యూనిట్

పర్వతారోహణలో విశేష ప్రతిభ చూపుతున్న అదనపు ఎస్పీ రాధిక

చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ రాధిక పర్వతారోహణలో అరుదైన ఘనతను సాధించారు. యూరప్‌ ఖండంలోనే అతి ఎత్తయిన రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసారు. ఈ బృహత్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని చిత్తూరు చేరుకున్న రాధికకు పోలీస్‌ శాఖ ద్వారా సాదర స్వాగతం లభించింది. జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాధికను ఘనంగా సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించి, రాష్ట్ర పోలీస్‌ ప్రతిభా సామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. గత ఏడాది మే నెలలో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ (8848 మీటర్లు) శిఖరాన్ని ఆమె అధిరోహించారు. అదే ఏడాది ఆగష్ట్‌లో ఆఫ్రికా ఖండంలోని ఎత్తయిన పర్వతం కిలిమంజోరో (5895 మీటర్లు)ను అధిరోహించారు.

ఈ ఏడాది మార్చ్‌లో అస్ట్రేలియా ఖండంలో ఎత్తయిన పర్వతం కోసియాజ్కో (2228 మీటర్లు)ను ఎక్కారు. తాజా ఎల్‌బ్రస్‌ అధిరోహణ నాలువగ ఘనత. ఈ పర్వతారోహణలో రాధిక ఎన్నో క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ పర్వతారోహణకు ఉత్తర, దక్షిణ మార్గాలు ఉన్నాయి. దక్షిణ మార్గంలో లగేజ్‌ మోసుకురావడానికి కొన్ని అవకాశాలు కల్పించబడి వుంటుంది. వరదల కారణంగా ఆ మార్గం మూతపడింది. ఉత్తర మార్గంలో ఎవరి లగేజ్‌ వారే మోసుకుని ఎక్కాల్సిందే. అయినప్పటికీ మరో ఆలోచన చేయకుండా కష్టసాధ్యమైన ఉత్తర మార్గంలోనే శిఖరం ఎక్కి, దిగారు.

ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్టు ఎక్కిన అనుభవం వుండడంతో ఎల్‌బ్రస్‌ అధిరోహణకు పరిస్థితులు అనువుగా లేకపోయినా వెనుకంజవేయలేదు. దక్షిణ అమెరికాలోని అకోంకాగావ్‌ పర్వతాన్ని, ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాల్‌, అంటార్కిటికాలోని మౌంట్‌ లిప్సన్‌లను వచ్చే రెండేళ్ళలో అధిరోహించి ఏడు ఖండాలలోని ఎత్తయిన శిఖరాలు ఎక్కిన మహిళా పోలీస్‌ అధీకారిగా, మహిళలకు స్ఫూర్తి నిచ్చే స్థానంలో నిలవాలన్నది నాలక్ష్యం అని రాధికా అన్నారు. విభిన్నమైన సవాళ్ళతో కూడిన పర్వతారోహణలో ఒక మహిళగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పడం ద్వారా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా రాణించగలరని రాధిక నిరూపిస్తున్నారు.  

వార్తావాహిని