యూనిట్

సవాళ్ళను సమయస్ఫూర్తితో, సమర్థవంతంగా ఎదుర్కోవాలి

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను మరింతగా నియంత్రించే ప్రణాళికలో భాగంగా 'రహదారి భద్రత' అంశంపై ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించాము. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర రహదారులలో గస్తీ నిర్వహిస్తున్న వాహనాలకు అదనంగా మరిన్ని వాహనాలను సమకూర్చాల్సిన ఆవశ్యకతను గుర్తించడమైనది. ప్రమాదాలు తీరు విశ్లేషించుటకు, బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించేందుకుగాను గస్తీ వాహనములు, అంబులెన్స్‌లు, టోల్‌ ప్లాజాలు ఇతర రహదారులుపై గల సిసి కెమెరాలను జిల్లా కేంద్రం, ప్రధాన కార్యాలయం నందలి కమాండ్‌ కంట్రోల్‌నకు అనుసంధానం చేయాలని నిర్ణయించాము. ఇందుకు గాను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా సేఫ్టీ అడ్వైజర్‌ వారి సమ్మతి, సహకారంతో మూడు నెలలలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా పోలీస్‌ సాంకేతిక విభాగాన్ని ఆదేశించడమైనది.

మాదక ద్రవ్యాల నియంత్రణ అంశంపై సంబంధిత శాఖల దక్షిణాది అధికారులతో కలసి ఒక రోజు వర్క్‌షాప్‌ను ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేశాము. మావోయిస్ట్‌లు వారి ప్రభావిత అటవీ ప్రాంతంలో గంజాయి సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నట్లు సంబంధిత ఎస్పీలు వివరించారు. డ్రోన్స్‌, రిమోట్‌ సెన్సింగ్‌ డాటా సేకరణ వంటి సాంకేతిక విధానాలతో వాటిని గుర్తించి ధ్వంసం చేసేవిధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది.  అదే విధంగా రాష్ట్రాల మధ్య సమన్వయంతో సరిహద్దు ప్రాంతాలలో సంయుక్త చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయగలమని ఏకాభిప్రాయం వ్యక్తమైంది. డ్రగ్స్‌ సరఫరా చేసే ముఖ్యంగా విద్యాసంస్థలకు చేరవేసే ముఠాలను గుర్తించి, వారిపై పి.డి యాక్ట్‌ ప్రయోగించడం ద్వారా ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఉన్నది. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులై వుండాలని పిలుపునిచ్చాము.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న 14 మంది యువ ఐపిఎస్‌ అధికారులతో సమావేశం నిర్వహించడమైనది. మావోయిస్ట్‌ ప్రభావిత మరియు సమస్యాత్మక ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్న వారి అనుభవాలను తెలుసుకొని, ప్రత్యేక పరిస్థితులు, ఘటనలలో అనుసరించాల్సిన విధానాల గురించి సీనియర్‌ ఉన్నతాధికారులతో కలసి దిశానిర్ధేశం చేయడమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎన్నో సవాళ్ళను చవిచూడాల్సి వస్తుందని, వాటిని సమయస్ఫూర్తితో, సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకుసాగాలని సూచించాము. అంతకంతకు అధికమవుతున్న సైబర్‌ నేరాల పట్ల అవగాహన పెంచుకొని, వాటిని అరికట్టడానికి వినూత్న సాంకేతిక విధానాలను అవలంభించాలని నిర్ధేశించడమైనది. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, వృద్దులు, పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ద, సానుభూతి కలిగి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పోలీస్‌ శాఖకు మంచి ఖ్యాతి తేవాలని ఆకాంక్షించాము.

గుజరాత్‌ వడోదరలో జరిగిన పోలీస్‌ టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌ నందు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ స్టాల్‌ను ప్రధాని         శ్రీ నరేంద్ర మోడీ గారు సందర్శించి, మన పనితీరును, అవలంభిస్తున్న నూతన విధానాలను ప్రశంసించారు. స్పందన, వీక్లీ ఆఫ్‌ సిస్టమ్‌ల గురించి అడిగి తెలుసుకొని..పూర్తి వివరాలను వారికి పంపవలసినదిగా స్టాల్‌ నిర్వాహకులను కోరారు. ఆధునిక సాంకేతికతను, వినూత్న విధానాలను అవలంభించడంలో మన శాఖ ఎల్లప్పుడూ ముందంజలో వుంటుందనడానికి ఇది మరో చక్కని తార్కాణంగా నిలుస్తుంది.

నేటి బాలలే రేపటి భావిభారత దిశానిర్ధేశకులు అనే దృక్పథంతో అనాథ బాలలు, సంరక్షణ తప్పిన బాలల జీవితాల్లో వెలుగు నింపే 'ముస్కాన్‌' కార్యక్రమాన్ని  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో 794 బృందాలతో జరిపిన తనిఖీలలో చేరదీసిన బాలలలో 2,774 మందిని వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించగా, మిగిలిన వారిని సంరక్షణాలయాలలో చేర్పించాము. ఇది నిరంతర ప్రక్రియగా మరింత బాధ్యతాయుతంగా కొనసాగించవలసిన ఆవశ్యకత ఉన్నది.      



వార్తావాహిని