యూనిట్

వెల్లువెత్తిన సామాజిక సేవా స్ఫూర్తి

కార్తీక మాసం పురస్కరించుకొని కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసల దీవి సాగరసంగమం వద్ద సముద్ర స్నానాలు ఆచరిస్తున్న నలుగురు యువతులు అలల తాకిడిలో చిక్కుకున్నారు. ఇది గమనించి ఇతర భక్తులు ఆర్తనాదాలు చేయగా, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్‌ బి. ఆనందరాజు విని, వెంటనే సముద్రంలోకి దూకి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. సత్వరమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి కోలుకునేలా చేశాడు.

కృష్ణా జిల్లా మోపిదేవి ఆలయ పూజారి గ్రామ సమీప కాలువలో ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. సమాచారం తెలిసి తక్షణమే అక్కడకు చేరుకున్న ఎస్‌ ఐ సందీప్‌,  నీటి పారుదల శాఖ వారితో నీటి సరఫరా తగ్గించమని చెప్పారు. సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో తాళ్ళు కట్టుకుని తనే స్వయంగా కాలువలోకి దిగి పూజారిని రక్షించారు. సాహసోపేతమైన విధినిర్వహణతో అమూల్యమైన ప్రాణాలు కాపాడిన హోంగార్డ్‌ బి. ఆనందబాబు, ఎస్‌ ఐ సందీప్‌లకు అభినందనలు.

విజయనగరం జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 1990 బ్యాచ్‌ కానిస్టేబుల్స్‌ సమీప అనాథ శరణాలయంలోని 53 మంది బాలలకు ఎస్పీ పాలరాజు చేతుల మీదుగా నూతన దుస్తులు అందజేయడమే కాకుండా, వాటర్‌ ప్లాంట్‌ కూడా వితరణ చేసారు. ఆ బాలలకు చక్కని భోజనం ఏర్పాటు చేసి, వారి ముఖాలలో సంతోషాలను పూయించారు.

శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారిపై మతి స్థిమితం లేక తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు చేరదీసి, క్షవర, స్నాన సంస్కారాదులు చేయించి, కొత్త దుస్తులు ధరింపజేసి సంరక్షణకై నిర్మలా సదన్‌లో ఆశ్రయం కల్పించారు.

అదే విధంగా మతిస్థిమితం లేని మహిళను తిరుపతి షీ టీమ్స్‌ వారు చేరదీసి సంస్కరించి కోలుకున్న తరువాత ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

కోల్‌కతాలో జరిగిన 19వ ఆలిండియా పోలీస్‌ లాన్‌ టెన్నిస్‌ చాంఫియన్‌ షిప్‌లో చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి రాం కుమార్‌, పంజాబ్‌ డిఎస్‌పి ఆశిష్‌ కపూర్‌తో కలిసి సంయుక్తంగా డబుల్స్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి 'సీ స్విమ్మింగ్‌' పోటీలలో మన రాష్ట్రం తరఫున పాల్గొన్న విజయవాడ సిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ తులసి చైతన్య బంగారు పతకం సాధించాడు. వీరితో పాటుగా వివిధ క్రీడా పోటీలలో ప్రతిభ కనపర్చిన పోలీసు క్రీడాకారులు కూడా రాష్ట్ర డిజిపి శ్రీ ఆర్‌పి ఠాకుర్‌గారిని మర్యాదపూర్వకంగా కలసి డిజిపిగారి అభినందనలు అందుకున్నారు.

 

వార్తావాహిని