యూనిట్

సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ముందుకు...

రాష్ట్ర డిజిపిగా మరియు సురక్ష చీఫ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గారికి పోలీసు కుటుంబాలు, 'సురక్ష' తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్‌ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌గా బదిలీపై వెళుతున్న డిజిపి 

శ్రీ ఆర్‌.పి.ఠాకుర్‌గారికి భవిష్యత్‌ ఉజ్వలంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ.. వీడ్కోలు పలుకుతున్నాము.

నవ్యాంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రిగా అభిషిక్తులైన శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారికి పోలీసుశాఖ నుండి హార్థిక శుభాకాంక్షలు అందజేస్తున్నాము. రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్‌ సవాంగ్‌ గారి నేతృత్వంలో యావత్‌ పోలీసుశాఖ నూతన ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారమందిస్తూ.. అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. 

క్లిష్టమైన నేరాలను అత్యంత ప్రతిభావంత నైపుణ్యాలతో పరిష్కరించి నాటి డిజిపి శ్రీ ఆర్‌.పి. ఠాకుర్‌గారి చేతులమీదుగా ఎబిసిడి (అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ క్రెయిమ్‌ డిటెక్షన్‌) పురస్కారాలను అందుకున్న దర్యాప్తు బృందాలకు నా అభినందనలు. సునిశిత పరిశీలన, శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యాల మేళవింపుతో కేసులను పరిష్కరించిన ఈ పరిశోధన బృందాల పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకం. కేంద్రహోంశాఖ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్‌ల నిర్వహణ, సిబ్బంది పనితీరు ఆధారంగా అత్యుత్తమ ప్రమాణాలను పాటించే పది పోలీస్‌స్టేషన్‌లను గుర్తించి అవార్డులతో సత్కరిస్తుంది. విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ ఘనతకు కారకులైన సీతానగరం పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, జిల్లా ఎస్‌.పి. ఏఆర్‌ దామోదర్‌ల కృషి అభినందనీయం.

విజయనగరం జిల్లా వేపాడు మండలం వాయిల్పాడుకు చెందిన జస్విన్‌ అనే బాలుడు ఓ ఫంక్షన్‌ సందర్భంగా ఉంచిన వేడి సాంబారులో ప్రమాదవశాత్తు పడి ఒళ్ళంతా తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్న ఆ కుటుంబం గురించి తెలిసి విశాఖసిటీ 2009 కానిస్టేబుళ్ళు రూ.35వేలు సేకరించి వైద్యఖర్చుల నిమిత్తం బాలుడి తల్లిదండ్రులకు అందించారు. ఇటువంటి మానవతా దృక్పథంతో కూడిన కార్యక్రమాలు పోలీసుశాఖపై ప్రజలలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడింప చేయడానికి దోహదపడతాయి. 

అంతకంతకు విస్తృతమవుతున్న ఆధునిక విజ్ఞానాన్ని సక్రమంగా వినియోగిస్తే అద్భుత సానుకూల ఫలితాలు సాధించవచ్చని నిరూపించే మరో ఘటన ఇది. కర్నూలు నగరంలో ఓ వ్యక్తి రూ.7లక్షల నగదు ఉన్న బ్యాగును తను ప్రయాణించి వచ్చిన ఆటోలో మరిచి పోయి ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే గుర్తువచ్చి బయటకు వచ్చి వెతకగా ఆటో దొరకలేదు, సమాచారం తెలిసి వచ్చిన పోలీసులకు బాధితుడు ఏ చిన్న ఆధారం ఇవ్వలేక పోయినప్పటికీ, ఆ యింటి సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. 'అసుర' అని ఆటోపై రాసిఉండడంతో తీవ్ర అన్వేషణ అనంతరం ఆటోను గుర్తించి అందులో ఉన్న నగదు బ్యాగును స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. వీలైనంత ఎక్కువగా సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడం వల్ల భద్రత పరమైన రక్షణ కల్పించుకోవడంతోపాటు, నేరాల కట్టడి, పరిష్కారానికి కూడా ఉపయుక్తంగా ఉంటాయి. 

 

వార్తావాహిని