యూనిట్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ వివరాలను వెల్లడించారు. ఇరగవరం మండలం ఒగిడి గ్రామానికి చెందిన దొండ వెంకట సుబ్బారావు అలియాస్‌ చినబాబు విదేశాలకు పంపి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం వేమవరపుపాడుకు చెందిన పులిదిండి నాగలక్ష్మికి దుబాయ్‌లో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చినబాబు నమ్మబలికాడు. మొగల్తూరులో నర్సుగా పనిచేసిన ఈమె వద్ద రూ.లక్ష తీసుకున్నాడు. జులై 14న నాగలక్ష్మిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి విమానం ఎక్కించాడు. దుబాయ్‌ వెళ్లాక అక్కడ ఆకుమర్తి జ్యోతి అనే మహిళ నాగలక్ష్మిని రిసీవ్‌ చేసుకొని తీసుకెళ్లింది. దుబాయ్‌లోని జ్వాల్ఫా అనే ప్రాంతంలో నాగలక్ష్మిని ఉంచారు. చినబాబు రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నా ఉద్యోగ వీసా కాకుండా కేవలం పర్యాటక వీసాతో మహిళలను పంపిస్తూ మోసగిస్తున్నాడు. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్లి ఇళ్లల్లో పనులు చేయమని అక్కడ నిర్వాహకులు వేధిస్తున్నారు. సరిగా ఆహారం కూడా పెట్టడం లేదు. ఈ కేసులో మరో కీలక నిందితురాలు, దుబాయ్‌లో ఉంటూ చక్రం తిప్పుతున్న పాలకొల్లుకు చెందిన జ్యోతి, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

వార్తావాహిని