యూనిట్

పది ప్రాణాలను బలిగొన్న ''సైనేడ్‌'' రాక్షసుడు

కనివినీ ఎరుగని మారణ హోమం .. కనుమరుగౌతున్న మానవత్వం..కోరలు చాచి కరాళ నృత్యం చేస్తున్న రాక్షసత్వం ..తమ స్వార్థం, తమ సౌఖ్యం కోసం ఆది మానవుడి కంటే క్రూరంగా,కర్కశంగా ప్రవర్తిస్తున్న ఆధునిక మానవుడి వికృతచర్యలకు ప్రత్యక్ష సాక్ష్యం...కరడు గట్టిన రాష్ట్ర, అంతర్‌ రాష్ట్ర నర హంతక ముఠాలకు కూడా సాధ్యం కానీ రీతిలో హత్యలకు పాల్పడిన మానవ మృగం..ఆ మృగానికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించిన మరో కిరాతకుడు. వీరి ఉన్మాదానికి బలి అయినది ఒకరో, ఇద్దరో కాదు..పది మంది నిండు ప్రాణాలు ..ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో మరో ప్రపంచాన్నే సృష్టిస్తున్న ఈ కాలంలో కూడా మూఢ నమ్మకాలూ, అత్యాశ, నాటు వైద్యం అనేది లోభాలనే ఆయుధంగా మలచుకొని వీరు తమ అకృత్యాలను సాగించారు. ఈ ఘోరకలిలో ఆఖరికి బంధువులను, ఆధ్యాత్మిక జీవనం సాగించే ఒక స్వామీజీని కూడా సమిధలు చేశారంటేనే మానవత్వం ఎంతలా మంట గలిసిందో అర్థం చేసుకోవచ్చు. 

అక్టోబర్‌ 16, 2019న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు స్థానిక కేపీటీడీ స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న కాటి నాగరాజు వట్లూరులోని తన నివాస సమీపంలో ఆకస్మికంగా చనిపోయాడు. అతని వద్ద 

ఉన్న రూ. 1,90,000 నగదు, ఒంటిపై బంగారు నగలు మాయం కావడంతో అది హత్య కేసుగా నిర్ధారణకు వచ్చి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ ఏలూరు డిఎస్‌పీ దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసి తక్షణమే పరిశోధన ప్రారంభించారు. కుటుంబ సభ్యులు మరియు ఇతరుల ద్వారా సేకరించిన సమాచారంపై వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ ఇటీవల నాగరాజుతో బాగా సన్నిహితంగా మెలుగుతున్నట్టు, చనిపోయే ముందు కూడా అతనితోనే ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శివను అదుపులోకి తీసుకొని తమదైన శైలి విచారణ చేయడంతో నాగరాజు హత్యతో పాటు తన ధన దాహం కోసం గతంలో చేసిన తొమ్మిది హత్యల ఘోరకలిని వెల్లడించి దిగ్భ్రాంతి కలిగించాడు.  

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెంకటాపురం పంచాయితీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్‌ శివ గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. అది కలసి రాకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించడానికి రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌, గుప్త నిధులు, రంగురాళ్లు, ధనం, బంగారం రెట్టింపు చేయడం వంటి మోసపూరిత, మూఢ నమ్మకాలను నమ్ముకున్నాడు. వీటిని ఆశగా చూపి డబ్బు సంపాదించడానికి గతంలో ఇటువంటి మోసాలలో అనుభవం ఉన్న విజయవాడకు చెందిన షేక్‌ అమీనుల్లా అలియాస్‌ బాబును సంప్రదించాడు. తన మాయలో పడిన వారిని సులువుగా చంపి, దోచుకోవడానికి ఏదైనా విష పదార్థం లాంటిది ఇవ్వవలసిందిగా కోరాడు. ఇందుకు సమ్మతించిన బాబు తన వద్ద ఉన్న సైనేడ్‌ ఇచ్చి పంపాడు. అప్పటి నుండి తను లక్ష్యంగా చేసుకున్న వారిని దేవుని ప్రసాదమని, ఆయుర్వేద మందు అని నమ్మించి తినిపించి, వారు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం వారి వద్ద నగదు, నగలు దోచుకుపోయేవాడు. ఇలా మొత్తం 20 నెలల కాలంలో కృష్ణా, పశ్చిమగోదావరి,తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 10 మందిని హత్య చేసి, సొత్తు దోచుకున్నాడు.


ఎప్పుడు.. ఎవరిని.. ఎలా...?

1) ఫిబ్రవరి 15, 2018న నూజివీడుకు చెందిన వల్లభనేని ఉమా మహేశ్వర రావును రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ కొనిపెడతానని చెప్పి, గోపవరం తోటలోనికి తీసుకుపోయి, సైనేడ్‌ను ప్రసాదంగా ఇచ్చి చంపేసి అతని వద్ద నుండి 4,00,000లు మరియు వెండి ఉంగరం దోచుకున్నాడు. 

2) మార్చి2, 2018న మర్రిబంధం గ్రామానికి చెందిన పులుపు తవిటయ్యకు అతని డబ్బును రెట్టింపు చేస్తానని 8,00,000లు తీసుకొని సైనేడ్‌ ఇచ్చి చంపి, వెండి ఉంగరం దోచుకున్నాడు. 

3) మార్చి 22, 2018న ఆగిరిపల్లికి చెంది విజయవాడలో నివసిస్తున్న గండికోట భాస్కరరావు డబ్బు రెట్టింపు చేస్తానని నమ్మబలికి సైనేడ్‌ ప్రసాదంగా ఇచ్చి చంపి అతని వద్ద నుండి 1,00,000లు దోచుకెళ్ళాడు.

4) మార్చి 31, 2018న గన్నవరం ముస్తాబాద్‌కు చెందిన కడియం బాల వేంకటేశ్వర రావు అనువాని నుండి 2,90,000లు అప్పుగా తీసుకొని మరలా చెల్లించకుండా ప్రసాదంలో సైనేడ్‌ కలిపి ఇచ్చి చంపి అతని వెండి ఉంగరం దొంగిలించాడు. 

5) ఏప్రిల్‌ 14, 2018న ఏలూరు వంగాయగూడెంలోని మణికంఠ ఫైనాన్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్న చోడవరపు సూర్యనారాయణ అలియాస్‌ సూరిబాబు అనువాని దగ్గర డబ్బులు ఉండడం గమనించి, అతనికి సైనేడ్‌ను ప్రసాదంగా ఇచ్చి చంపి అతని వద్ద నుండి 5,00,000లు నగదు రెండు వెండి ఉంగరాలు దోచుకున్నాడు.

6) ఏప్రిల్‌ 28, 2018న రాజమహేంద్రవరంలోని పురుషోత్తపట్నంలోని ఆశ్రమానికి చెందిన శ్రీ శ్రీ రామకృష్ణానంద స్వామీజీని కలిసి సైనేడ్‌ను ఆయుర్వేద మందుగా ఇచ్చి చంపి అతని దగ్గర దోచుకోవడం కుదరక పారిపోయి వచ్చాడు.

7) డిసెంబర్‌ 23, 2018న రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లు దగ్గరలో ఉంటున్న బంధువైన కొత్తపల్లి రాఘవమ్మకు షుగర్‌కు మందు అని చెప్పి నమ్మించి తినిపించి చంపాడు. తదుపరి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రం తాడును దొంగిలించాడు.

8) జనవరి 12, 2019న రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన వరుసకు వదిన అయ్యే నాగమణి అను ఆమెకు ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు చేసే ప్రసాదమని నమ్మించి సైనేడ్‌ ఇచ్చి చంపి ఐదు లక్షల డబ్బు, ఒంటి మీదున్న నగలు దోచుకుపోయాడు.

9) ఆగస్టు 30, 2018న ఏలూరు హనుమాన్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని రావులమ్మకు సైనేడ్‌ ప్రసాదంగా ఇచ్చితినిపించి ఆమె చనిపోయిన తరువాత ఇంట్లోని, ఒంటి మీద ఉన్న నగలను ఎత్తుకెళ్లాడు.

10) చివరిగా అక్టోబర్‌ 16, 2019న ఏలూరులోని వట్లూరుకు చెందిన కాటి నాగరాజును రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ కొనిపెడతానని నమ్మించి, సైనేడ్‌ ప్రసాదంగా ఇచ్చి తినిపించి చంపాడు. అతని వద్ద ఉన్న 1,90,400 నగదు, మరియు ఒంటి మీద బంగారు నగలను దొంగిలించాడు.

ఈ విధంగా పదిమందిని హతమార్చి దోచుకున్న రూ. 28,50,000ల సొత్తులో కొంత మొత్తం సొంత ఖర్చులకు వాడుకొని, మిగిలిన డబ్బుతో ఏలూరు ఎన్టీఆర్‌ కాలనీలో ఒక ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుండి కొద్ది మొత్తంలో సైనేడ్‌, 231/2 సవర్ల బంగారం, రూ.1,63,400లు నగదు స్వాధీనపరుచుకున్నారు.

చనిపోయిన వారి శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకుగాని, బంధువులకుగాని ఏమాత్రం అనుమానం రాకపోవడంతో వీరి అఘాయిత్యాలకు అడ్డులేకుండా పోయింది. 

వ్యాయామ ఉపాధ్యాయుడు కాటి నాగరాజు హత్య కేసును నిశితంగా దర్యాప్తు చేసిన పోలీసులు వరుస హత్యల భయంకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఈ ఘోరకలికి అడ్డుకట్ట వేశారు. 

గతంలోని హత్యల మిస్టరీని ఛేదించడమే కాకుండా, భవిష్యత్‌లో జరుగబోవు మరిన్ని దారుణాలను తమ అంకితభావం, ప్రతిభా నైపుణ్యాలతో అడ్డుకట్ట వేసిన ఏలూరు డిఎస్‌పి దిలీప్‌ కిరణ్‌ ఆధ్వర్యంలోని ఏలూరు రూరల్‌ సిఐ శ్రీనివాసరావు మరియు వారి సిబ్బంది అయిన ఏలూరు రూరల్‌ ఎస్సై సురేష్‌ చావా, ఏఎస్సై బి. పూర్ణచంద్ర రావు, కానిస్టేబుల్స్‌ ఏ.నాగేశ్వర రావు, వి.సీతయ్య, ఎన్‌. కిషోర్‌ బృందాన్ని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ ప్రత్యేకంగా అభినందించి, రివార్డ్స్‌ను అందించారు.


వార్తావాహిని