదమ్ములు ఇద్దరూ తమ్ముడి గతి ఏమైందో, ఎలా ఏడుస్తున్నాడో చూద్దామని వెళ్ళారు. ఐతే వాళ్ళు ఆశ్చర్యపడి, ఏడుపు మొహాలు పెట్టుకున్నాడు. ఎందుకంటే.. వాళ్ళు అడవిలో వదిలేసిన ఆవు, బాతు, కోడితోపాటు ఒక మేక కూడా తమ్ముడి ఇంటిముందు ఎప్పటిలాగే వున్నాయి. రాత్రి నిద్రపోయి లేచిన తమ్ముడికి ఇదేమీ తెలియలేదు. కానీ ఒక మేక వచ్చి చేరడం ఆశ్చర్యం వేసింది. ‘‘పోనీ మీకు కావాలంటే మేకను తీసుకోండి’’ అని అన్నలకు చెప్పాడు. ... ‘‘మాకేం అక్కరలేదు, పో’’ అని కోపంగా ఇద్దరూ వాళ్ళ ఇళ్ళ దగ్గరకి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ ఆశ్చర్యపడి బోరుమని ఏడ్చారు. ఎందుకంటే ఇద్దరి ఇళ్ళు కూలి వున్నాయి.! అప్పుడు అక్కడ ముసలవ్వ కనిపించింది. ‘‘ఏడవకండి - మీకు మంచి బుద్ది ఎప్పుడొస్తే అప్పుడు మీకు మంచి ఇళ్ళు, వ్యాపారం వస్తాయిలే’’ అని వెళ్ళిపోయింది.

వార్తావాహిని