యూనిట్

చేతన- శాపంగా మారిన ప్రేమ

ప్రేమించిన ప్రియుడే కాలయముడైన వేళ. ఇతర మతానికి చెందిన యువకుడి చేతిలో మరణించిన యువతి కేసును అత్యంత చాకచక్యంగా చేధించిన ఇన్స్‌పెక్టర్‌ అంజూయాదవ్‌ గారిపై ఈనెల 'చేతన' శీర్షికలో తెలుసుకుందాం

ఫిబ్రవరి 9, 2016న ఉదయం 11 గంటల వుతోంది తిరుపతి పశ్చిమ పోలీస్‌స్టేషన్‌లో ఎ.ఎస్‌.ఐ. కె.రాజేంద్రన్‌ కేసుల ఫైలు తిప్పిచూసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓ మహిళా వచ్చింది. సార్‌ మా కూతురు కనబడుటలేదని చెప్పింది. దీంతో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని ఎ.ఎస్‌.ఐ. చెప్పారు. వివరాలు చెప్పమన్నారు. వాల్మీకిపురం, పునుగుపల్లి మాది మా భర్తపేరు ఎస్‌.ఖాదర్‌వలి నా పేరు షేక్‌ జిలాని మా కూతురు షేక్‌ సబీహబాను. మా ఇంటినుంచి వెళ్ళిపోయి బైపాస్‌రోడ్డులోని సుబ్బారావు కాంపౌండ్‌లో వుంటున్న విజయభారతి ఆటోమొబైల్‌లో ఉద్యోగం చేస్తోంది. అయితే సదరు యజమాని మా ఇంటికి ఫోన్‌ చేసి మీ అమ్మాయి సబీహబాను డ్యూటీకి రావడం లేదని చెప్పారు. దీంతో అమ్మాయి రూము వద్దకు పోయి చూసినా లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మీకెవరిపైనన్న అనుమానం ఉందా అని అడగగా, అమ్మాయితో చనువుగా వుండే వేమనారాయణరెడ్డి అనే అతనిపై అనుమానముందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వివరాలు సేకరించిన పోలీసులు సిఆర్‌ నం: 12/2016 యు/హెచ్‌ ఉమెన్‌ మిస్సింగ్‌కింద కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఎ.ఎస్‌.ఐ. రాజేంద్రన్‌ విశాఖలోని ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌రివ్యూ-2016 డ్యూటీ ముగించుకొని అప్పుడే డ్యూటీలో చేరిన ఇన్స్‌పెక్టర్‌ అంజూ యాదవ్‌గారికి కేసు ఫైలును అప్పగించారు ఎ.ఎస్‌.ఐ. వెంటనే ఆలోచించ కుండా ఫైలు తిరగేసిన ఇన్స్‌పెక్టర్‌ ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితునిపై నిఘా పెట్టాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వారి ఇరువురి ఫోన్‌ కాల్స్‌ డేటాపై, గాలింపుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తులో ఫిబ్రవరి 12న కాల్‌డేటా, టవర్‌ లొకేషన్‌ విశ్లేషణ చేయగా, అనుమానితుడు వేమనారాయణరెడ్డి, బాధితురాలు సబిహాలు ఒకే పరిధిలో ఉన్నట్లు తేలింది. 13న అనుమానితుడు తిరుపతిలో ఉన్నట్లు అందిన సమాచారంపై పెద్దమనుషులు వి.ఆర్‌.ఒ., శానిటరీ ఇన్స్‌పెక్టర్లను తీసుకొని సి.ఐ. అంజుయాదవ్‌, ఎస్‌.ఐ. జయస్వాములు, ఎ.ఎస్‌.ఐ. రాజేంద్రన్‌, కానిస్టేబుళ్ళు మునిరాజు, సురేష్‌, శ్రీహరి, రాజశేఖర్‌లతో కలిసి తిరుపతి నగరంలోని రాజన్నపార్కు దగ్గర ఎపి 03ఎఫ్‌ 3271 మెరున్‌ కలర్‌ స్ప్లెడర్‌ బైక్‌పై వస్తున్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులను చూసిన వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించావని పోలీసులు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇవ్వగా నా పేరు వేమ నారాయణరెడ్డి అంటూ తన దుశ్చర్యలను చెప్పుకొచ్చాడు. 

నాపేరు వేమ నారాయణరెడ్డి, మాది గంగిరెడ్డిపల్లి గ్రామం ఎంసీఏ వరకు చదువుకున్న నేను వాల్మీకిపురం ఎన్‌.టి.ఆర్‌. డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ ఫ్యాకల్టీగా జాయిన్‌ అయ్యాను. ఆ సమయంలో అక్కడ డిగ్రీ చదివే, వాల్మీకిపురంకు చెందిన షేక్‌ సబిహాబానుతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది, నేను సబిహాను మార్కాపురంలో ఎంబిఏ జాయిన్‌ చేయించాను, ఆమె చదువు ఖర్చులు కూడా నేనే పెట్టుకున్నాను. సబిహా చదువు అయిపోయిన తర్వాత 2013లో వాల్మీకిపురంలో గణేష్‌ ఇంటర్నేట్‌ సెంటర్‌ ఓపెన్‌చేసి అందులో సబిహాను ఫ్యాకల్టీగా చేర్చుకున్నాను. తరువాత మా ఇద్దరి మధ్య శారీరక సంబంధంకు దారితీసింది. ఇద్దరం పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకోగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా ఇరువురి పెద్దలు మాపై దాడికూడా చేశారు. అనంతరం ఆమెను ఇక్కడ ఉంచితే నాకు దక్కదనే ఉద్దేశ్యంతో ఆమెను ఇంటిలోనుంచి ఎవరికీ చెప్పకుండా రావాల్సిందిగా సలహా ఇచ్చాను. నా సలహా ప్రకారం సబిహా ఇంటిలో ఎవరికి చెప్పకుండా వచ్చింది. దీంతో ఆమెను బెంగళూరుకు పంపించి హాస్టల్‌ ఉంచి ఉద్యోగ ప్రయత్నాలు చేయించా.. అయినా ఉద్యోగం లభించలేదు. చివరకు వాల్మీకిపురంలోని టి.వి.ఎస్‌. షోరూంలో జాయిన్‌ చేయిం చాను. అనంతరం సబిహా 2015 సంవత్సరం మార్చిలో నెట్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ కావాలని తిరుపతికి వచ్చింది. నేను నా ఫ్రెండ్స్‌ హరి, రెడ్డప్ప, బాలాజీల సహాయంతో ఆర్‌.ఎస్‌.గార్డెన్స్‌లో డాక్టర్‌ సుబ్బారావు కాంపౌండ్‌లోని ఓ రూమ్‌ను రూ.1400కు తీసుకొని సబిహాను రూములో ఉంచి అప్పుడప్పుడు వచ్చి బాడుగ ఖర్చు లకు డబ్బులు యిచ్చిపోతుండేవాడినని ఇన్స్‌పెక్టర్‌ అంజుయాదవ్‌ ముందు నింది తుడు తన నేర ప్రవృత్తిని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలు చెప్పమని అడుగగా చెప్పడం ప్రారంభించాడు వేమ నారాయణరెడ్డి. ఇక తన సంపాదనే కాకుండా సబిహా కూడా ఏదో ఒక ఉద్యోగంలో చేరితే బాగుండునని భావించి ముందుగా తన పేరును సంధ్యగా మార్చుకోమని చెప్పాము, అలాగే అంది సబిహా బాను. తిరుపతి నగరంలోని బైపాస్‌రోడ్డు దగ్గర వున్న విజయ భారతి టి.వి.ఎస్‌. షోరూంలో జాయిన్‌ చేశాను. అప్పటివరకు నాతో బాగానే ఉంది. ఎప్పుడైతే షోరూంలో జాయిన్‌ చేశానో ఇక నన్ను మరచిపోవడం, దూరంగా పెట్టడం ప్రారంభించింది. సబిహాబానుకు నాపై ప్రేమ తగ్గిపోవడానికి కారణాలేమని విచారణ చేయగా అదే షోరూంలో పనిచేసే మనోజ్‌కుమార్‌ అనేవ్యక్తితో సబిహా చాలా చనువుగా ఉంటోందని వేమ నారాయణ రెడ్డికి తెలిసింది. ఎందుకు నన్ను పట్టించు కోవడం లేదు...మీ ఆఫీసులో మనోజ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావ్‌ అని నిలదీస్తే... అవును నేను మనోజ్‌ను ఇష్టపడుతున్నాను.. మేము ఇద్దరం జనవరిలో 13న షిర్డీకి కూడా వెళ్ళివచ్చాము అని చెప్పింది. దీంతో వేమ నారాయణరెడ్డికి ఎక్కడలేని కోపం వచ్చింది. అంతేకాదు నాకు మనోజ్‌ స్కూటర్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు అని చెప్పింది. ఏమి చేయాలో అర్థంకాని నారాయణరెడ్డి అదే కోపంతో తన సొంత గ్రామానికి వెళ్ళాడు. సబిహా పెళ్ళివిషయంపై ఇంటిలో అమ్మా నాన్నలతో గొడవ పడ్డాడు. జనవరి 28న ఇంటిలో గొడవపడి రాత్రి 9 గంటల సమయంలో తిరుపతికి వచ్చి, సబిహా రూము వద్దకు వెళ్ళాడు, అయితే ఆ రాత్రి సబిహా రూమ్‌లో లేదు.

మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సబిహా వద్దకు వెళ్ళి పెళ్ళిచేసుకోవాలని గొడవ పెట్టాను. జనవరి 29న కూడా సబిహా, నారాయణరెడ్డి ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం ఇరువురు కొద్దిసేపు గొడవలు మరిచిపోయారు. డ్యూటీ కి వెళ్లిన సబిహ రాత్రి  8.30గంటలకు రూమ్‌కు వచ్చింది. ఇరువురు కలిసి రాత్రి 9 గంటలకు రాజ్‌పార్క్‌ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్ళారు. ఆ సమయంలో నారాయణరెడ్డికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎందుకంటే నారాయణరెడ్డి పక్కన ఉండగానే సబిహా మనోజ్‌తో ఫోన్‌లో మాట్లాతూనే ఉంది. గంటలకొద్ది ఫోన్‌లో మాట్లాడటం నారాయణరెడ్డి సహించలేక పోయాడు.   సబిహా చేసే విఫలప్రేమను మనసులో పెట్టు కున్న నారాయణరెడ్డి సహనాన్ని భరిస్తూనే ఇరువురు రాత్రి 10.30 గంటలకు రూమ్‌కు వచ్చారు. స బిహా ద్రాక్షపండ్లు తింటుండగా వేమ నారా యణరెడ్డికి మనోజ్‌తో సబిహా సాన్నిహిత్యాన్ని జీర్ణించుకోలేక పోయాడు. నాకు దక్కనిది ఇంకా ఎందుకు తుదముట్టించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎలాగైనా సబిహను చంపాలనుకుని అక్కడే ఉన్న టవల్‌తో ఆమె మెడకు చుట్టి గట్టిగా లాగాడు. కొంచెంసేపటికి సబిహా ఊపిరాడక మరణించింది. వెంటనే సబిహాను బెడ్‌షీట్‌లో కట్టేసి, మరుసటి రోజు జనవరి 30న తెల్లవారుజామున 4 గంటలకు రూమ్‌కు తాళం వేసి ఊరికెళ్ళాడు నిందితుడు వేమ నారాయణరెడ్డి. ఊరిలో రామచంద్రయ్య అనే వ్యక్తి వద్ద రూ. 4వేలు అప్పు తీసుకొని తిరిగి 11 గంటలకు తిరుపతికి వచ్చి పసుపర్తి సూపర్‌మార్కెట్‌లో నల్లని పెద్ద ట్రాలీ లగేజి బ్యాగును, నాఫ్తలీన్‌ గుళికలను కొనుగోలు చేశాడు. సబిహ మృతదేహాన్ని మూడో కంటికి కనబడకుండా ఎలా చేయాలా? అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. తిరుపతి నగరంలో నారాయణరెడ్డి చిన్ననాటి స్నేహితుడు ఇడగొట్ట శ్రీరాములు నగరంలో ఆటో నడుపుతున్నాడు. వెంటనే శ్రీరాములుకు ఫోన్‌ చేసి తన రూమ్‌వద్దకు రావాలని చెప్పాడు. వెంటనే రూమ్‌కి వెళ్ళి సబిహా మృతదేహాన్ని బ్యాగులో సర్ది, ఆటోవచ్చిన తరువాత బ్యాగను సామాన్లను ఆటోలో సర్దాడు. శ్రీరాములుకు విషయం చెప్పకుండా అతనికి టూ వీలర్‌ ఇచ్చి, ఆటోను తీసుకొని సాయంత్రం 5 గంటలకు తరిగొండలోని ఇంటివద్ద ఆటోలోని సామాన్లు దింపాడు. ఆటో డ్రైవర్‌ అందులో ఏవో ఇంటి సామాన్లు ఉన్నాయనుకున్నాడు. ఏమాత్రం అను మానం రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. జరిగిన విషయాన్ని నారాయణరెడ్డి అమ్మా సుశీలమ్మ, నాన్న చిన్నప్పరెడ్డిలతో చెప్పాడు. చేసేదేమి లేక అమ్మానాన్నలు నారాయనరెడ్డి తో చేతులు కలిపారు. సబిహ శవాన్ని ఎలా గైనా ఎవరి కంట కనబడకుండా చేయాలనే ఉద్దేశ్యంతో అర్ధరాత్రి పెరట్లో గొయ్యి తవ్వి, ఎవరికి అనుమానం రాకుండా గొయ్యిలో సబిహా శవాన్ని వేసి పైన మట్టి కప్పారు. అనంతరం అక్కడ ఎండు కట్టెలు వేసి, శవాన్ని తెచ్చిన బ్యాగ్‌ ఇతర సామాగ్రిని కాల్చి వేశారు. దీనిలో తల్లిదండ్రులు కూడా పాత్ర దారులుగా మారారు. ఈ తంతంగాన్ని నారాయణరెడ్డి ఇన్స్‌పెక్టర్‌ అంజూ యాదవ్‌కు చెప్పాడు. అమ్మాయికి సంబంధించిన ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను వాల్మీకిపురంలోని నారా యణరెడ్డి ఇంటర్నెట్‌షాపులో సిపియూలో దాచి పెట్టాడు. పదిరోజుల తర్వాత ఫిబ్రవరి 13న తిరుపతికి వచ్చానని నారాయణరెడ్డి చెప్పుకొచ్చాడు. 

ఈ విషయాన్ని వాల్మీకిపురం ఇన్స్‌పెక్టర్‌ శ్రీధర్‌నాయుడుకు పైన జరిగిన సంఘటన వివరాలను తిరుపతి పశ్చిమ పోలీస్‌స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ అంజుయాదవ్‌ తెలిపారు.  ఫిబ్రవరి 14న ఉదయం ఇన్స్‌పెక్టర్‌ అంజుయాదవ్‌, ఎస్‌.ఐ., ఎ.ఎస్‌.ఐ., సిబ్బందితో నారాయణరెడ్డి స్వగ్రామం, ఘటనా స్థలానికి గుర్రంకొండ తహసీల్దార్‌, వాల్మికిపురం ఆసుపత్రి డాక్టర్ల బృందం సమక్షంలో సబిహ మృతదేహాన్ని వెలికితీయించి శవపంచనామా చేశారు. పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుని వద్ద వున్న బంగారు నగలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడు నారాయణరెడ్డిని రిమాండ్‌కు పంపించడం జరిగింది.   కేసును చాకచక్యంగా చేధించినందుకు పశ్చిమ ఇన్స్‌పెక్టర్‌ అంజుయాదవ్‌, పోలీసు సిబ్బందిని తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి. గోపినాథ్‌జెట్టి అభినందించి, రివార్డు ప్రకటించారు.

 

 

వార్తావాహిని