యూనిట్
Flash News
పోలీసు గృహిణులకు ప్రత్యేకం - ఆకాశం నినదిస్తోంది

పోలీసు గృహిణులకు ప్రత్యేకం
- ఆకాశం నినదిస్తోంది
ఎర్రని బాల సూర్యుడు పెద్ద కమలాపండులా
తూర్పు దిక్కున పైకి లేస్తుంటే, కోడి పుంజులు ఠీవిగా
మెడలు నిక్కపొడుచుకుని మరీ ''కొక్కొరోకో'' మంటూ తెల్లారిపోయిందని తట్టి లేపుతుంటే, చల్లని పిల్లగాలుల సోయగానికి
నిద్రలేవడానికి బద్ధకిస్తూ ''మరో ఐదు నిమిషాలు
పడుక్కుంటానమ్మా'' అని పిల్లలు
ముసుగుతన్నుతూ వుంటే, తల్లి రేడియో తిప్పి
భక్తి రంజని పాట వినిపిస్తే, మత్తంతా వదిలి ఠకీమని
లేచి కూర్చునేవాళ్ళం. మా చిన్నప్పుడు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్త్రీల
పాటలలో సేకరించిన సూర్యుడి పాటకి ఆయనే సంగీతం సమకూర్చి ఆయనే పాడిన పాట ఇది.
శ్రీసూర్యనారాయణా - మేలుకో - హరి
సూర్యనారాయణ
పొడుస్తు బాలుడూ పొగడ పూవూ ఛాయ
పొగడపూవూ మీద పగడంపు పొడి ఛాయ ||శ్రీసూర్య||
మధ్యాహ్న బాలుడూ మల్లెపూవూ ఛాయ
మల్లెపూవూ మీద వజ్రంపు పొడి ఛాయ ||శ్రీసూర్య||
గుంకుతూ బాలుడూ గుమ్మడీపూఛాయ
గుమ్మడీ పూమీద గురివింద పొడి ఛాయ ||శ్రీసూర్య||
ఇలా సూర్యుడి పాటతో లేలేత
సూర్యకిరణాలలోని నులి వెచ్చదనం మనస్సును తాకుతుంటే రోజు మొదలయ్యేది. ఆ రోజుల్లో
నైతే మొన్నటి నిన్నటి తరాల మాట - గోడకి పెద్దగా గంటలుకొట్టే గడియారమూ, పడుక్కునే చోట చిన్న బల్ల మీద చిన్న
గడియారం - నిద్రలేపటానికి - (అలారంపీస్ అనేవాళ్ళం) చేతికి వాచీ, ఏదో ఒక రవివర్మ చిత్రపటం - మధ్యతరగతి
కుటుంబంలో తప్పక ఉండేవి. గంటలవారీగా రేడియో కార్యక్రమాలని స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళేంతవరకూ - పనులు
చేసుకుంటూ వినేవారం. ఠంచనుగా 7 గంటలకి ''ఆకాశవాణి వార్తలు
చదువుతున్నది పన్యాల రంగనాథరావ్ - తిరుమలశెట్టి శ్రీరాములు - కొత్తపల్లి
సుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురూ అద్భుతమైన వాచికంతో, మంచి ఉచ్ఛారణతో ఢిల్లీ నుంచి వార్తలు చదివేవారు. విజయవాడ, హైద్రాబాద్ రేడియోలలో కార్యక్రమాలూ, నాటకాలూ, కవితలూ చదివే వారంతా ఆనాటి పేరుమోసిన మహా మేధావులే. గొప్ప కవులూ, సినీకవులయిన దాశరథి గారూ (ఆయన
పూర్తిపేరు దాశరథి కృష్ణమా చార్యులు), దేవులపల్లి వేంకట
కృష్ణశాస్త్రి గారూ, మహా సంగీత
విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారూ, బాలాంత్రపు నళినీ
కాంతరావ్, బాలాంత్రపు రజనీకాంతరావు లాంటి మహామహులు
రేడియోని ఏలారు. శని, ఆదివారాలు పిల్లలకి, పెద్దలకీ పెద్ద ఆటవిడుపు. మరి సందడే
సందడి. న్యాయపతి రాఘవరావు గారు రేడియో అన్నయ్యగా, న్యాయపతి కామేశ్వరిగారు - ఆయన భార్య - రేడియో అక్కయ్యగా మద్రాసులో 'బాలవినోదం', 'బాలానందం' అనే పిల్లల కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో ప్రముఖ చిత్రకారుడూ, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బాపూ, గొప్ప సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ
కూడా పాల్గొనేవారు మద్రాసులో.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్లో శనివారం'బాలానందం', ఆదివారం 'బాలవినోదం' కార్యక్రమాలు ప్రసారం చేసేవారు. ''రారండోయ్! రారండోయ్! పిల్లల్లారా
రారండోయ్! హైదరాబాదు బాలలమూ! జైహింద్ అంటూ పిలిచామూ'' అంటూ మొదలయ్యే రేడియో అన్నయ్య గారి ''బాల వినోదం'' పిల్లలూ, పెద్దలూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసే కార్యక్రమం ఇది. ఆదివారం
మధ్యాహ్నం 3 గం|| నుంచీ 4 గం|| వరకు ఒక నాటకం
వచ్చేది. హైదరాబాద్లో నయితే శ్రీ నండూరి విఠల్, శ్రీమతి శారదా శ్రీనివాసన్, విజయవాడ నుంచి శ్రీ
బందా కనక లింగేశ్వరరావ్ గారు, శ్రీ నండూరి
సుబ్బారావు గారు, వి.వి. కనకదుర్గ, నాగరత్నమ్మ, సీతారత్నమ్మ, శ్రీ కత్తుల వెంకటేశ్వరరావు (రసన సమాఖ్య
అధ్యక్షుడు - గణేశ్ పాత్రో ప్రముఖ నాటక రచయిత, మామగారు) తమ
అద్భుతమైన వాచికంతో నాటకాలనీ, సినీ నటులు
దిగదుడుపుగా, ఆద్యంతం రక్తి కట్టించేవారు. సంస్క ృత
పరిచయంతో శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రిగారు, శ్రీ మరింగంటి
శ్రీరంగాచార్య, మహా మహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల
రామచంద్రుడు గారు (ఈయన మా గురువు గారు) సంస్క ృతము నేర్పుతూ, అనేక కావ్యాలనీ పరిచయం చేసిన
ధన్యాత్ములు. సంగీత కచేరీలలో ఆనాటి మహా విద్యాంసులు పాడేవారు. ఇవికాక ఒక గంట
చలనచిత్రం, వారానికొకసారి, రోజూ శ్రోతలు కోరిన సినిమా పాటలూ
ఉండేవి. అవి కంప్యూటర్లూ, మొబైల్ ఫోన్లూ లేని
రోజులు. చాలామంది ఇళ్ళలో లాండ్ లైన్ కూడా ఉండని రోజులు. రేడియో ఎంతో విజ్ఞాన, వినోదాలని పంచి ఇచ్చేది. మధ్యాహ్నం 12.30 గం||లకు కార్మికుల
కార్యక్రమం ప్రసార మయ్యేది. ఇందులో పెద్దయ్యగా ఉషశ్రీ గారు,(పురాణ పండ వెంకట దీక్షితులు, రామాయణ, భారత కథలకి ప్రాచూర్యం కలిగించిన గొప్ప రచయిత) పెద్దక్కగా రతన్
ప్రసాద్ గారు, రాంబాబుగా డి.వెంకట్రామయ్య గారు
హాస్యాన్ని పండిస్తూ చక్కని సందేశాలను అందించేవారు. ఆతర్వాత కాలక్రమేణా ఈ పాత్రలే
చిన్నక్క, ఏకాంబరం,బాలయ్యగా బాలలకు మార్చారు. అంతేకాకుండా సాయంత్రం గ్రామస్తుల
కార్యక్రమం ప్రసారమయ్యేది. విజయవాడ కేంద్రం నుండి బావగారి కబుర్లు కార్యక్రమాన్ని
సి. రామ్మోహన్ రావు, గాడేపల్లి
సూర్యనారాయణ నిర్వహించే వారు. వినోదాల వీరయ్య కార్యక్రమాన్నీ, హరికథలనీ ప్రయాగ నర్సింహ శాస్త్రి గారు నిర్వహించేవారు. 1971లో తెలుగు వివిధ భారతి మొదలైంది.
ప్రాయోజిత కార్యక్రమాలు కూడా ఉండేవి. వీటికి ప్రైవేట్ ఏజెన్సీల నుండి నాటకాలు, నాటికలు తీసుకొని ప్రసారం చేసేవారు.
మహిళా కార్యక్రమాలు ('రంగవల్లి', 'మహిళా సమాజం') పేరున రోజూ 1:30కి మహిళా కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.
వీటిని న్యాయపతి కామేశ్వరిగారు నిర్వహించేవారు. ఉద్యోగినుల వికాస కార్యక్రమం 'సమత' అనే పేరుతో
నిర్వహించేవారు. 'గ్రామలక్ష్మి' పేరుతో గ్రామీణ స్త్రీల కార్యక్రమం
రాత్రి వచ్చేది. ఈ కార్యక్రమాన్ని తురగా జానకీరాణి నిర్వహించేవారు. ఈవిడే తరువాత 'బాలానందం' 'బాలావినోదం' కార్యక్రమాలకు రేడియో
అక్కయ్యగా
వ్యవహరించారు.
పైగా ఈనాడు రేడియోలలో పూర్తిగా
మృగ్యమైపోయిన గీతాలు ఆనాడు యావన్మంది ప్రజలని, దేశభక్తి ఉద్వేగంతో
కుదిపేసి ఉత్తేజపరిచిన దేశభక్తి ప్రబోధ గీతాలు రేడియోలో కోకొల్లలుగా వచ్చేవి.
అప్పట్లో వింజమూరి శివరామారావు గారు (ఈయన ప్రముఖ కవి కృష్ణశాస్త్రిగారి మేనల్లుడు), మధురాంతకం రాజారాంగారు, యండమూరి సత్యనారాయణరావుగారు అనేక
దేశభక్తి గీతాలు రాసేవారు. పులికంటి కృష్ణారెడ్డిగారు రాసీ, ఉపద్రస్త కృష్ణమూర్తిగారు స్వరపరిచిన ''విశాల భారత దేశమిది, హిమాలయాలకు నిలయమిది'' గీతము, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు రాసిన ''నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, సురలోక మెక్కడుంది'', పాట, వారి కుమారుడు ఇంద్రగంటి శ్రీకాంత్శర్మగారు
రాసిన 'తేనెల తేటల మాటలతో మన దేశమాతనే
కొలిచెదమా' ఈ పాటను శ్రీ ఎంఎస్ శ్రీరామ్
స్వరపరిచారు, పాట, ఇలా ఎన్నో పాటలు
ప్రతి వారిలోను దేశభక్తిని
ఉద్దీపింపజేశాయి. 1962లో చైనా యుద్ధం జరినప్పుడు 'పాంచజన్య శంఖము - ప్రపంచ
ధార్మికాంఖము/ఆది దేవుడార్థవనుడు ఊదే రణాంగనమ్మున అంటూ' శంఖాన్ని పూరించి కదం తొక్కుతూ, పదంపాడుతూ దేశం కదిలేటట్టుగా ప్రజల్ని
సాయుధ చిత్తుల్ని చేసి, దేశభక్తి దొంతరలుగా
పెంచిన ప్రబోధ గీతికలు ఎన్నో వచ్చాయి. ఇలాంటి ఉద్బోధ గీతాలే దురదృష్టవశాత్తు ఈనాడు
చాలామంది విద్యార్థులలో వెర్రితలలు వేస్తున్న దేశవ్యతిరేకతా భావాలు పొరపాటున కూడా
చొరకుండ చేశాయి. 'ప్రతి భారతీయుడులోను
కూడ ప్రప్రథమంగా నేను భారతీయుడుని, 'అని దేశభక్తి భావన
ఊపిరిపోసే దేశభక్తి గీతాలు రావాలి' మొబైల్, వాట్సాప్, ట్విట్టర్ల సంస్కృతి పూర్తిగా తగ్గి
ప్రతిభారతీయుడి గుండె దేశభక్తి లబ్డబ్లతో కొట్టుకోవాలి.
అసలు ఇంతమందిని గతంలో బాగా అలరించీ, ఇప్పటికీ మురిపిస్తున్న రేడియో కథా
కమామీషూ ఏమిటంటే - 1860 సం||లో స్కాటిష్ భౌతిక
శాస్త్రవేత్త అయిన James Clark Maxwell ఈ రేడియో తరంగాల
ఉనికిని ముందే ఊహించి చెప్పాడట! 1866 సం||లో అమెరికాలో Mahlon Loomis అనే దంత వైద్యుడు Wireless Telegraphyకు ని విజయవంతంగా ప్రదర్శించాడట!
ఎలాగంటే లూమిస్ ఒక మీటర్ని ఒక గాలి పటానికి అమర్చి, మరో గాలిపటాన్ని ''పదపదవే వయ్యారి గాలిపటమా'' అని కదిలించ గలిగాడట! 1886లో జర్మన్ భౌతిక శాస్త్రవేత్త Henrich Rudolph Hertz ఎలక్ట్రిక్ కరెంటులో వేగంగా పొందే
మార్పులు స్పేస్లో రేడియో తరంగాలుగా పంపవచ్చని నిరూపించాడు. ఇటలీ దేశస్థుడైన Guglielme Marconi అనే భౌతిక శాస్త్రవేత్త Hertz ప్రతిపాదించిన రేడియో తరంగాలకి
ఆకర్షితుడై 1895లో వైర్లెస్ సిగ్నల్ పంపించాడు. 1896లో ఈ సిగ్నల్ని ఒక మైలు దూరం
పంపించాడు. 1898లో మార్కొని ఇంగ్లండు వెళ్ళిపోయి ఒక
స్పోర్ట్స్ ఈవెంట్ని మొట్టమొదటిగా బ్రాడ్కాస్ట్ చేశాడు. 1899లో జురరవఞ తో తన రేడియో ఫ్యాక్టరీని
ప్రారంభించి ఆవిధంగా ఫ్రాన్స్కి, బ్రిటన్కీ లంకె
కుదిర్చాడు. అతని వైర్లెస్ టెలిగ్రాఫ్ సిగ్నల్స్ని ప్రసారం చేసింది 1909లో భౌతిక శాస్త్రంలో మరొకరితో కలసి
నోబెల్ ప్రైజ్ మార్కొని అందుకున్నాడు. 1921లో రేడియోలో ''వాణి'' - గొంతు వినిపించాడు. 1922లో మార్కొని షార్ట్వేవ్
ట్రాన్స్మిషన్ని ప్రవేశపెట్టాడు.
మొట్టమొదట ఈ రేడియోని ఒక ఓడ నుంచి మరో
ఓడకూ, ఒక ఓడ నుంచి తీరం వరకూ సమాచారం అందించేటందుకు
ఉపయోగించేవారు. సముద్రంలోని భయంకర ఆటుపోట్లూ, ఓడ మునకల గురించి
చెప్పటానికీ వైర్లెస్ ఎక్విప్మెంట్ని ఉపయోగించేవారు. 1899 అమెరికా ఆర్మీ (సైన్యం) వైర్లెస్
కమ్యూనికేషన్ని ప్రవేశపెట్టింది. తర్వాత నేవీ కూడా ఈ వైర్లెస్ సిస్టంని
అనుసరించింది. తమాషా ఏమిటంటే అంతవరకూ నేవీ వార్తలు చేరవేయటానికి Homing Pigeons (పావురాలు)నీ, Visuar Signalling నీ ఉపయోగించేది. మొట్టమొదటి సారిగా
అమెరికాలోని Massachusetts లోని మార్కొనీ స్టేషన్ బ్రిటిష్
చక్రవర్తి
Edward VII అమెరికన్ ప్రెసిడెంట్ Theodore Roosevelt పంపుకున్న గ్రీటింగ్స్ని 1905 సం||లో అందించింది. కూవవ Lee De Forest అనే శాస్త్రవేత్త ఈ వైర్లెస్ సిస్టమ్కి
మొదటిసారిగా 'రేడియో' అని పేరు పెట్టాడు. ఆయనే AM Radio కనిపెట్టి అనేక రేడియో స్టేషన్లు ప్రసారం చేసే వీలు కలిగించాడు.
భారత దేశంలో ప్రప్రధమంగా 1924లో మద్రాసులో (చెన్నై)లో బ్రాడ్
కాస్టింగ్ మొదలైంది. ఇది అప్పటి మద్రాసులోని ఒక ప్రైవేటు రేడియో సర్వీస్. తర్వాత
బ్రిటిష్ ప్రభుత్వం 'ఇండియన్ బ్రాడ్
కాస్టింగ్ కంపెనీ' అనే ప్రైవేటు
కంపెనీగా బొంబాయి (ముంబై), కలకత్తా (కోల్కతా)లో
రేడియో స్టేషన్లు నెలకొల్పటానికి అనుమతి మంజూరు చేసింది. ఈ కంపెనీ 1930 సం||లో దివాలా తీసింది.
ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహణలో ఈ కంపెనీ
ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్గా రూపొందింది. 1936 సం||లో ఈ కార్పొరేషన్నే 'ఆల్ ఇండియా రేడియో' అనే పేరుతో పిలిచారు. డిపార్ట్మెంట్
ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రేడియో
నడిచేది. 1947 సం|| భారత దేశం
స్వాతంత్య్ర ఊపిరిని పీల్చుకున్నాక ఆల్ ఇండియా రేడియోను మినిస్ట్రీ ఆఫ్
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ తన నిర్వహణలోనికి తీసుకుంది. భారతదేశ మొట్టమొదటి ప్రధాని
శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలు ముఖ్యంగా మూడుండేవి. రాజకీయ సమైక్యత((Political Integration),), ఆర్ధికాభివృద్ధి (Economic Development), సాంఘిక నవీనత (Social Modernisation). ఆనాడు పత్రికలు తప్ప మరే దృశ్య, శ్రవ్య మాధ్యమాలు లేని కారణంగా రేడియోనే
బహుళంగా ఈ ఆశయాలు సిద్ధింప చేయటానికి, బహుళ ప్రాచుర్యానికి
ఉపయోగించేవారు. రేడియో ద్వారానే జాతీయ, సాంఘిక విశేషాలు, మార్పులు, వాతావరణ ఎగుడు దిగుళ్ళూ ప్రజలకి తెలిసేది. సాంఘిక సమైక్యతకి రేడియో
చిహ్నమైంది.
1950లలో 60లలో అమీన్ సయానీ
గారి బినాకా గీత్మాలా దేశాన్ని ఏలింది. ఆయన చక్కటి వాచికం, ఉచ్ఛారణ అనేకమందిని ఆకట్టుకున్నాయి.
హిందీ హీరో సునీల్ దత్, తెలుగు హీరో కొంగర
జగ్గయ్య రేడియోతోనే తమ జీవితాలని ప్రారంభించారు. 1967లో భారతదేశంలో 'వివిధ భారతి' అనే వ్యాపార రేడియో (Commercial Radio) ప్రారంభమైంది. ''యే వివిధ్ భారతీహై ఆకాశవాణీకా పంచరంగీ
ప్రోగ్రాం'' అంటూ మొదలయ్యేది. జయ్మాలా, స్పెషల్ జయ్మాలా, హవామహల్, ఇన్సేమలియే, సంగీత్ సరితా, భూలేబిసరే గీత్, చిత్రలోక్, సర్గమ్ కె సితారే, ఉజాలె ఉనికీయాదోం కే, ఛాయాగీత్ ప్రతీ శనివారం ''ఫౌజీ భాయియోంకేలియే'' అని దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి
పోరాడుతున్న సైనికుల వినోద, వికాసాల కోసం ఏదైనా
రంగానికి చెందిన ప్రముఖులని పిలిచి సినిమా పాటలు నిర్వహింపజేసేవారు. ఈ
కార్యక్రమాలు కొన్ని తరాల శ్రోతలని ఉర్రూత లూగించాయి. తర్వాత 1970వ దశకంలో ప్రాంతీయ వివిధ భారతీ
వచ్చింది. 1999లో FM రేడియో (Frequency Modulated
Radio) వచ్చింది. అప్పుడు 12 నగరాలలో 21 ఛానల్స్ పెట్టారు. 2005లో 242 ఛానల్స్ అయ్యింది. ఈ వివిధ భారతి, ఎఫ్ఎం రేడియోలలోని ప్రకటనల వలన రేడియోకి ఆదాయం చేకూరాలని భావన. కానీ
అది చాలా స్వల్పం.
రేడియోలో ప్రొద్దున్నే 6 గం|| నుంచీ 4 నిమిషాల పాటు సాగే భావన కార్యక్రమంలో
నేను 25 సం|| నుంచీ
పాల్గొంటున్నాను. విజయవాడ రేడియోలో కూడా 1983-86 మధ్య కాలంలో అనేక చర్చలలో Radio Talks లో పాల్గొన్నాను. కంప్యూటర్స్, సెల్ఫోన్లూ వచ్చి అనేక కళారంగాలనీ, సంస్క ృతినీ దెబ్బతీస్తున్నాయి.
రేడియోని చాలామంది మరిచిపోయారు. మరేం... డి.జి.పి. ఆఫీసులో
కమ్యూనికేషన్స్ ఒక విభాగానికి 'మార్కొని' అని పేరు పెట్టారు. విజ్ఞాన, వినోదాల పెట్టి రేడియో! చేయి జార్చకండి!
అమూల్యమైనది పోగొట్టుకుంటారు!!
అందుకే మన యెనెస్కో నవంబర్ 3, 2011న - జి 36/కె జనరల్ కాన్ఫరెన్స్లో ఫిబ్రవరి 13 నాడు 'వరల్డ్ రేడియో డే'గా ప్రకటించింది.
మనందరికీ ఆహ్లాదం కలిగించింది.
నాడు నేడు కూడా నవ్యపథóములేర్చి
దివ్యమార్గగామి తెలుగువాడు
ప్రాతకొత్తనడుమ బంగారు వంతెనల్
నిలిపినట్టివాడు తెలుగుబిడ్డ!
(నార్ల చిరంజీవి - 'తెలుగుపూలు')
''దేశభక్తి వెల్లువలా ప్రవహించాలి''.