యూనిట్

పదునెక్కిన పరిశోధనలకు పురస్కారాలు...

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జషిత్‌ కిడ్నాప్‌ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. కిడ్నాప్‌ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ నయీం అస్మీ 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పక్క సిసి కెమెరా పుటేజీలు ఇతర సాంకేతిక అంశాల ఆధారాలతోనూ మరో పక్క ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూ బాలుని ఆచూకీకి ప్రయత్నాలు చేశారు. పోలీసుల నుండి తప్పించుకునే అవకాశం వుండదని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు అనపర్తి మండలంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని వదిలి వెళ్లారు. సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాలుడిని చేరుకుని స్వయంగా అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కిడ్నాపర్ల ఆచూకీ కోసం జిల్లా పోలీసులు కొనసాగిస్తున్న ముమ్మర ప్రయత్నాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. 

భారీ ఎత్తున దొంగనోట్లు ముద్రిస్తూ, చలామణి చేస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం పై ప్రత్యేక బృందాన్ని నియమించి కుప్పం మండలం సామగుట్టపల్లిలో గుట్టుగా దొంగనోట్లను ముద్రిస్తున్న ముఠాపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ. 2,76,22,000/- విలువ చేసే దొంగనోట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ టాప్‌లు, ప్రింటర్లు మరియు ఇతర సామాగ్రి స్వాధీనపర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే ఒక కుటిల యత్నాన్ని సమర్ధవంతంగా, ప్రశంసాత్మకంగా చిత్తూరు పోలీసులు అడ్డుకున్నారు. 

కడప ఇందిరా నగర్‌కు చెందిన పదో తరగతి చదివే విద్యార్థులు కొందరు షికారుగా సమీప పాలకొండలకు వెళ్ళారు. వారిలో ఒకరు అక్కడి తేనె తుట్టెను రాయితో కొట్టడంతో ఒక్కసారిగా తేనె టీగలు వారిపై దాడి చేశాయి. మిగతా వారు తప్పించుకోగా ఒక విద్యార్థి చిన్న లోయలో పడి, కాలు విరిగి మూడు గంటలకు పైగా నరకయాతన పడ్డాడు. సమాచారం తెలిసిన రిమ్స్‌ ఎస్సై విద్యాసాగర్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని విద్యార్థిని రక్షించారు. అతనిని స్వయంగా తన భుజాలపై కిలోమీటరున్నర దూరం కొండ మార్గంలో మోసి, 108 అంబులెన్స్‌ సహాయంతో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఎస్సై విద్యాసాగర్‌ సాహసాన్ని, సేవా గుణాన్ని స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. 

ఎంతో క్లిష్టమైన కేసులను అత్యుత్తమ పరిశోధనా ప్రమాణాలతో ఛేదించినందుకు గాను మూడు దర్యాప్తు బృందాలు ఎబిసిడి (అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ క్రైమ్‌ డిటెక్షన్‌) పురస్కారాలను దక్కించుకున్నాయి. విశాఖపట్నం సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ బృందం మొదటి బహుమతిని, విజయనగరం సీసీయస్‌ బృందం ద్వితీయ బహుమతిని, కడప జిల్లా రైల్వే కోడూరు పోలీస్‌ స్టేషన్‌ బృందం తృతీయ బహుమతిని డిజిపి శ్రీ. డి. గౌతమ్‌ సవాంగ్‌ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని దర్యాప్తు బృందాలు క్లిష్టతర కేసులను పరిష్కరించి ఆదర్శంగా నిలుస్తాయని ఆశిద్దాం. 

ఇటీవల 'మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా' వారు గోవాలో 'మొదటి నేషనల్‌ ఉమెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ 2019' ను నిర్వహించారు. ఈ పోటీలలో గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్సై శ్రీమతి సంపూర్ణ 55 సంవత్సరముల కేటగిరిలో హేమర్‌ త్రో విభాగం నందు పాల్గొని ద్వితీయ స్థానం సాధించారు. వీరి క్రీడా నైపుణ్యం వర్ధమాన క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ ... అభినందనలు తెలియజేస్తున్నాను. 

వార్తావాహిని